కొత్త వెహికల్ స్క్రాపింగ్ పాలసీతో మీ పాత వాహనాలపై పన్నుల బాదుడు ఖాయం!
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2021లో కొత్త వాహన స్క్రాపింగ్ విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానం అమల్లోకి వచ్చిన పాత వాహనాలను వినియోగించాలనుకునే కస్టమర్లు భారీ మొత్తంలో పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.

రాబోయే రెండు వారాల్లో, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త వాహన స్క్రాపింగ్ విధానానికి మరించి మరిన్ని వివరాలను తెలియజేయనుంది. ఈ స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 15 ఏళ్లు నిండిన వాహనాలను కస్టమర్లు స్వచ్ఛందంగా స్క్రాపింగ్ చేయవచ్చు.

అలా కాకుండా, కస్టమర్లు 15 ఏళ్లు నిండిన తమ వాహనాలను ఆపై కూడా ఉపయోగించాలనుకుంటే, వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందటానికి జేబులు ఖాలీ చేసుకోవాల్సి రావచ్చు. ఓ నివేదిక ప్రకారం, 15 ఏళ్లు పూర్తయిన వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందటానికి అయ్యే ఖర్చు 62 రెట్లు పెరుగుతుందని సమచారం.

అలాగే, ఇలాంటి ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ను పునరుద్ధరణ చేసుకునేందుకు అయ్యే ఖర్చు ఎనిమిది రెట్లు పెరుగుతుందని అంచనా. మోటారు వాహన చట్టం ప్రకారం, ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ప్రస్తుతం వాణిజ్య వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం అయ్యే ఖర్చు రూ.200 ఉందనుకుంటే, 15 ఏళ్లకు పైబడిన క్యాబ్స్ కోసం ఇది రూ.7,500 కు మరియు ట్రక్కుల విషయంలో అయితే సుమారు రూ.12,500 వరకు పెరగవచ్చని అంచనా.

ప్రస్తుతం 15 సంవత్సరాలకు పైబడిన ప్రైవేట్ వాహనాల విషయంలో, ద్విచక్ర వాహనాల కోసం రిజిస్ట్రేషన్ ఛార్జ్ రూ.300 నుండి రూ.1000 వరకు పెరగనుంది. అలాగే, కార్ల విషయంలో ఇది రూ.600 నుండి రూ.5,000 లకు పెరగుతుందని సమాచారం.

అన్ని ప్రైవేట్ వాహనాలు 15 సంవత్సరాల తరువాత తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించుకోవాలి. ఆ తర్వాత తిరిగి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి రిజిస్ట్రేషన్ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి అదనంగా ప్రతి వాహన యజమాని రహదారి పన్నుతో పాటు రాష్ట్రాలకు అదనపు గ్రీన్ టాక్స్ కూడా చెల్లించాల్సి రావచ్చు.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రానున్న వారాల్లో ఇందుకు సంబంధించిన ఓ కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలు విధించే హరిత పన్ను, వార్షిక రహదారి పన్నులో 10-25 శాతం వరకూ ఉంటుంది. ఇటువంటి వాహనాలపై రాష్ట్రాలు ఐదేళ్లపాటు గ్రీన్ టాక్స్ విధించవచ్చు మరియు ఇది రోడ్ టాక్స్కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

పాత వాహనాలు పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని విడుదల చేస్తాయని మరియు అధిక సంఖ్యలో ప్రమాదాలకు కారణమవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఈ కొత్త వెహికల్ స్క్రాపింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత 15 ఏళ్లకు పైబడిన వాహనాలను ఉపయోగించే కస్టమర్లు అదనపు ఆర్థిక భారం పడుతుంది.

ఫిట్నెస్ పరీక్ష సమయంలో వాహనం సరిగ్గా పనిచేయకపోతే, వెంటనే దాని రిజిస్ట్రేషన్ రద్దు చేయటం వంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం కోసం దేశంలోని కొన్ని నగరాల్లో ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పాత వాహనాలను స్క్రాపింగ్ చేసేందుకు భారీ మర యంత్రాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.


Click it and Unblock the Notifications








