మెర్సిడెస్ బెంజ్ని ఓవర్టేక్ చేసిన బిఎమ్డబ్ల్యూ!
మార్చి 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన లగ్జరీ కార్ల వివరాలు వెల్లడయ్యాయి. గత నెలలో భారత లగ్జరీ కార్ మార్కెట్ను శాసించే మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ను బిఎమ్డబ్ల్యూ అమ్మకాల పరంగా అధిగమించింది. సెగ్మెంట్ అమ్మకాలు 42 శాతం తగ్గినప్పటికీ బిఎమ్డబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ను స్వల్ప తేడాతో అధిగమించింది.

గత మార్చి నెలలో ఫెరారీ బ్రాండ్ మినహా మిగిలిన అన్ని లగ్జరీ కార్ కంపెనీలు తమ అమ్మకాలు తగ్గినట్లు నివేదించాయి. ఈ విభాగంలో, మార్చి 2021లో మొత్తం 2,082 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. మార్చి 2020 నెలతో పోలిస్తే ఇది 42 శాతం తక్కువ. ఆ సమయంలో మొత్తం 3,610 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి.

మార్చి 2021లో జర్మన్ కార్ బ్రాండ్ బిఎమ్డబ్ల్యూ మొత్తం 826 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. గత సంవత్సరం ఇద సమయంతో పోలిస్తే ఈ బ్రాండ్ అమ్మకాలు 39 శాతం తగ్గాయి.

అంతకుముందు నెలలో మెర్సిడెస్ బెంజ్ 812 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే సమయంలో 942 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా అమ్మకాలు 13 శాతం తగ్గాయి. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 12 శాతం పెరిగి 39 శాతానికి చేరుకుంది.

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ గత నెలలో 214 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, జేఎల్ఆర్ అమ్మకాలు 58 శాతం క్షీణించాయి. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 4 శాతం పడిపోయి 10 శాతానికి తగ్గింది.

జేఎల్ఆర్ తర్వాతి స్థానంలో జర్మన్ కార్ బ్రాండ్ ఆడి ఉంది. గత నెలలో ఆడి మొత్తం 198 లగ్జరీ కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మార్చి 2020లో) ఇవి 452 యూనిట్లుగా ఉన్నాయి.

స్వీడన్ కార్ బ్రాండ్ వోల్వో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. గత నెలలో వోల్వో మొత్తం 96 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో 245 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో వోల్వో అమ్మకాలు 60 శాతం తగ్గాయి.

పోర్ష్ గత నెలలో 34 యూనిట్లను విక్రయించగా మార్చి 2020లో 69 కార్లను విక్రయించింది. పోర్ష్ అమ్మకాలు 50 శాతం క్షీణించగా, మార్కెట్ వాటా 0.3 తగ్గి 1.58 శాతానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో లంబోర్ఘిని, ఫెరారీ, రోల్స్ రాయిస్ మరియు బెంట్లీ కార్ బ్రాండ్లు ఉన్నాయి.

గత నెలలో ఫెరారీ 2 కార్లను విక్రయించగా, మార్చి 2020లో 1 కారును విక్రయించి 100 శాతం వృద్ధిని కనబరిచింది. గతేడాది లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పండుగ సీజన్లో లగ్జరీ కార్ అమ్మకాలు మెరుగుపడ్డాయి. కానీ, ఇటీవలి కాలంలో తిరిగి లగ్జరీ కార్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి.

కస్టమర్లను ఆకట్టుకునేందుకు లగ్జరీ కార్ల విభాగంలో బిఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలు నిరంతరం కొత్త మోడళ్లను తీసుకువస్తున్నప్పటికీ అమ్మకాలు మాత్రం మెరుగుపడటం లేదు. కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో ఈ కంపెనీలు విఫలమవుతున్నాయి. మరి ఈ కొత్త ఆర్థిక సంవత్సరమైనా లగ్జరీ కార్లకు కలిసొస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications








