కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
మోటార్ వాహనాల సేఫ్టీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకుంటుంది. ఇటీవలే 15 ఏళ్లు ముగిసిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేయటం లేదా ప్రతి ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ను రెన్యువల్ చేయటం వంటి ప్రతిపాదను తెరపైకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్బ్యాగ్లపై మరో సంచల నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇకపై అన్ని కార్లలో ప్రయాణీకుల వైపు (ప్యాసింజర్ సైడ్) ఎయిర్బ్యాగులను కూడా తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.

ఈ నిబంధన ప్రకారం, ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి భారతదేశంలో తయారయ్యే మరియు విక్రయించబడే అన్ని కార్లు మరియు వేరియంట్లలో డ్యూయల్ (డ్రైవర్ మరియు కో ప్యాసింజర్) ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు తప్పనిసరిగా ఉండాలి.

అదేవిధంగా, ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే సింగిల్ (డ్రైవర్) ఎయిర్బ్యాగ్ లేదా అసలు ఎయుర్బ్యాగ్స్ లేకుండా తయారు చేయబడిన అన్ని కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగులు అమర్చడానికి ఆగస్ట్ 20, 2021వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

సాధారణంగా, కార్ కంపెనీలు ఎంట్రీ లెవల్ కార్లు మరియు వేరియంట్లలో ఎయిర్బ్యాగ్స్ను ఆఫర్ చేయకపోవటం లేదా కొన్ని వేరియంట్లలో కేవలం డ్రైవర్ సైడ్ మాత్రమే ఎయిర్బ్యాగ్ను ఆఫర్ చేయటం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది చివరి నాటికి దేశంలో విక్రయించబడే అన్ని కార్లలో ముందు వైపు రెండు ఎయిర్బ్యాగ్స్ ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ఆధారంగా కూడా ఈ కొత్త నిబంధన రూపొందించబడింది. కార్లలో ప్రయాణీకుల భద్రతను మెరుగుపరిచే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్ల అవసరాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.

ఈ కొత్త నియమం ప్రకారం, సంబంధిత బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ప్రమాణాలను వెల్లడించే వరకూ, ఈ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగులు ఏఐఎస్ (ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్) 145 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్గా ఆఫర్ చేయాలన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో కొత్త కార్ల కొనుగోలుదారులు అధికం కావటం మరియు వాహన సేఫ్టీ రేటింగ్లకు ప్రాధాన్యత ఇస్తుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో కార్లలో ఈ సేఫ్టీ పరికరాలను స్టాండర్డ్గా అందించడం చాలా ముఖ్యం.

భారతదేశం గతంలో దేశవ్యాప్తంగా అన్ని కార్లలో ఎయిర్ బ్యాగ్లను తప్పనిసరి చేసింది. అయితే, ధరను అదుపులో ఉంచడానికి వాహన తయారీదారులు తమ మోడళ్లలోని ఎంట్రీ లెవల్ వేరియంట్లను ఒకే ఎయిర్బ్యాగ్తో అందించగా, అదే మోడల్ యొక్క మిడ్ మరియు హై రేంజ్ వేరియంట్లలో బహుళ ఎయిర్బ్యాగులను మరియు ఇతర సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నారు.

ఎయిర్బ్యాగ్ల విషయంలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావటంతో ఇకపై అన్ని కార్లు మరియు అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి ఫీచర్గా లభ్యం కానున్నాయి. అంటే, ఇఖపై ఎంట్రీ లెవల్ వేరియంట్ను కొనుగోలు చేసే కస్టమర్లు కూడా డ్యూయెల్ ఎయిర్బ్యాగ్స్ ఫీచర్ను స్టాండర్డ్గా పొందనున్నారు.

అయితే, ఈ నిర్ణయం వలన కొత్త కార్ల ఖరీదు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈ నిర్ణయం పట్ల ఆటోమొబైల్ కంపెనీలు మరియు వినియోగదారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








