మహీంద్రా బుజ్జి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. ఈ-కెయువి100 ఆవిష్కరణ, డీటేల్స్!
భారతదేశంలో ప్రజలు మరియు వాహన తయారీదారులు క్రమంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు కదులుతున్నారు. తాజాగా, ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. మహీంద్రా తమ కాంపాక్ట్ ఎస్యూవీ కెయువి100 ప్లాట్ఫామ్ ఆధారంగా ఓ ఎలక్ట్రిక్ కారుని రూపొందించింది.

మహీంద్రా ఈ-కెయువి100 పేరుతో పిలువబడే ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ తమ వెబ్సైట్లో ఆవిష్కరించింది. అతి త్వరలోనే ఈ కారు మార్కెట్లో విడుదల కానుంది. మహీంద్రా తొలిసారిగా ఈ ఎలక్ట్రిక్ కారును 2020 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. ప్రీ-ప్రొడక్షన్ కాన్సెప్ట్గా కనిపించిన ఈ కారులో కంపెనీ తాజాగా ప్రొడక్షన్ వెర్షన్ను ఆవిష్కరించింది.

మహీంద్రా ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని తమ మహీంద్రా ఎలక్ట్రిక్ అధికారిక వెబ్సైట్లో రిలీజ్ చేసింది. ఈ కారు యొక్క కొన్ని చిత్రాలు వెబ్సైట్లో కూడా కనిపించాయి. ఈ కారును భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో సాధారణ ప్రజల కోసం ఎంట్రీ-లెవల్ ఈవీ గా పరిచయం చేయనున్నారు.

మహీంద్రా ఈ-కెయువి100 ఎక్స్టీరియర్ భాగాలను దాని ఐసి (ఇంటర్నల్ కంబషన్) ఇంజన్ వెర్షన్ నుండి స్పూర్తి పొంది డిజైన్ చేయబడ్డాయి. ఇది ఎలక్ట్రిక్ కారు కావడం వలన దీని ముందు వైపు రేడియేటర్ గ్రిల్ కనిపించదు. ఇప్పుడు ఈ గ్రిల్ స్థానంలో మెరుగైన ఏరోడైనమిక్స్ని అందించేలా కంపెనీ మార్పు చేసింది.

హుడ్ క్రింది భాగంలో ఉండే హెడ్లైట్స్ మరియు దాని మధ్యలో మహీంద్రా లోగో, లోగోకి ఇరువైపులా ఆరు యారో మార్క్స్తో కూడిన డిజైన్ ఉంటుంది మరియు ఇవి నీలం రంగు ఫినిషింగ్లో కనిపిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో రెండు ఛార్జింగ్ పోర్ట్లు ఉంటాయి. ఇవి కారుకు ఇరువైపులా ఫ్రంట్ ఫెండర్లపై అమర్చబడి ఉంటాయి. అంతేకాకుండా, కారు హెడ్ల్యాంప్లు మరియు టెయిల్ల్యాంప్లపై నీలిరంగు హైలైట్లు కనిపిస్తాయి.

ఫ్రంట్ బంపర్లో చాలా పెద్ద ఎయిర్ ఇన్లెట్ ఉంటుంది. కారును టో చేయటం కోసం ఇందులో టో హిచ్ కూడా ఉంటుంది. ఇకపోతే, ఇందులోని అన్ని ఇతర డిజైన్ అంశాలు దాని పెట్రోల్ వెర్షన్ మహీంద్రా కెయువి100 మాదిరిగానే ఉండటం గమనార్హం. ఎలక్ట్రిక్ వెర్షన్ను హైలైట్ చేసేందుకు కంపెనీ దీని ఎక్స్టీరియర్లో కొన్ని బ్లూ కలర్ డిజైన్ ఎలిమెంట్స్ను ఉపయోగించింది.

ఆటో ఎక్స్పో 2020లో కంపెనీ ఈ కారును కాన్సెప్ట్ రూపంలో ప్రవేశపెట్టినప్పుడు, ఈ ఎస్యూవీకి సంబంధించి కొంత సమాచారాన్ని కూడా కంపెనీ వెల్లడి చేసింది. దాని ప్రకారం, మహీంద్రా ఈ-కెయువి100లో 15.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తుంది. ఇది ఫ్రంట్ యాక్సిల్పై అమర్చిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్కు శక్తినిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 54 బిహెచ్పి శక్తిని (40 కివా) మరియు 120 న్యూటన్ మీటర్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ పూర్తి ఛార్జ్పై గరిష్టంగా 147 కిలోమీటర్ల రేంజ్ని ఇస్తుందని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేంజ్ చాలా తక్కువగా పరిగణించడం జరుగుతుంది.

రెగ్యులర్ ఏసి (ముందు కుడి ఫెండర్ ఫ్లాప్లో ఉండే) ఛార్జర్ను ఉపయోగించి కారు బ్యాటరీలను 0 నుండి 100 శాతం వరకు చార్జ్ చేయటానికి సుమారు 5 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. అదే, డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే కేవలం 55 నిమిషాల్లో బ్యాటరీలను 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ గతంలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications








