మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించనున్న మారుతి సుజుకి; వివరాలు
కరోనావైరస్ సెకండ్ వేవ్ భారతదేశంలో రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి ఎందరో ప్రజలు ప్రాణాలు వదిలేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో యాక్టివ్ గా ఉన్న కరోనా కేసుల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటింది.

భారతదేశంలో అమాంతం పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా రోగులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇందులో భాగంగానే హాస్పిటల్స్ లో బెడ్ల కొరత వెంటిలేటర్ల కొరత మరియు ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది.

మౌలిక సదుపాయాలైన ఆక్సిజన్ వంటివి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతిరోజూ వేలాదిమంది మరణిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతోమంది ప్రజలు వారికి తోచిన విధంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో చాలామంది వాహనదారులు తమ వాహనాలను అంబులెన్సులుగా మార్చి సేవలు చేస్తున్నారు.

భారతదేశంలో అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధిచెందిన మారుతి సుజుకి ఇండియా, భారతదేశంలోని కరోనా రోగుల సహాయార్థం జైడస్ హాస్పిటల్ భాగస్వామ్యంతో గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సీతాపూర్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ. 126 కోట్లు ఖర్చవుతాయి. ఈ మొత్తం ఖర్చులకు కావాల్సిన నిధులను మారుతి సుజుకి ఫౌండేషన్ సమకూరుస్తుంది. ఈ ఆసుపత్రిని జైడస్ గ్రూప్ యొక్క సిఎస్ఆర్ ఆర్మ్ రామన్భాయ్ ఫౌండేషన్ నిర్వహిస్తుందని మారుతి సుజుకి కంపెనీ తెలిపింది.

ఈ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ కరోనా రోగులకు సేవలు అందిస్తుంది, అంతే కాకుండా దేశంలో వ్యాపిస్తున్న ఈ అంటు వ్యాధిపై పోరాటాన్ని బలోపేతం చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హాస్పిటల్ ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దీని గురించి మారుతి సుజుకి కంపెనీ ఎండి, సిఇఒ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ మన గుజరాత్ తయారీ కర్మాగారం ప్రారంభమైనప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద వైద్య సదుపాయాలు లేవని అన్నారు. కావున ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని మంచి నాణ్యత గల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించుకున్నాము.

ఈ హాస్పిటల్ జైడస్ గ్రూప్ నిర్వహిస్తుంది. కోవిడ్ 19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని వారు తెలిపారు. ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పొరుగున ఉన్న సీతాపూర్ గ్రామాల్లో ఉన్న 3.75 లక్షలకు పైగా ప్రజలకు అతి తక్కువ ధర వద్ద నాణ్యమైన వైద్యం అందించనుంది.

కరోనా రోగులకు ఆసుపత్రిలో 50 పడకలు ఉన్నాయి. దీన్ని 100 పడకలకు పెంచనున్నారు. ఈ సౌకర్యం 7.5 ఎకరాలలో ఉంటుంది. ఈ ఆసుపత్రి ఈ ప్రాంతంలో మొట్టమొదటి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి కానుంది. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటూ అవసరమైన వైద్య సదుపాయాలు అందించనుంది.


Click it and Unblock the Notifications








