వచ్చే మూడేళ్లలో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తాం: కర్ణాటక ప్రభుత్వం
మనదేశంలో వాయు కాలుష్యం ప్రమాదస్థాయిలను దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో దేశంలో పెరుగుతున్న కాలుష్య సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి, భారత రోడ్లపై పెట్రోల్, డీజిల్ వంటి సహజ ఇంధనాలతో నడిచే వాహనాలకు స్వస్తి పలుకుతూ, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతోంది.

ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా ప్రభుత్వం వివిధ రకాల రాయితీలను, ప్రత్యేక పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం ఫేమ్ (FAME) విధానాన్ని అమలు చేసింది.

దీని ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వటం జరుగుతుంది. దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇటీవలే 'స్విచ్ ఢిల్లీ' అనే ప్రచారానికి తెరలేపింది. ఈ ప్రచారం ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

తాజాగా, ఢిల్లీ బాటలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ ప్రచారంలో చేరింది. రానున్న రెండు మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే వాహనాల్లో దాదాపు 50 శాతం వాహనాలను ఎలక్ట్రిక్గా మారుస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం సిఎన్ అశ్వనాథ్ నారాయణ్ అన్నారు.

వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు. హార్వర్డ్ ఇండియా సమావేశానికి హాజరైన డిప్యూటీ సిఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల నుండి కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకోబోతోందని చెప్పారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే సంస్థలతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఇ-మొబిలిటీ పథకం కింద రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, ఐటి పార్క్, మార్కెటింగ్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు.

ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేసుకోవటానికి వీలుగా రాష్ట్రంలోని రహదారులపై కూడా ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా, హైటెక్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు గానూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు పరిశోధనా కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్లో పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకుంటామని నారాయణ్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎక్కువ రేంజ్ను అందించే బ్యాటరీలను తయారీ కోసం పరిశోధనలు, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలలో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








