బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు!
పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇటీవలే, ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని సవరించిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా మరో శుభవార్త చెప్పింది.

ఈ సీజన్లో మీరు ఎలక్ట్రిక్ కారు లేదా ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలని చూస్తుంటే, ఇది నిజంగా మీకు తీపివార్తే. ఎలక్ట్రిక్ వాహనాలపై వసూలు చేసే రిజిస్ట్రేషన్ ఫీజును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో, బ్యాటరీతో పనిచేసే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ రుసుము నుండి మినహాయించబడినట్లు పేర్కొంది.

మంత్రిత్వ శాఖ యొక్క ఈ నిర్ణయం తరువాత, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఫీజును ఆదా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పాటు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాల పాలసీల కింద బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో రహదారి పన్ను (రోడ్ టాక్స్)పై మినహాయింపు ఇస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగినది. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు వాయు కాలుష్యం నేపథ్యంలో, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని ప్రభుత్వం కోరుతోంది.

ఇప్పటికీ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగం చాలా నెమ్మదిగా ఉంది.
మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహాకలు ప్రకటిస్తున్నప్పటికీ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దేశంలో సరైన ఛార్జింగ్ మౌళిక సదుపాయాలు లేకపోవడం మరియు ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్కి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలే ఇందుకు ప్రధాన కారణం.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం పట్టణాల్లో చార్జింగ్ సౌకర్యాలు ఇప్పుడిప్పుడే మెరుగు పడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చేయడం మరియు దేశంలో వేగంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయటంపై ప్రభుత్వం నిరంతం కృషి చేస్తోంది.

ఇందుకోసం ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలు వాహన తయారీదారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఫేమ్ 2 స్కీమ్ సహాయంతో, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రహదారి పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజులపై మినహాయింపులను ఇస్తోంది, తద్వారా ఈ వాహనాలు వినియోగదారులకు సరసమైన ధరకే అందుబాటులోకి రానున్నాయి.

అంతే కాకుండా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను ప్రోత్సహించడానికి, అన్ని బ్యాటరీతో నడిచే వాహనాలపై జిఎస్టి రేటును 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం జరిగింది. వీటితో పాటుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు మరియు డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు విక్రయాలను ప్రోత్సహిస్తున్నాయి.

ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించబడ్డాయి?
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే, గడచిన 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,95,497 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. కాగా, 2021 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 19 శాతం తగ్గి 2,38,120 యూనిట్లకు పడిపోయాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల కారణంగా వీటి అమ్మకాలు దెబ్బతిన్నాయి.

ఈ సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాల అమ్మకాలు వరుసగా 1,43,837 యూనిట్లు (-5.37%) మరియు 88,378 యూనిట్లకు (-59%) తగ్గాయి. ఎఫ్వై21 లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిమాండ్లో ఎక్కువ భాగం తక్కువ-స్పీడ్ మోడళ్ల (1,03,000 యూనిట్లు) నుండి రాగా, ఎక్కువ-స్పీడ్ కలిగిన విభాగం నుండి 40,836 యూనిట్లు అమ్ముడయ్యాయి.


Click it and Unblock the Notifications








