అమాంతం పెరిగిన Nissan India నవంబర్ 2021 సేల్స్.. ఏకంగా..
ఎట్టకేలకు 2021 నవంబర్ నెల ముగిసింది, 2021 డిసెంబర్ నెలలోకి అడుగుపెట్టాము. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలన్నీ కూడా 2021 నవంబర్ అమ్మకాల నివేదికలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన నిస్సాన్ ఇండియా (Nissan India) కూడా తమ అమ్మకాల నివేదికను విడుదల చేసింది. కంపెనీ యొక్క నవంబర్ అమ్మకాల గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

నిస్సాన్ ఇండియా విడుదల చేసిన అమ్మకాల నివేదికల ప్రకారం, కంపెనీ యొక్క కొత్త నిస్సాన్ మాగ్నైట్ విజయవంతమైన ఉత్పత్తిగా మరో సారి నిరూపించబడింది. నిస్సాన్ ఇండియా నవంబర్ 2021 లో నిస్సాన్ మరియు డాట్సన్ విక్రయాలు దేశీయ మార్కెట్లో 2,651 యూనిట్లు. అదేవిధంగా కంపెనీ 2,954 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కూడా తెలుస్తుంది.

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నవంబర్ నెలలో దేశీయ మార్కెట్లో నిస్సాన్ ఇండియా 161% వృద్ధిని సాధించగా, ఎగుమతుల విషయంలో 152% వృద్ధిని సాధించింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి.

2021 నవంబర్ అమ్మకాల గురించి నిస్సాన్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కంపెనీ కొత్త నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభించినప్పటి నుండి 73,000 బుకింగ్లను పొందగలిగింది. ఈ SUV కి దేశీయ మార్కెట్లో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఈ SUV కి 31% బుకింగ్లు డిజిటల్ ఎకో-సిస్టమ్ నుండి వస్తున్నాయని అన్నారు.

ఇటీవలే నిస్సాన్ ఇండియా 30,000 యూనిట్ల నిస్సాన్ మాగ్నైట్ డెలివరీలను నిరాఘాటంగా పూర్తి చేసింది. ఈ అమ్మకాల సంఖ్యను కంపెనీ కేవలం ఒక సంవత్సర కాలంలోనే సాధించింది. నిస్సాన్ మాగ్నైట్ దేశీయ మార్కెట్లో 2020 డిసెంబర్ 02 న రూ. 4.99 లక్షల వద్ద విడుదలైంది. అయితే ఇది 2021 అక్టోబర్ చివరి నాటికి మొత్తం 29,701 యూనిట్లను విక్రయించింది. మొత్తానికి నిస్సాన్ మాగ్నైట్ SUV కి విపరీతమైన డిమాండ్ ఉంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

ప్యాసింజెర్ వెహికల్ విభాగంలో నిస్సాన్ ఇండియా వాటా ఏడాది క్రితం 0.37% (4,431 యూనిట్లు) నుండి ఏప్రిల్-అక్టోబర్ 2021 కాలంలో 1.38% (22,304 యూనిట్లు)కి మరియు యుటిలిటీ వాహన విభాగంలో 0.20% (924 యూనిట్లు) నుండి 2.78% (21,297 యూనిట్లు) కి పెరిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు క్రమంగా పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కంపెనీ నిస్సాన్ మాగ్నైట్ యొక్క డ్యూయల్-టోన్ కలర్ ఆప్సన్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ కాంపాక్ట్ SUV లో అందుబాటులో ఉన్న ఓనిక్స్ బ్లాక్ తో కూడిన ఫ్లేర్ గార్నెట్ రెడ్ వేరియంట్ నిలిపివేసింది. కావున కంపెనీ వెబ్సైట్ మరియు బ్రోచర్ల నుండి కూడా ఈ ఆప్సన్ తీసివేయబడింది.

కంపెనీ యొక్క మాగ్నైట్ SUV ఎనిమిది కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 5 మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన మూడు డ్యూయెల్ టోన్ వేరియంట్స్. మోనోటోన్ కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇందులో బ్లేడ్ సిల్వర్, ఓనిక్స్ బ్లాక్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, సాండ్స్టోన్ బ్రౌన్ మరియు స్టార్మ్ వైట్ కలర్స్ ఉన్నాయి. ఇక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో వివిడ్ బ్లూ/ స్టార్మ్ వైట్, టూర్మలైన్ బ్రౌన్/ ఓనిక్స్ బ్లాక్ మరియు పెర్ల్ వైట్/ ఓనిక్స్ బ్లాక్ ఉన్నాయి.

సాధారణంగా, తక్కువ డిమాండ్ ఉన్న వేరియంట్లను, కలర్ ఆప్షన్లను మరియు ఫీచర్స్ వంటి వాటిని కంపెనీ ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటుంది. దీనిద్వారా కంపెనీకి అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఈ వేరియంట్లు మార్కెట్లో అంత గొప్ప విజయాన్ని సాధించలేకపోవడం వల్ల కంపెనీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి.

ఇదిలా ఉండగా, నిస్సాన్ మాగ్నైట్ యొక్క కొత్త వేరియంట్ త్వరలో విడుదల కానున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. త్వరలో మార్కెట్లో విడుదలయ్యే నిస్సాన్ మాగ్నైట్ యొక్క కొత్త వేరియంట్ XV ఎగ్జిక్యూటివ్ వేరియంట్ కానుంది. ఈ కొత్త వేరియంట్ XL మరియు XV వేరియంట్ల మధ్య ఉంచబడుతుంది. అయితే ఈ కొత్త వేరియంట్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ యొక్క కొత్త వేరియంట్ ధర దాని మునుపటి మోడల్స్ కంటే కూడా దాదాపు రూ. 52,000 ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న ఈ కొత్త వేరియంట్ యొక్క వివరాల విషయానికి వస్తే, ఇది మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో అత్యంత పోటీతత్వ విభాగంలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








