అసలు డీజిల్ కార్లను తయారు చేసే ప్రసక్తే లేదు, ధరలు మరింత పెరిగే ఛాన్స్: తేల్చి చెప్పిన Maruti Suzuki
మైలేజ్కి ప్రధాన్యతనిచ్చే భారత మార్కెట్లో డీజిల్ కార్లకు ఒకప్పుడు భలే గిరాకీ ఉండేది. సాధారణంగా, పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే, డీజిల్ కార్ల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, ఈ రెండు ఇంధనాల మధ్య ఉండే ధరల వ్యత్యాసాన్ని మరియు డీజిల్ కార్లు అందించే అధిక మైలేజ్ అంశాలను పరిగణలోకి తీసుకొని కస్టమర్లు ఎక్కువగా డీజిల్ కార్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు.

అయితే, మన దేశంలో కఠిమైన బిఎస్6 కాలుష్య నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత డీజిల్ కార్ల ధరలు మరింత ప్రియం అయ్యాయి. అలాగే, పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల మధ్య ధరల వ్యత్యాసం కూడా భారీగా తగ్గింది. దీనికితోడు, కొత్త కాలుష్య నిబంధనలకు లోబడి దేశంలోని అనేక కార్ కంపెనీలకు డీజిల్ కార్లను తయారు చేయడం మరింత భారంగా మారింది.

ఇలాంటి అనేక కారణాల దృష్ట్యా భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మరియు ఒకప్పుడు అత్యధిక సంఖ్యలో డీజిల్ కార్లను విక్రయించిన దేశీయ కార్ కంపెనీ మారుతి సుజుకి అసలు డీజిల్ కార్లను తయారు చేయడమే పూర్తిగా నిలిపివేసింది. బిఎస్6 అప్గ్రేడ్స్ తర్వాత ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియా కేవలం పెట్రోల్ మరియు సిఎన్జి ఇంధనాలతో నడిచే కార్లను మాత్రమే తయారు చేస్తోంది.

అయితే, చాలా మంది ఔత్సాహికులు మారుతి సుజుకి బ్రాండ్ నుండి ఎప్పటికైనా బిఎస్6 అప్డేట్ తో డీజిల్ కార్లు రాకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, కంపెనీ ఇప్పుడు వారి ఆశల్ని అడియాశలు చేస్తూ ఓ ప్రకటన చేసింది. మారుతి సుజుకి ఇండియా (MSI) డీజిల్ కార్ విభాగంలోకి తిరిగి ప్రవేశించాలని ఏమాత్రం అనుకోవడం లేదని, వచ్చే 2023 లో ప్రవేశపెట్టబోయే తదుపరి దశ ఉద్గార నిబంధనల ప్రారంభంతో ఇటువంటి వాహనాల (డీజిల్ కార్ల) విక్రయాలు మరింత భారీ సంఖ్యలో తగ్గుతాయని భావిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం, భారతదేశంలో బిఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలులో ఉన్నాయి. కానీ, వచ్చే రెండేళ్లలో భారత ప్రభుత్వం ఈ ఉద్గార నిబంధనలను మరోసారి సవరించే అవకాశం ఉంది. ఈ తదుపరి దశ ఉద్గార ప్రమాణాల సవరణ తర్వాత, భారతదేశంలో డీజిల్ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మారుతి సుజుకి విశ్వసిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో కస్టమర్లు ఖరీదైన డీజిల్ కార్లను కొనుగోలు చేయడానికి బదులుగా పెట్రోల్ కార్లనే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా కస్టమర్లు ఎక్కువగా మరింత శుభ్రమైన పెట్రోల్ కార్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు కూడా డీజిల్ కార్ల అమ్మకాల తగ్గుదలకు కారణమైంది. ఈ విషయం మారుతి సుజుకి ఇండియా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సివి రామన్ పిటిఐతో మాట్లాడుతూ.. "మేము డీజిల్ స్పేస్లో ఉండబోవడం లేదు. మేము దానిని అధ్యయనం చేస్తామని మరియు కస్టమర్ డిమాండ్ ఉంటే తిరిగి అందులోకి రావచ్చు అని ముందే సూచించాము. కానీ ఇకపై, మేము డీజిల్ వాహనాల విభాగంలోకి రావాలని అనుకోవడం లేదు" అని చెప్పారు.

మారుతి సుజుకి ఇండియా భవిష్యత్తులో డీజిల్తో నడిచే కార్లను తయారు చేయకపోవడానికి ప్రధాన కారణం రాబోయే కఠినమైన ఉద్గార నిబంధనలే ప్రాథమిక కారణం అని ఆయన పేర్కొన్నారు. "2023 లో కొత్త దశ ఉద్గార నిబంధనలు వస్తాయి, ఫలితంగా డీజిల్ వాహనాల తయారీ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, మార్కెట్లో డీజిల్ కార్ల వాటా మరింత తగ్గవచ్చని మేము విశ్వసిస్తున్నాము. ఈ (డీజిల్ కార్ల) విభాగంలో పోటీ గురించి మాకు తెలియదు కానీ, మారుతి సుజుకి సంస్థకి మాత్రం ఇందులో పాల్గొనే ఉద్దేశం లేదు" అని రామన్ తేల్చి చెప్పారు.

పరిశ్రమ అంచనాల ప్రకారం, ప్రస్తుతం మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో డీజిల్ వాహనాల వాటా 17 శాతం కంటే తక్కువగా ఉంది. అదే ఒకప్పుడు అయితే (2013-14 లో) మొత్తం కార్ల అమ్మకాలలో డీజిల్ కార్లు అమ్మకాలు 60 శాతం వాటాను కలిగి ఉండేది. భారతదేశంలో ఏప్రిల్ 1, 2020 వ తేది తర్వాత నుండి బిఎస్6 (BS-VI) ఉద్గార నిబంధనలు ప్రారంభంతో కావడంతో, ఇప్పటికే దేశంలోని అనేక వాహన తయారీదారులు తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో డీజిల్ వెర్షన్ల తయారీని నిలిపివేశాయి.

మారుతి సుజుకి ఇండియా కూడా కఠినమైన BS-VI ఉద్గార నిబంధనలు ప్రారంభమైనప్పటి నుండి తమ పోర్ట్ఫోలియో నుండి డీజిల్ మోడళ్లను నిలిపివేసింది. ప్రస్తుతం, మారుతి సుజుకి ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో బిఎస్6 కంప్లైంట్ 1 లీటర్, 1.2 లీటర్ మరియు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఈ పెట్రోల్ ఇంజన్లను కంపెనీ అందించే వివిధ రకాల కార్లలో ఉపయోగిస్తోంది. డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా, అధిక మైలేజ్ కోరుకునే కస్టమర్ల కోసం మారుతి సుజుకి తమ పోర్ట్ఫోలియోలోని ఏడు మోడళ్లలో సిఎన్జి (CNG) వెర్షన్లను కూడా అందిస్తోంది.

ప్రస్తుతం, మారుతి సుజుకి డీజిల్ కార్ల తయారీ గురించి ఆలోచించకుండా, మరింత మెరుగైన ఇంధన సామర్థ్యం (మైలేజ్) ని అందించే పెట్రోల్ కార్లను తయారు చేయడం మరియు ఇప్పటికే ఉన్న ప్రస్తుత పెట్రోల్ పవర్ట్రెయిన్లను మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి సారిస్తుందని, అలాగే కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోకు శక్తినిచ్చే కొత్త ఇంజన్లను కూడా భవిష్యత్తులో చూడవచ్చని రామన్ తెలిపారు. మారుతి సుజుకి ఇటీవలే కొత్త అప్డేటెడ్ కె10-సి ఇంజన్తో కూడిన 2021 సెలెరియో కారును విడుదల చేసింది. ఇది భారతదేశంలో కెల్లా అత్యధికంగా మైలేజీనిచ్చే పెట్రోల్ కారు అని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








