కొత్త కార్ల విడుదలపై కోవిడ్-19 పంజా: కార్ మేకర్లను వణికిస్తున్న వైరస్!
గతేడాది భారతదేశంలోకి ప్రవేశించి, అల్లకల్లోలం సృష్టించిన కోవిడ్-19 మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత ఆటోమొబైల్ పరిశ్రమపై, కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరోసారి పంజా విసిరింది. గతేడాదిలోనే అనేక కొత్త కార్లు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కరోనా కారణంగా చాలా కార్ల విడుదల వాయిదా పడింది.

ఈ ఏడాది కూడా అదే జరగబోతోంది. మే 2021లో భారత ఆటోమోటివ్ రంగం కొన్ని ఉత్తేజకరమైన కొత్త కార్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే, దురదృష్టవశాత్తుగా ఎవ్వరూ ఊహించని రీతిలో కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కార్ల తయారీదారులు కొత్త కార్ల విడుదలను వాయిదా వేస్తున్నారు.

దేశంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అనేక రాష్ట్రాలు మరియు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ను విధించడం లేదా కర్ఫ్యూ విధించడం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త కార్ల లాంచ్కు ఇది అనువైన సమయం కాదు. ఈ ఏప్రిల్ నెలలో కార్ లాంచ్ల కోసం ప్రణాళికలు వేసుకున్న కొన్ని కార్ కంపెనీ ఇప్పటికే తమ లాంచ్లను ఒక నెలకు పైగా వాయిదా వేశారు.

ఈ నెలలో విడుదల కావల్సిన మరియు ధృవీకరించబడిన కార్లలో కొత్త స్కోడా ఆక్టేవియా, హ్యుందాయ్ అల్కాజార్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ, ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మరియు ఇసుజు ఎమ్యూఎక్స్ మోడళ్లు ఉన్నాయి. అలాగే, కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో మరియు ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లు కూడా మే నెలలో ప్రారంభించబడాల్సి ఉంది.

స్కొడా మొదటి ప్లాన్ ప్రకారం, కొత్త 4వ తరం స్కోడా ఆక్టేవియా సెడాన్ ఈ నెలాఖరు నాటికి భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ కార్ లాంచ్ మే 2021 నెలాఖరు నాటికి వాయిదా పడింది. కొత్త స్కోడా ఆక్టేవియాలో 190 బిహెచ్పి పవర్ను జనరేట్ చేసే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్జి గేర్బాక్స్తో లభిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఆధారం రూపుదిద్దుకున్న 7-సీటర్ ఎస్యూవీ, హ్యుందాయ్ అల్కాజార్ విడుదలను కూడా కంపెనీ ధృవీకరించింది. వాస్తవిక ప్లాన్ ప్రకారం, ఇది ఏప్రిల్ 29న మార్కెట్లోకి రావాల్సి ఉంది. అయితే దేశంలో క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో, అల్కాజార్ విడుదలను మే చివరికి వాయిదా వేయాలని హ్యుందాయ్ భావిస్తోంది.

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ 'మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ' యొక్క అప్డేటెడ్ వెర్షన్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ముందుగా ఈ ఎస్యూవీని ఏప్రిల్ చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ కారణంగా ఈ కారు విడుదల మే చివరకు వాయిదా పడింది.

ఇసుజు బ్రాండ్ నుండి ఎదురుచూస్తున్న రెండు ఉత్పత్తులు కొత్త ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ పికప్ మరియు ఎమ్యూఎక్స్ ఎస్యూవీల విడుదల కూడా మరింత ఆలస్యం కానుంది. ఈ కొత్త ఎస్యూవీలో ఆటోమేటిక్ లేదా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో కూడిన సరికొత్త బిఎస్6 కంప్లైంట్ 1.9-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంటుంది.

కరోనా మహమ్మారి వలన భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభం కారణంగా కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో మరియు ఆడి ఇ-ట్రోన్ వంటి ఇతర వాహనాల విడుదల కూడా మరింత ఆలస్యం కానుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








