రూ.4.7 లక్షలు పెరిగిన మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధర
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ధరను కంపెనీ భారీగా పెంచింది. ఇప్పుడు ఈ కారు ధర గరిష్టంగా రూ.4.7 లక్షలు పెరిగి రూ.1.04 కోట్లకు (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది.

గతేడాది చివర్లో ఈ కారును రూ.99.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో విడుదల చేశారు. ఇప్పుడు ఆ పరిచయ ధరలు ముగిసాయని, అందుకే ఈ కొత్త ధరలు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జనవరి నెలలోనే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తయినట్లు కంపెనీ ప్రకటించింది.

కాగా, ఇప్పుడు సెప్టెంబర్ 2021 నాటికి రెండవ బ్యాచ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీలను భారత్కు తీసుకురావడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం గడచిన మార్చి నెల నుండే కంపెనీ బుకింగ్లను స్వీకరిస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా ఇక్కడికి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. అధిక దిగుమతి సుంఖాల కారణంగా, ఈ కారు ధర కూడా అధికంగా ఉంటుంది.

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీని ప్రారంభించిన సమయంలో, ఇది మార్కెట్ నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ మోడల్ కోసం పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ మరో బ్యాచ్ ఎస్యూవీలను ఇండియాకు తీసుకురావాలని నిర్ణయించింది.

మొదటి బ్యాచ్లో భాగంగా కంపెనీ 50 యూనిట్లను పూర్తిగా విక్రయించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కార్లన్నీ కూడా భారత మార్కెట్లో విడుదల కావటానికి ముందే పూర్తిగా అమ్ముడైపోయాయి. కాగా, రెండవ బ్యాచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీల డెలివరీలు సెప్టెంబర్ 2021లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీలో 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ప్రతి యాక్సిల్ వద్ద ఒక్కొక్క ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇవి రెండూ కలిపి గరిష్టంగా 405 బిహెచ్పి పవర్ని మరియు 765 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తాయి.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి కేవలం 5.1 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పరిమితం చేశారు. పూర్తి ఛార్జ్పై ఈ కారు గరిష్టంగా 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 40 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బ్యాటరీని 0 - 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ ఇటీవలే, ఇందులో పవర్ఫుల్ 11 కిలోవాట్ ఆన్బోర్డ్ ఛార్జర్ను జోడిచింది. దీని సాయంతో కేవలం 7 గంటల 30 నిమిషాల్లోనే ఈక్యూసి యొక్క 80 కిలోవాట్ అవర్ బ్యాటరీని పూర్తిగా 100 శాతం చార్జ్ చేసుకోవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి కారులో రెండు 10.3 ఇంచ్ డిస్ప్లేలు ఉంటాయి. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం మరియు మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉంటుంది. ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వాయిస్-యాక్టివేటెడ్ ఫంక్షన్లతో పాటుగా బ్రాండ్ యొక్క సరికొత్త ఎమ్బియూఎక్స్ సిస్టమ్ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఈ కారులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, పూర్తి ఎల్ఈడి లైటింగ్, పవర్ ఆపరేటేడ్ సీట్స్, యాంబియెంట్ లైటింగ్, ఆన్-బోర్డు ఏసి ఫాస్ట్ ఛార్జర్. మెర్సిడెస్ మై కనెక్ట్, టెంపరేచర్ కంట్రోల్, 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు మెర్సిడెస్ బెంజ్ ప్రీ సేఫ్ మొదలైనవి లభిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ విభాగంలో ఇటీవలే విడుదలైన జాగ్వార్ ఐ-పేస్ మరియు కొత్తగా రానున్న ఆడి ఇ-ట్రాన్, టెస్లా మోడల్ 3 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారును ఇటీవలే మా డ్రైవ్స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - ఈ కారుకు సంబంధించిన పూర్తి సమీక్ష కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








