మారుతి-టొయోటా జేవీ నుండి వస్తున్న చిన్న కారు మరియు ఓ ఎమ్పివి
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరియు జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీలు రెండూ చేతులు కలిపి భారత మార్కెట్ కోసం రెండు సరికొత్త మోడళ్లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ రెండు కంపెనీల నుండి బాలెనో-గ్లాంజా, విటారా బ్రెజ్జా-అర్బన్ క్రూయిజర్ వంటి క్లోనింగ్ మోడళ్లు లభిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, వీటికి పూర్తిగా భిన్నంగా, భారత మార్కెట్ కోసం ఓ చిన్న కారును మరియు ఓ మల్టీ పర్సప్ వెహికల్ (ఎమ్పివి)ని అభివృద్ధి చేయాలని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి.

టీమ్బిహెచ్పి నివేదిక ప్రకారం, టొయోటా తమ చిన్న కారును 560బి అనే కోడ్నేమ్తో అభివృద్ధి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త చిన్న కారును 2021 సంవత్సరం చివరినాటికి కానీ లేదా 2022 ఆరంభంలో కానీ అమ్మకాలకు వచ్చే అవకాశం ఉంది.

ఈ చిన్న కారు కేవలం పెట్రోల్ ఇంజన్తో కాకుండా, ఇతర ప్రత్యామ్నాయ పవర్ట్రెయిన్ ఆప్షన్లలో కూడా లభ్యం కావచ్చని సమాచారం. ఇందులో కాంపాక్ట్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ) ప్లాట్ఫామ్ కూడా ఉంది. అలాగే పెట్రోల్ మరియు సిఎన్జి ఫ్యూయెల్ కాంబినేషన్ కూడా ఉన్నట్లు వినికిడి.

ఇక ఈ రెండు బ్రాండ్లు కలిసి తయారు చేయబోయే ఎమ్పివి విషయానికి వస్తే, ప్రస్తుత మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా మరియు టొయోటా ఇన్నోవా క్రిస్టాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేలా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు మోడళ్లకు మధ్యలో రానున్న ఈ కొత్త ఎమ్పివి ఇదివరకటిలా రీబ్యాడ్జింగ్ కాకుండా, పూర్తిగా సరికొత్త ప్లాట్ఫామ్పై తయారు చేయనున్నారు.

అయితే, ఈ కొత్త ఎమ్పివి ఆలోచన దశ నుంచి ఉత్పత్తి దశకు చేరుకోవటానికి ఏడాదిన్నరకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. మార్కెట్ అంచనా ప్రకారం, 2022 ద్వితీయ త్రైమాసికం నాటికి ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి మరియు టొయోటా నుండి రాబోయే ఈ కొత్త ఎమ్పివి వివిధ రకాల పవర్ట్రెయిన్ ఆప్షన్స్తో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న 1.5-లీటర్ మైల్డ్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ మరియు ఇరు కంపెనీలు అభివృద్ధి చేయబోయే కొత్త పవర్ట్రైన్ ఆప్షన్లు ఉండనున్నాయి.

మారుతి సుజుకి తమ జపనీస్ అనుబంధ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ అభివృద్ధి చేసిన లేటెస్ట్ హైబ్రిడ్ ఇంజన్లను భారతీయ మోడళ్లలో ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవలే మారుతి సుజుకి బాలెనో సుజుకి టెక్నాలజీతో కూడిన కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్తో పరీక్షించడాన్ని గుర్తించారు. దీనిని మొట్టమొదటిసారిగా 2020 ఆటో ఎక్స్పోలో స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్లో ప్రదర్శించారు.

అలాగే, బిఎస్6 నిబంధనల నేపథ్యంలో, మారుతి సుజుకి నిలిపివేసిన తమ పాత 1.5-లీటర్ డిడిఎస్ డీజిల్ ఇంజన్ను కూడా పునరుద్ధరించే అవకాశం ఉంది. దేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలు కఠినతరమైనప్పటికీ, డీజిల్ ఇంజన్లకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మారుతి సుజుకి కూడా ఎక్కువగా పెట్రోల్ ఇంజన్లపైనే ఆధారపడి ఉంది.

ఈ నేపథ్యంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మారుతి సుజుకి తమ డీజిల్ ఇంజన్లను తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త ఇంజన్ ఆప్షన్లు మారుతి-టొయోటా నుండి రాబోయే ఎమ్పివి కోసం ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. ఈ కొత్త ఎమ్పివి ప్రస్తుతం మార్కెట్లో పోటీ లేని మహీంద్రా మరాజో వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

మారుతి సుజుకి మరియు టొయోటా కంపెనీలు తయారు చేయబోయే చిన్న కారు మరియు ఎమ్పివిలు ప్రస్తుత మార్కెట్ డిమాండ్ను తీర్చే అవకాశం ఉంది. విభిన్నమైన పవర్ట్రైన్ ఆప్షన్స్ కారణంగా, ఈ చిన్న కారు రోజువారీ పట్టణ రాకపోకలకు అనుగుణంగా ఉంటుంది. కాగా, ఈ విషయాన్ని మారుతి సుజుకి, టొయోటా కంపెనీలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు కేవలం ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే, వాస్తవ ఉత్పత్తివి కావు.


Click it and Unblock the Notifications