చెన్నైలో మహీంద్రా 'ఆక్సిజన్ ఆన్ వీల్స్' క్యాంపైన్ ప్రారంభం; హైదరాబాద్లో కూడా..
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, గడచిన సోమవారం చెన్నై నగరంలో ఆక్సిజన్ ఆన్ వీల్స్ క్యాంపైన్ను ప్రారంభించింది. ఈ క్యాంపైన్ ద్వారా, మహీంద్రా ఆసుపత్రులకు మరియు రోగుల ఇళ్లకు వైద్య ఆక్సిజన్ను ఉచితంగా పంపిణీ చేయనుంది.

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఆస్పత్రులు మరియు ప్రజలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మహీంద్రా నేరుగా ఆస్పత్రులు మరియు రోగుల ఇళ్లకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసే విధంగా ఈ క్యాంపైన్ను ప్రారంభించింది.

కోవిడ్-19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో దేశం తీవ్ర ప్రాణవాయువు కొరతను ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో మహీంద్రా ఈ ప్రయత్నాన్ని తొలిసారిగా మహారాష్ట్రలో ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీ మరియు నోయిడా నగరాలకు ఈ సేవలను విస్తరించారు.

తాజాగా, ఈ ఆక్సిజన్ ఆన్ వీల్స్ క్యాంపైన్ను చెన్నైలో కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈ సేవలను మొత్తం 8 నగరాల్లో అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గత వారం, మహీంద్రా యొక్క ఆక్సిజన్ ఆన్ వీల్స్ క్యాంపైన్ను హైదరాబాద్లో కూడా ప్రారంభించారు.

ఈ విషయంపై ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానిస్తూ.. "ఆసుపత్రులు మరియు వైద్య కేంద్రాలకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయడానికి మేము 8వ నగరాన్ని చేర్చుతున్నాము. రాబోయే కాలంలో మరిన్ని కొత్త నగరాలను చేర్చుతాము మరియు కరోనాతో పోరాటం కొనసాగిస్తాము." అని ట్వీట్ చేశారు.

మహీంద్రా ఆక్సిజన్ ఆన్ వీల్స్ క్యాంపైన్ కోసం కంపెనీ తమ పాపులర్ బొలెరో పికప్ ట్రక్కులను ఉపయోగిస్తోంది. ఈ పికప్ ట్రక్కులు ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ డెలివరీ వ్యాన్ల పాత్రను పోషిస్తున్నాయి. మహీంద్రా పేర్కొన్న సమాచారం ప్రకారం, సంస్థ ఈ క్యాంపైన్ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 23,000కి పైగా ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు లేదా ఇతర వైద్య సదుపాయాలకు పంపిణీ చేసింది.

దేశంలో కరోనా మహమ్మారితో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 4.40 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, 5,764 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు పెరిగుదలతో రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా ప్రారంభించిన ఈ క్యాంపైన్తో కొంత మేర ఉపశమనం లభించనుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా విధించబడిన కరోనా లాక్డౌన్ కర్ఫ్యూల కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు మరియు డీలర్షిప్లు పూర్తిగా మూసివేయటం లేదా కొద్దిగంటలు మాత్రమే పనిచేయటం చేస్తు్ననాయి. ఈ నేపథ్యంలో, తమ కస్టమర్లకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు మహీంద్రా తమ వాహనాలపై వారంటీ వ్యవధిని జూలై 31, 2021 వరకూ పొడగించింది.

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పటికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై వారెంటీని మరియు సర్వీస్ గడువును పొడిగించాయి. ఇదే కోవలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఎంజి మోటార్, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా వారెంటీలను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే.


Click it and Unblock the Notifications