సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించిన Ola Cars; ట్రై అండ్ బై
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తూ మరియు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ (S1, S1 Pro) తో యావత్ భారదేశాన్నే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా (Ola) ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.

Ola Cars పేరుతో Ola ఇప్పుడు భారత మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్ల (యూజ్డ్ కార్లు లేదా ప్రీ-ఓన్డ్ కార్లు) మార్కెట్ లోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో వాడిన కార్లను విక్రయించడం ప్రారంభించడం కోసం కంపెనీ ట్రై అండ్ బై (Try and Buy) పేరుతో ఇంటి వద్దకే ఈ సేవలను అందించబోతోంది.

ట్రై అండ్ బై విధానం ద్వారా కస్టమర్లు Ola Cars అందించబోయే సెకండ్ హ్యాండ్ కార్లను నడిపి చూసి సంతృప్తి చెందిన తర్వాతనే కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం కంపెనీ తమ సెకండ్ హ్యాండ్ కార్లను నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే తీసుకువచ్చే ఏర్పాటు చేయనుంది.

అంతేకాకుండా, సెకండ్ బ్యాండ్ కార్ల కొనుగోలును సులభతరం చేయడం కోసం కంపెనీ EMI సేవలను మరియు ఒక సంవత్సరం వారంటీని కూడా అందించనుంది. ఒకవేళ, ఎవరైనా కస్టమర్లు తమ వాడిన కార్లను విక్రయించాలనుకుంటే, అందుకోసం కూడా ఓలా సేవలను అందిస్తోంది. అంటే, Ola Cars కేవలం సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించడం మాత్రమే కాకుండా, కస్టమర్ల నుండి కొనుగోలు కూడా చేస్తుంది.

భారతదేశంలో, ఇటీవలి కాలంలో కొత్త కార్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మొదటిసారిగా కారును కొనేవారు మరియు అధిక ధరల వద్ద కొత్త కార్లను కొనే స్థోమత లేని వారు సెకండ్ హ్యాండ్ కార్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు, ప్రజలు కూడా కోవిడ్-19 సంక్షోభం తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే పర్సనల్ ట్రాన్స్పోర్ట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం కూడా పుంజుకుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ పి అండ్ ఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో సెకండ్హ్యాండ్ కార్ల మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లు ఉండగా 2030 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో, Ola ఈ రంగంలో పట్టు సాధించడం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది.

భారతదేశంలో మారుతి సుజుకి (ట్రూ వ్యాల్యూ), మహీంద్రా (ఫస్ట్ ఛాయిస్) వంటి సంస్థలు ఇప్పటికే ఈ వ్యాపారంలో రాణిస్తున్నాయి మరియు అధిక సంఖ్యలో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నాయి. మనదేశంలో వాడిన కార్ల అమ్మకంలో భారీ పెరుగుదల కనిపిచింది. ముఖ్యంగా లాక్డౌన్ తరువాత, ఎక్కువ మంది వినియోగదారులు వాడిన కార్లను కొనుగోలు చేస్తున్నారు.

ఈ ప్రభావం వలన చాలా వరకూ కొత్త ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు ప్రభావితం అయ్యాయి మరియు ఇలా కొత్త ఎంట్రీ లెవల్ కారుకు అయ్యే ఖర్చుతో చాలా మంది కస్టమర్లు వాటి స్థానంలో వాడిన మరియు పెద్ద కార్లను కొనుగోలు చేస్తున్నారు. మరి ఈ విభాగంలోకి కొత్తగా వస్తున్న Ola సెకండ్ హ్యాండ్ కార్లను కస్టమర్లు ఎంతగా విశ్వసిస్తారో చూడాలి.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్స్..
ఇదిలా ఉంటే, Ola Electric ఇటీవల తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో విడుదల చేసింది. Ola S1 మరియు Ola S1 Pro పేర్లతో కంపెనీ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. వీటి ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్సైట్ ను సందర్శించి వీటిని రూ. 499 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Ola ఎలక్ట్రిక్ కారు..
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కాకుండా, భవిష్యత్తు కోసం ఓ ఎలక్ట్రిక్ కారును కూడా తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే 2023 లో ఓ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసేందుకు Ola సన్నాహాలు చేస్తోంది. ట్విట్టర్ వేధికగా ఓ వినియోగదారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఓలా సంస్థ అధినేత భవీష్ అగర్వాల్ "నేను రెండు నెలల క్రితమే ఓ కారు కొన్నాను మరియు అది హైబ్రిడ్ కారు. నా తదుపరి కారును నేను 2023 లో కొనుగోలు చేస్తాను మరియు అది Ola యొక్క ఎలక్ట్రిక్ కారు అవుతుంది" అని అన్నారు.

Ola లో Flipkart పెట్టుబడులు..
గత కొంత కాలంగా Ola భారత మార్కెట్లో చాలా అగ్రెసివ్ ప్లాన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు Ola సంస్థను మరింత ముందుకు నడిపించేందుకు ప్రముఖ ఆన్లైన్ రీటైల్ కంపెనీ ఫ్లిప్కార్ట్ (Flipkart) ముందుకొచ్చింది. ఓలా కంపెనీలో ఫ్లిప్కార్ట్ ఫౌండర్ సచిన్ బన్సాల్ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు Flipkart సహకారంతో Ola మరింత మరింత ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. అయితే, ఎంత మేర పెట్టుబడిని వెచ్చించారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు.


Click it and Unblock the Notifications








