భారత్లో మెర్సిడెస్ బెంజ్ నుండి మరొక కొత్త ఎలక్ట్రిక్ కారు; రేంజ్ 770 కి.మీ!
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే ఈక్యూసి అనే ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఇప్పుడు తాజాగా ఈక్యూఎస్ అనే ఎలక్ట్రిక్ సెడాన్ను విడుదల చేయనుంది.

ఈ మేరకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ అధికారిక వెబ్సైట్ను కూడా అప్డేట్ చేసింది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క అధికారిక ప్రారంభ తేదీ గురించి కానీ లేదా ఇతర వివరాల గురించి కానీ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. భారత్లో మెర్సిడెస్ బెంజ్కు ఇది రెండవ ఆల్-ఎలక్ట్రిక్ కారు కానుంది.

మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈవీఏ (ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్) ప్లాట్ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న మొదటి మోడల్ ఈ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ సెడాన్. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ సెడాన్ డిజైన్ను గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో కూడిన పూర్తి ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, బానెట్ క్రింది భాగంలో రెండు హెడ్లైట్లను కలిపే ఎల్ఈడి లైట్బార్, స్టార్లైట్ ఫ్రంట్ గ్రిల్ మరియు దాని మధ్యలో పెద్ద మెర్సిడెస్ బెంజ్ లోగో, ఫ్రంట్ బంపర్లో పెద్ద ఎయిర్ ఇన్టేక్ వంటి అంశాలు ఉన్నాయి.

కారు వెనుక భాగంలో కూడా సన్నటి డిజైన్తో కూడిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు ఆ రెండింటినీ కలుపుతూపోయే ఎల్ఈడి లైట్ స్ట్రిప్ ఇందులో కనిపిస్తాయి. కారు సైడ్ భాగంలో అద్దాల చుట్టూ క్రోమ్ గార్నిష్ మరియు ప్రీమియం మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ కారు ఇంటీరియర్స్ చాలా ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తాయి. డ్యాష్బోర్డ్లో అతి తక్కువ భౌతిక బటన్స్తో మూడు పెద్ద డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. ఇందులో ఒకటి స్టీరింగ్ వెనుక వైపు, మరొకటి డ్యాష్బోర్డ్ మధ్యలో మరియు చివరి కో-ప్యాసింజర్ సీట్ వైపు ఉంటుంది.

ఈ డిజిటల్ స్క్రీన్స్ సమాచారం, వినోదం మరియు కారులోని వివిధ రకాల ఫీచర్లను నియంత్రించడం కోసం ఉపయోగించబడుతాయి. డ్యాష్బోర్డ్ రెండు చివర్లలో గుండ్రటి ఏసి వెంట్స్, డ్యాష్బోర్డ్ పైభాగంలో సన్నటి ఏసి వెంట్స్ ఉంటాయి. ఇంకా ఇందులో 3-స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ప్రీమియం వైట్ లెథర్ అప్హోలెస్ట్రీ మరియు గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ సెడాన్ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి: ఈక్యూఎస్ 450+ మరియు ఈఎక్యూఎస్ 580 4మ్యాటిక్. ఈ రెండు వేరియంట్లలో, కంపెనీ 107.8 కిలోవాట్ల-గంట లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగిస్తోంది.

ఇందులో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ బేస్ వేరియంట్గా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ వెనుక యాక్సిల్లో అమర్చబడి ఉండి, రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 324 బిహెచ్పి పవర్ను మరియు 550 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఇకపోతే, ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ టాప్-ఎండ్ వేరియంట్గా లభిస్తుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ 4-మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ యాక్సిల్స్లో ఎలక్ట్రిక్ మోటార్లు ఉండి, 4x4 డ్రైవ్ సిస్టమ్ను కలిగి ఉంటుంది.

ఈ వేరియంట్ (ఈక్యూఎస్ 580 4మ్యాటిక్)లోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి గరిష్టంగా 509 బిహెచ్పి పవర్ను మరియు 828 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ సెడాన్ పూర్తి ఛార్జ్పై గరిష్టంగా 770 కిమీ (డబ్ల్యూఎల్టిపి సైకిల్) రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ కారు కేవలం 4.1 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా గంటకు 210 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఇక్యూఎస్ మంచి ఏరోడైనమిక్ డిజైన్ను కలిగి ఉండి, కారుపై గాలి పీడనాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా, ఈ కారు రేంజ్ పెరుగుతుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications