Innova Crysta ఎమ్పివి సేల్స్ అదుర్స్.. టొయోటా నుండి మరొక బడ్జెట్ ఎమ్పివి కూడా వస్తోంది..!
గత రెండేళ్ల క్రితం భారతదేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి సృష్టించిన సవాళ్లు ఇప్పటికీ భారత ఆటోమొబైల్ పరిశ్రమను వెంటాడుతూనే ఉన్నాయి. కోవిడ్-19 తదనంతర పరిస్థితుల తర్వాత ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గడచిన కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లో వాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్ 2021 నెలలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

ఇదివరకటి నెలల మాదిరిగానే గత నెలలో కూడా దాదాపు అన్ని కార్ కంపెనీలు ప్రతికూల ఫలితాలను నమోదు చేశాయి. అయితే, ఇదే సమయంలో సదరు కంపెనీలు విక్రయించే కొన్ని రకాల కార్లు మాత్రం ప్రస్తుత మార్కెట్ వాతావరణాన్ని అధిగమించి, గత నెలలో సానుకూల అమ్మకాల గణాంకాలను నమోదు చేశాయి. అలాంటి మోడళ్లలో టొయోటా ఇన్నోవా క్రెస్టా ఎమ్పివి కూడా ఒకటి.

భారత ప్రీమియం ఎమ్పివి విభాగంలో టొయోటా ఇన్నోవా అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసినదే. ఈ విభాగంలోకి కొత్తగా ఎన్ని మోడళ్లు వచ్చినా ఇన్నోవాకి పోటీగా నిలువలేకపోయాయి. నవంబర్ 2021 నెలలో టొయోటా మొత్తం 6,300 ఇన్నోవా క్రెస్టా ఎమ్పివిలను విక్రయించింది. దీంతో ఇది భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎమ్పివి మోడళ్లలో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టొయోటా కార్లలో కూడా ఇన్నోవా క్రిస్టాదే అగ్రస్థానం.

నవంబర్ 2020 నెలలో టొయోటా కేవలం 2,192 ఇన్నోవా కార్లను మాత్రమే విక్రయించింది. ఆ సమయంతో పోల్చుకుంటే, గత నెలలో ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు ఏకంగా 187.41 శాతం పెరిగాయి. అలాగే, అక్టోబర్ 2021 నెలతో పోలిస్తే, నవంబర్ 2021 నెలలో ఇన్నోవా క్రిస్టా విక్రయాలు 3.35 శాతం ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్ 2021లో టొయోటా మొత్తం 6,096 యూనిట్ల ఇన్నోవా క్రిస్టా ఎమ్పివిలను విక్రయించింది.

జపనీస్ కార్ బ్రాండ్ అయిన టొయోటా భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా ఎమ్పివిని మొత్తం 2 విభిన్న ఇంజన్ ఆప్షన్లలో విక్రయిస్తోంది. ఇందులో మొదటిది 2.7 లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 166 బిహెచ్పి పవర్ ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 2.4 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్, ఈ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్పి పవర్ ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ను (మాన్యువల్ వేరియంట్లలో 343 ఎన్ఎమ్ టార్క్) ఉత్పత్తి చేస్తుంది.

ఇక గేర్బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇన్నోవా క్రిస్టా 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇది రియల్ వీల్ డ్రైవ్ సిస్టమ్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇందులో లేదు. సీటింగ్ ఆప్షన్స్ విషయానికి వస్తే, టొయోటా ఇన్నోవా క్రిస్టా 7 సీటర్ మరియు 8 సీటర్ వేరియంట్లలో లభిస్తుంది.

భారత మార్కెట్లో టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 17.18 లక్షల నుండి రూ. 24.99 లక్షల మధ్యలో ఉన్నాయి. భారతదేశంలో ఈ టొయోటా ఎమ్పివికి ప్రత్యక్ష పోటీదారులు ఎవరూ లేరు. అయితే, ఈ కారుకి ప్రత్యామ్నాయంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన 7-సీటర్ ఎస్యూవీ హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా ఎక్స్యూవీ700 మరియు టాటా సఫారి వంటి మోడళ్లను ఎంచుకోవచ్చు.

ఇదిలా ఉంటే, టొయోటా భారత్లో మరో రెండు కొత్త ఎమ్పివి కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎర్టిగా ఎమ్పివి యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. దీనికి టొయోటా రుమియన్ అనే పేరును పెట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఈ పేరుతో టొయోటా ఓ ఎమ్పివి కారు ఇటీవలే దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల చేసింది.

జపాన్కు చెందిన టొయోటా మరియు సుజుకి కంపెనీలు భారతదేశంలో ఓ పరస్పర సహకార ఒప్పందాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసినదే. ఈ ఒప్పందంలో భాగంగా, మారుతి సుజుకి తయారు చేసే కొన్ని మోడళ్లను టొయోటా రీబ్యాడ్జ్ చేసి, తమ బ్రాండ్ పేరుతో విక్రయిస్తుంది. ఇలా ఇప్పటికే బాలెనో ఆధారిత గ్లాంజా మరియు విటారా బ్రెజ్జా ఆధారిత అర్బన్ క్రూయిజర్ అనే మోడళ్లను టొయోటా విక్రయిస్తోంది. ఇదే పంథాలో త్వరలోనే సియాజ్ ఆధారితా బెల్టా సెడాన్ మరియు ఎర్టిగా ఆధారిత రుమియర్ ఎమ్పివిలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం, టొయోటా నుండి ఇన్నోవా క్రిస్టాకి దిగువన ఎలాంటి ఎమ్పివి అందుబాటులో లేదు. అధిక ధర కారణంగా, టొయోటా ఇన్నోవా క్రిస్టాను కొనుగోలు చేసే కస్టమర్లు పరిమిత సంఖ్యలో ఉన్నారు. అందుకే, సరసమైన ధరకే ఓ అద్భుతమైన ఎమ్పివిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టొయోటా ప్లాన్ చేస్తోంది. దీంతో పాటుగా టొయోటా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్యూవీ టొయోటా ఆర్ఏవి-4 ని కూడా భారతదేశంలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








