వాహనాల ధరలు పెంచిన మహీంద్రా; తక్షణమే అమల్లోకి..
ప్రముఖ దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ వాహనల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్కెట్లో మహీంద్రా విక్రయిస్తున్న ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ను వాహనాల ధరలను 1.9 శాతం మేర పెంచామని కంపెనీ తెలిపింది. దీనిని నగదు రూపంలో కన్వర్ట్ చేస్తే, ఈ ధరల పెరుగుదల మోడల్ను బట్టి రూ.4500 నుండి రూ.40,000 వరకు ఉంటుంది.

అయితే, గుడ్ న్యూస్ ఏంటంటే, జనవరి 1, 2021వ తేదీ నుండి జనవరి 7, 2021వ తేదీ మధ్య కాలంలో కొనుగోలు చేసిన లేదా బుక్ చేసుకున్న వాహనాల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని, వాటిని పాత ధరలకే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది.

కాగా, జనవరి 8, 2021వ తేదీ నుండి కొనుగోలు చేసే లేదా బుక్ చేసుకున్న వాహనాలకు మాత్రమే కొత్త ధరలు వర్తిసాయని మహీంద్రా వివరించింది. లాక్డౌన్, కరోనా కారణంగా కొంత మేర అమ్మకాలను కోల్పోయిన మహీంద్రా, కొత్త సంవత్సరంలో సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలని యోచిస్తోంది.

గత డిసెంబర్ 2020లో మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం 35,187 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ వాహనాల్లో ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు మరియు ఎగుమతులు కలిసి ఉన్నాయి. కాగా, డిసెంబర్ 2019లో ఈ మొత్తం వాహనాల సంఖ్య 39,230 యూనిట్లుగా నమోదైంది.

ఇదిలా ఉంటే, కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త 2020 మహీంద్రా థార్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే 2020 మహీంద్రా థార్ కోసం 6,500 యూనిట్ల బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. థార్ కోసం అనూహ్యమైన డిమాండ్ రావటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగిపోతోంది.

ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ అత్యధికంగా అమ్ముడవుతోంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఆఫ్-రోడ్ ఎస్యూవీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 50 శాతం అమ్మకాలు ఆటోమేటిక్ వేరియంట్ల నుంచి వస్తున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్లలలో కూడా ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా ఈ ఏడాది భారత మార్కెట్ కోసం సరికొత్త ఉత్పత్తులను ప్లాన్ చేసింది. ఇందులో అన్నింటి కన్నా ముందుగా కొత్త 2021 మహీంద్రా ఎక్స్యూవీ500 విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో కొత్త టియూవీ300, స్కార్పియో ఫేస్లిఫ్ట్, ఆటమ్ ఎలక్ట్రిక్ కార్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త తరం 2021 మహీంద్రా ఎక్స్యూవీ500 విషయానికి వస్తే, ఇది పూర్తిగా సరికొత్త డిజైన్తో రానుంది. ఈ మోడల్లో ఇప్పటివరకూ చిన్నపాటి అప్డేట్స్ మినహా డిజైన్ పరంగా ఎలాంటి మేజర్ అప్గ్రేడ్స్ లేవు. ఈ నేపథ్యంలో, కొత్తగా వస్తున్న మహీంద్రా ఎక్స్యూవీ500 మునుపటి కన్నా మరింత పెద్దగా, ఆకర్షణీయమైన డిజైన్ను కలిగి ఉండనుంది.


Click it and Unblock the Notifications








