కరోనా నియంత్రణలో నేను సైతం అంటున్న మారుతి సుజుకి; వివరాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తూ ఎంతోమంది ప్రజలను పొట్టనపెట్టుకుంటోంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ కోసం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
ఈ సమయంలో హాస్పిటల్ లో బెడ్ల కొరత మరియు ఆక్సిజన్ కొరత ఉన్నందువల్ల వైద్య సిబ్బంది కూడా చాలామంది ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. ఈ సమయంలో ప్రజల క్షేమం కోసం దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి వైద్య అవసరాలకు ఆక్సిజన్ వాయువు అందించడానికి సంకల్పించింది.

దీని కోసం మారుతి సుజుకి కంపెనీ తన హర్యానాలోని తయారీ యూనిట్లను మూసివేస్తుందని తెలిపింది. అంతే కాకుండా గుజరాత్లోని తన తయారీ విభాగాన్ని మూసివేయాలని సుజుకి మోటార్ కూడా అధికారికంగా నిర్ణయించింది.
ప్రస్తుతం మారుతి సుజుకి మే 1 నుండి మే 9 వరకు కంపెనీలో వాహనతయారీ ఉండదని తెలిపింది. దీనికి బదులుగా ప్లాంట్ లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆక్సిజన్ను అందించి ప్రభుత్వానికి మద్దతుగా నిలువనుంది.
సాధారణంగా కార్ల తయారీ ప్రక్రియలో భాగంగా, మారుతి సుజుకి తన కర్మాగారాల్లో తక్కువ మొత్తంలో ఆక్సిజన్ను ఉపయోగిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో, ప్రాణాలను కాపాడటానికి అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ను ఉపయోగించాలని కంపెనీ నిర్ణయించింది.
ఇప్పటికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఎంజి మోటార్, సుజుకి మోటార్సైకిల్, హీరో మోటోకార్ప్ తమ ప్లాంటును మూసివేసి ఆక్సిజన్ తయారీకి సహాయం చేస్తున్నాయి.
భారతదేశంలో గడిచిన 24 గంటల్లో దాదాపు 3,293 మంది కరోనా వైరస్ వల్ల మరణించారు. దీనితో దేశం కరోనా వల్ల మరణించిన వారి జాబితాలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కొత్త కేసులు సంఖ్య 3.6 లక్షలకు పైగా ఉండగా, మొత్తం కేసులు 1.79 కోట్లకు పైగా చేరాయి. ఈ సమయంలో భారతదేశానికి ఆక్సిజన్ వంటివి చాలా అవసరం.
ఇప్పటివరకు భారతదేశంలో వరుసగా 7 వ రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అంటే గత 7 రోజులుగా ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలకు పైమాటే. దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు మరణించిన ప్రజల సంఖ్య అక్షరాల 2,01,187.


Click it and Unblock the Notifications








