సెప్టెంబర్ నెలలో పెరగనున్న Maruti Suzuki కార్ల ధరలు; త్వరపడండి!
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరోసారి కస్టమర్లపై తమ ధరాఘాతాన్ని సంధించనుంది. సెప్టెంబర్ నెలలో కంపెనీ మరోసారి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈ ఏడాది (2021లో) Maruti Suzuki ఇప్పటికే మూడుసార్లు తమ కార్ల ధరలను పెంచింది. కాగా, ఇప్పుడు వరుసగా నాల్గవసారి సెప్టెంబర్ 2021 కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. అయితే, ఈసారి ఎంత మేర ధరలను పెంచతున్నామని విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల కారణంగా తమ వాహనాల ఉత్పత్తి నిరంతరం ప్రభావితమవుతోందని, ఫలితంగా ఈ భారాన్ని స్వల్పంగా తమ వినియోగదారులపై బదిలీ చేయక తప్పడం లేదని Maruti Suzuki BSE కి రాసిన లేఖలో వెల్లడించింది. తాజా కార్ల ధరల పెరుగుదల సెప్టెంబర్ 2021 లో జరగనుంది.

కాగా ఏయే మోడల్ ధరలు ఎంత పెరుగుతాయనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. గత నెల జూలైలో, కంపెనీ తమ పాపులర్ హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ (Swift) మరియు అన్ని CNG వేరియంట్ల ధరలను రూ. 15,000 వరకు పెంచింది. అంతకు ముందు ఈ సంవత్సరంలో కంపెనీ తమ కార్ల ధరలను రెండుసార్లు పెంచిన విషయం తెలిసినదే.

ఎప్పటి మాదిరిగానే Maruti Suzuki కార్లకు మంచి డిమాండ్ ఉంటోంది, ఫలితంగా ఈ బ్రాండ్ కార్లకు అధిక బుకింగ్లు లభిస్తున్నాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్స్ కొరత, మారుతి సుజుకి ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. ఈ చిప్స్ కొరత కారణంగా, కంపెనీ కూడా తమ వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తోంది.

ఈ కారణంతో, Maruti కార్ల వెయిటింగ్ పీరియడ్ నిరంతరంగా పెరుగుతోంది, ప్రత్యేకించి CNG వేరియంట్ మోడళ్ల కోసం ఎక్కువగా వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఆగస్ట్ లో కంపెనీ మొత్తం 50,000 యూనిట్ల నుండి 60,000 యూనిట్ల మధ్యలో కార్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఉత్పత్తి తగ్గుదల కారణంగా కంపెనీ ఆదాయాలు రూ. 2,500 కోట్ల నుండి రూ. 3,000 కోట్ల వరకు తగ్గొచ్చని అంచనా.

ఈ పరిస్థితుల్లో, ప్రస్తుత పండుగ సీజన్లో Maruti Suzuki అందించే ప్రముఖ మోడళ్ల లభ్యత తగ్గవచ్చు. కోవిడ్-19 వ్యాప్తి తర్వాత, ఈ సంవత్సరం పండుగ సీజన్ లో మునుపటి కంటే ఎక్కువ కార్లు అమ్ముడవుతాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తంలో ఉత్పత్తిలో 5 శాతం తగ్గుదల (అంటే సుమారు 70,000 యూనిట్ల నుండి 80,000 యూనిట్ల తగ్గుదల) ఉండవచ్చని కంపెనీ అంచనా వేసింది.

కానీ ఒక్క ఆగస్టు నెలలోనే కంపెనీ మొత్తం ఉత్పత్తిలో మూడు వంతులు తగ్గించవచ్చు. ఈ నెలలో 1,10,000 యూనిట్ల నుండి 1,20,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. మానేసర్ ప్లాంట్ లో కార్ల ఉత్పత్తి ఆగస్టు నెలలో 45,000 యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. సాధారణంగా ఈ ప్లాంట్ లో ప్రతినెలా సగటున 65,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తారు.

డిస్కౌంట్ కంట్రోల్ పాలసీని అమలు చేసిన Maruti Suzuki; రూ.200 కోట్ల జరిమానా విధించిన CCI !
ఇదిలా ఉంటే, Maruti Suzuki అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో భారత కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) రూ. 200 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ తన డీలర్లపై 'డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ' ని అమలు చేయడం ద్వారా కస్టమర్లకు అందించే డీలర్ స్థాయి డిస్కౌంట్లపై ఆంక్షలు విధించిందని సిసిఐ పేర్కొంది.

సిసిఐ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. "డిస్కౌంట్ అమలు చేయడం ద్వారా ప్యాసింజర్ వాహన విభాగంలో రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్ (RPM) యొక్క పోటీ-వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడినందుకు గానూ Maruti Suzuki India Limited (MSIL) కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తుది ఉత్తర్వును జారీ చేస్తూ, సదరు సంస్థకు రూ. 200 కోట్ల పెనాల్టీ విధించడమైనది" అని పేర్కొంది.

సిసిఐ ప్రకటన ప్రకారం, Maruti Suzuki తన డీలర్లతో ఒక ఒప్పందాన్ని కలిగి ఉందని సిసిఐ కనుగొంది, దీని ద్వారా కంపెనీ నిర్దేశించిన దానికంటే ఎక్కువ డిస్కౌంట్ లను వినియోగదారులకు అందించకుండా డీలర్లు నిరోధించబడ్డారని తెలిపింది. ఇలా చేయటం వలన Maruti Suzuki డీలర్లు, కంపెనీ అనుమతించిన దానికంటే మించి వినియోగదారులకు అదనపు డిస్కౌంట్లు, ఉచితాలు మొదలైనవి ఇవ్వకూడదు.

ఒకవేళ ఎవరైనా డీలర్ తమ కస్టమర్ కి అదనపు డిస్కౌంట్లను అందించాలనుకుంటే, Maruti Suzuki నుండి ముందస్తు ఆమోదం పొందడం తప్పనిసరి. ఈ విషయంలో Maruti Suzuki డిస్కౌంట్ కంట్రోల్ పాలసీని ఉల్లంఘించిన ఏ డీలర్ అయినా, డీలర్షిప్పై మాత్రమే కాకుండా, డైరెక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, రీజినల్ మేనేజర్, షోరూమ్ మేనేజర్, టీమ్ లీడర్ మొదలైన వారిపై కూడా కంపెనీ పెనాల్టీ విధించే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications








