డీజిల్ కార్ల తయారీని ఆపేయండి, కాలుష్యాన్ని తగ్గించడంలో సహకరించండి: గడ్కరీ
భారతదేశంలో కఠినమైన BS6 కాలుష్య ఉద్ఘార నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, దాదాపుగా దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తాత్కాలికంగా తమ డీజిల్ కార్ల తయారీని మరియు విక్రయాలను నిలిపివేశాయి. ఆ తర్వాత కొన్ని కంపెనీలు తిరిగి తమ డీజిల్ ఇంజన్లను కొత్త ఉద్ఘార ప్రమాణాలకు అనుగుణంగా రీఫైన్ చేసి, మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టాయి.

ఈ విషయంలో భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన Maruti Suzuki మాత్రం పూర్తిగా తమ డీజిల్ కార్ల తయారీని మరియు విక్రయాలను నిలిపివేసింది. ప్రస్తుతం, ఈ కంపెనీ కేవలం పెట్రోల్ మరియు సిఎన్జితో నడిచే కార్లను మాత్రమే తయారు చేస్తోంది. భవిష్యత్తు కోసం ఈ బ్రాండ్ కొన్ని ఎలక్ట్రిక్ కార్లను కూడా అభివృద్ధి చేస్తోంది.

అలాగే, ఇటీవల కొన్ని పాపులర్ కార్ బ్రాండ్లు తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన్న సరికొత్త కార్లను కూడా కేవలం పెట్రోల్ ఇంజన్లతోనే ప్రవేశపెడుతున్నాయి. ఉదాహరణకు Skoda Kushaq, Volkswagen Taigun వంటి కార్లు కూడా కేవలం పెట్రోల్ ఇంజన్లతోనే లభ్యం అవుతున్నాయి. అంతకు ముందు వచ్చిన Renault Kiger, Nissan Magnite వంటి కార్లు కూడా కేవలం పెట్రోల్ ఇంజన్లతోనే మార్కెట్లో లాంచ్ చేయబడ్డాయి.

వాస్తవానికి భారత్ వంటి మార్కెట్లలో మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, మనదేశంలో డీజిల్ కార్లకు డిమాండ్ కూడా పెట్రోల్ కార్ల కన్నా అధికంగానే ఉంటుంది. కానీ, కొత్త కాలుష్య ఉద్ఘార ప్రమాణాల తర్వాత కార్ కంపెనీలకు డీజిల్ కార్లను తయారు చేయడం మరింత భారంగా మారింది.

సాధారణంగా, పెట్రోల్ కారుకి డీజిల్ కారుకి మధ్య ధరల అంతరం సుమారు లక్ష రూపాయల వరకూ ఉంటుంది. అయితే, కొత్త కాలుష్య ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ధరల అంతరం మరింత పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం, డీజిల్ ఇంజన్ల రీఫైనింగ్ కు అయ్యే ఖర్చు అధికంగా ఉండటమే.

మరోవైపు కేంద్రం కూడా దేశంలో డీజిల్ కార్ల తయారీ మరియు అమ్మకాలను తగ్గించాలని, తద్వారా కాలుష్యాన్ని నియంత్రణలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి మరియు అమ్మకాలను తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారులకు విజ్ఞప్తి చేశారు.

బుధవారం ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ నిర్వహించిన కాన్ఫరెన్స్లో గడ్కరీ ప్రసంగిస్తూ, కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడే టెక్నాలజీలను ఆటోమొబైల్ కంపెనీలు ప్రోత్సహించాలని మరియు కార్బన్ ఉద్గారాలను అరికట్టే ప్రయత్నంలో, కార్ల తయారీదారులు డీజిల్కు బదులుగా ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలని అన్నారు.

డీజిల్ ఆధారిత వాహనాల వలన వెలువడే కాలుష్యం పర్యావరణానికి మరియు మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం నిధులు సమకూర్చుకోవాలని కోరారు.

విదేశాలలో మాదిరిగా మనదేశంలో కూడా ఆటోమొబైల్ కంపెనీలు ఇథనాల్ లేదా పెట్రోల్ తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లను తయారు చేయాలని మరియు వీటిని మనదేశంలో ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన పట్ల తన ఉద్దేశాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. భారతదేశంలో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించడానికి కేంద్రం ఇప్పటికే కటాఫ్ తేదీని కూడా ఖరారు చేసింది.

పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా 100 శాతం బయో ఇథనాల్ తో నడిచే వాహనాల ఎంపికను ఆటోమేకర్లు ప్రజలకు ఇవ్వాలని గడ్కరీ అన్నారు. అటువంటి వాహనాలను అనుమతించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ టెక్నాలజీ చాలా సులభంగా లభిస్తుందని, ఆటో కంపెనీలు కోరుకుంటే, భారతదేశ ఆటో పరిశ్రమ స్వచ్ఛమైన ఇంధనం వైపు పెద్ద అడుగు వేయగలదని ఆయన అన్నారు.

కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లను అందించడానికి భారతదేశంలో కార్ కంపెనీలు E20 అనుకూల వాహనాలను ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. ఇక్కడ E20 అనేది 20 శాతం ఇథనాల్ మరియు 80 శాతం పెట్రోల్ మిశ్రమం. మనదేశంలో ప్రస్తుతం విక్రయించబడుతున్న పెట్రోల్లో 8.5 శాతం ఇథనాల్ ఇంధనం కలిసి ఉంటుంది.

గత 2014లో ఇది కేవలం 1-1.5 శాతంగా మాత్రమే ఉండేది. కాగా, 2022 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 10 శాతానికి మరియు 2025 నాటికి 20 శాతానికి పెంచాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని పెంచడం ద్వారా, చమురు దిగుమతులను మరియు వాహన కాలుష్యాన్ని తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ సదస్సులో గడ్కరీ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాల గురించి కూడా మాట్లాడారు. హైడ్రోజన్ ఇంధనంపై నడుస్తున్న వాహనాల అవకాశాలను మంత్రిత్వ శాఖ అన్వేషిస్తోందని అలాగే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు మరింత ఆచరణీయమైన ఎంపికగా మార్చడానికి, తక్కువ ధర కలిగిన స్వదేశీ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గడ్కరీ చెప్పారు.


Click it and Unblock the Notifications








