Mahindra ఆగస్ట్ సేల్స్ అదుర్స్.. త్వరలోనే XUV700 బుకింగ్స్..
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) గత ఆగస్ట్ నెలలో ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. ఆగస్ట్ 2021లో కంపెనీ మొత్తం అమ్మకాలు 15,973 యూనిట్లుగా నమోదై, 17 శాతం వృద్ధిని కనబరిచాయి. గత ఏడాది ఇదే నెలలో ఇవి 13,651 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ఇందులో యుటిలిటీ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ గడచిన ఆగష్టు 2020 నెలలో 13,407 యూనిట్లను విక్రయించగా, ఆగస్ట్ 2021 నెలలో 15,786 యూనిట్లను విక్రయించి 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఆగస్టు 2021 లో ప్యాసింజర్ వాహన విభాగంలో వ్యాన్ అమ్మకాలు మాత్రం 23 శాతం తగ్గి 187 యూనిట్లుగా నమోదయ్యాయి.

నెలవారీగా (MoM) ప్రాతిపదికన చూసుకుంటే, కంపెనీ అమ్మకాలు 24.10 శాతం క్షీణతను నమోదు చేశాయి. Mahindra అంతకు ముందు నెలలో (జూలై 2021 లో) మొత్తం 21,046 యూనిట్ల (యుటిలిటీ వాహనాలు మరియు కార్లు)ను విక్రయించింది. ఆగస్ట్ 2021 లో ఇవి 15,973 యూనిట్లుగా ఉన్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2021 నుండి ఆగస్టు 2021 వరకూ గల అమ్మకాలను చూస్తే, ఈ సమయంలో Mahindra మొత్తం 80,221 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో విక్రయించిన వాహనాల సంఖ్య 36,618 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 119 శాతం పెరిగాయి.

రానున్న పండుగ సీజన్ లో Mahindra అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన తమ సరికొత్త ఎస్యూవీ XUV700 (ఎక్స్యూవీ సెవన్ డబుల్ ఓ). లేటెస్ట్ డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో రూపొందించిన ఈ ఎస్యూవీని భారత మార్కెట్లో రూ. 11.99 లక్షల నుండి రూ. 14.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో విడుదల చేయబడింది.

త్వరలోనే కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్ లను ప్రారంభించే అవకాశం ఉంది. Mahindra XUV700 ని ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్ మరియు అత్యాధునిక ఫీచర్లతో పరిచయం చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఎస్యూవీ కేవలం 5 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని, ఇది ఈ విభాగంలోనే మొట్టమొదటిదని కూడా కంపెనీ తెలిపింది.

రెండు ట్రిమ్ లు, నాలుగు వేరియంట్లు
ప్రస్తుతానికి, Mahindra XUV700 ని కంపెనీ MX మరియు AX అనే రెండు ట్రిమ్లలో మొత్తం నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. త్వరలోనే, ఇందులో మరిన్ని కొత్త వేరియంట్లను కూడా విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. ఇందులో 5 సీటర్ మరియు 7 సీటర్ ఆప్షన్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ట్రిమ్ లు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

Mahindra XUV700 లో రెండు ఇంజన్ ఆప్షన్ లలో మొదటిది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్పి పవర్ ను మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 185 బిహెచ్పి పవర్ ను మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

ఈ ఎస్యూవీని పూర్తిగా కొత్త డిజైన్ తో మరియు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో రూపొందించారు. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో ఆటో బూస్టర్ హెడ్ల్యాంప్లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పానోరమిక్ సన్రూఫ్, పర్సనలైజ్డ్ వాయిస్ అలర్ట్స్ మరియు డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, ఇటీవల Mahindra తమిళనాడులోని కాంచీపురంలో ఒక ప్రత్యేకమైన వెహికల్ టెస్టింగ్ ట్రాక్ ను కూడా ప్రారంభించింది. ఈ ట్రాక్ ను 'మహీంద్రా ఎస్యూవీ ప్రూవింగ్ ట్రాక్' (ఎమ్ఎస్పిటి) గా పిలుస్తారు. కంపెనీ తయారు చేయబోయే అన్ని వాహనాలను ఇదే ట్రాక్పై పరీక్షిస్తారు. Mahindra సంస్థ నిర్మించిన ఈ ఎస్యూవీ టెస్ట్ ట్రాక్ సుమారు 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

మహీంద్రా తయారు చేసే ఎస్యూవీల యొక్క వివిధ రకాల పరీక్షల అవసరాలను తీర్చడానికి కంపెనీ 20 రకాల బహుళ ప్రయోజన ట్రాక్లను సృష్టించింది. ఈ టెస్టింగ్ ట్రాక్ ను కేవలం వాహనాలను పరీక్షించడానికి మాత్రమే కాకుండా, ఆటోమొబైల్ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుందని Mahindra తెలిపింది. వచ్చే ఏడాది నుండి ఇది సాధారణ ఉపయోగం కోసం అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications