భారతదేశం నుండి 20 లక్షల మారుతి సుజుకి కార్లు ఎగుమతి!
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, విదేశీ ఎగుమతుల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. భారతదేశం నుండి ఇప్పటి వరకూ 20 లక్షల వాహనాలను ఎగుమతి చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

తాజగా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ మరియు విటారా బ్రెజ్జాలతో కూడిన లేటెస్ట్ షిప్మెంట్ను గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేసింది.

మారుతి సుజుకి ఇండియా తొలిసారిగా భారత్ నుండి వాహనాల ఎగుమతిని1986-87 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. ఈ సమయంలో కంపెనీ 500 కార్లతో కూడిన ఓ షిప్మెంట్ను సెప్టెంబర్ 1987లో హంగేరీకి రవాణా చేసింగి.

కాగా, మారుతి సుజుకి తమ విదేశీ ఎగుమతుల్లో మొదటి పది లక్షల మైలురాయిని 2012-13 ఆర్థిక సంవత్సరంలో సాధించింది. మొదటి పది లక్షల వాహనాల్లో 50 శాతం కంటే ఎక్కువ వాహనాలను ఐరోపాలోని అభివృద్ధి చెందిన మార్కెట్లకే ఎగుమతి చేసినట్లు కంపెనీ వివరించింది.

ఈ అంశంపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ.. గౌరవనీయ ప్రధానమంత్రి మిస్టర్ నరేంద్ర మోడీ ప్రకటించిన మేక్-ఇన్-ఇండియా నినాదానికి కంపెనీ కట్టుబడి ఉంటుందని, మారుతి సుజుకి ఇండియా గడచిన 34 సంవత్సరాలుగా భారతదేశంలో తయారు చేసిన వాహనాలను ఎగుమతి చేస్తూ వస్తోందని అన్నారు.

మారుతి సుజుకి నుండి 20 లక్షల వాహనాలను ఎగుమతి చేయటం వలన తాము గ్లోబల్ ఆటోమొబైల్ వ్యాపారంలో చాలా ప్రముఖంగా మారామని, ప్రస్తుతం తాము 100 దేశాల్లో 14 మోడళ్లు, దాదాపు 150 వేరియంట్లను ఎగుమతి చేస్తున్నామని ఆయన చెప్పారు. భారతదేశంలోని తమ ప్లాంట్లలో తయారయ్యే వాహనాలు నాణ్యత, భద్రత, డిజైన్ మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రపంచ ప్రమాణాల కారణంగా అధిక ఆమోదాన్ని పొందాయని కెనిచి చెప్పారు.

లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియా ప్రాంతాలలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై మారుతి సుజుకి ఇండియా ప్రత్యేక దృష్టిని సారించి, తక్కువ సమయంలో (8 ఏళ్లలో) రెండవ మిలియన్ ఎగుమతుల మైలురాయిని చేరుకోగలిగింది.

ఈ సమయంలో చిలీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంక వంటి మార్కెట్లలో మారుతి సుజుకి గణనీయమైన వాటాను పొందగలిగింది. ఆల్టో, బాలెనో, డిజైర్ మరియు స్విఫ్ట్ వంటి మోడళ్లు ఈ మార్కెట్లలో మంచి పాపులారిటీని దక్కించుకున్నాయి.

ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారుతి సుజుకి తమ ఉత్పత్తులను అందిస్తోందని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని, ఇవి కొత్త విభాగాలలో వినియోగదారులను ఆకర్షించడం ద్వారా తమ సంస్థ మరిన్ని పెద్ద మైలురాళ్లను సాధించటానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు.

మారుతి సుజుకి ఈ ఏడాది జనవరిలో, సుజుకి యొక్క పాపులర్ కాంపాక్ట్ ఆఫ్-రోడర్ జిమ్నీ ఎస్యూవీని భారతదేశంలోనే ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఈ మోడల్ భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








