రూ.15,000 వరకూ పెరిగిన మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ ధరలను కంపెనీ మరోసారి పెంచింది. పెరిగిన ఇన్పుట్ ఖర్చుల కారణంగా, ఈ మోడల్ ధరను పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ కూడా ఒకటి. కొద్ది రోజుల క్రితమే, మారుతి సుజుకి తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచిన విషయం తెలిసినదే. వీటిలో కొత్త స్విఫ్ట్ మరియు మారుతి సుజుకి యొక్క సిఎన్జి శ్రేణిలోని అన్ని మోడళ్లు ఉన్నాయి.

కస్టమర్ ఎంచుకునే వేరియంట్ను బట్టి మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు రూ.1,000 నుండి రూ.15,000 వరకూ పెరిగాయి. స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏఎమ్టి వేరియంట్ ధర కనిష్టంగా రూ.1,000 మేర పెరగగా, స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.8,000 మేర పెరిగింది.

కాగా, స్విఫ్ట్ విఎక్స్ఐ, విఎక్స్ఐ ఏఎమ్టి, జెడ్ఎక్ఐ, జెడ్ఎక్స్ఐ ఏఎమ్టి, జెడ్ఎక్ఐ ప్లస్, జెడ్సి ప్లస్ డ్యూయల్ టోన్ మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏఎమ్టి వేరియంట్ల ధరలు గరిష్టంగా రూ.15,000 మేర పెరిగాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్బ్యాక్లలో ఒకటి మాత్రమే కాదు, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో కూడా ఒకటి. మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో లభిస్తున్న చిన్న కార్లలో ఒక మంచి ఫన్ టూ డ్రైవ్ కార్. దీని తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా, ఇది ప్రజాదరణను కలిగి ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి స్విఫ్ట్ మూడవ తరానికి చెందినది. భారతీయ వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఫీచర్లు మరియు స్థలం వంటి అంశాలలో ఇది ఈ సెగ్మెంట్లోని ఇతర కార్ల కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి, తాజాగా పెరిగిన ధరలు ఈ మోడల్ అమ్మకాలను ప్రభావితం చేయవనేది మా అభిప్రాయం.


Click it and Unblock the Notifications








