మెట్రో స్టేషన్ల వద్ద క్యాష్లెస్ పార్కింగ్ సేవలను ప్రారంభించిన Paytm
డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ పేటీఎం (Paytm) దేశవ్యాప్తంగా ఫాస్ట్ట్యాగ్ ఆధారిత పార్కింగ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు Paytm ఆర్థిక సేవల సంస్థ Paytm Payments Bank Limited, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ఈ ఇరు సంస్థలు కలిసి ఇప్పుడు దేశంలో మొట్టమొదటి FASTag ఆధారిత నగదు రహిత పార్కింగ్ సదుపాయాన్ని ప్రారంభించాయి. ఈ క్యాష్లెస్ పార్కింగ్ సేవలను ముందుగా కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభించారు. క్రమంగా ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నారు.

ఇకపై పార్కింగ్ కోసం ప్రజలు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించక్కర్లేదు, Paytm ఆధారిత FASTag స్టిక్కర్ ఉండి, అందులో తగినంత బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. పార్కింగ్ ప్రదేశంలో ఉండే స్కానర్ల సాయంతో, పార్కింగ్ రుసుమును ఆటోమేటిక్గా ఖాతా నుండి డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా నగదు రహితంగా ఉంటుంది.

ఈ సందర్భంగా Paytm కంపెనీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియా ప్రచారం కింద, దేశంలో చెల్లింపుల (పేమెంట్స్) కోసం డిజిటల్ సేవలను ప్రోత్సహించడానికి తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత నగదు రహిత పార్కింగ్ ప్రవేశపెట్టామని చెప్పారు. ఇకపై పార్కింగ్ ఛార్జీల చెల్లింపు కోసం ప్రజలు కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం ఉండదని, ఇది సమయాన్ని ఎంతగానో ఆదా చేస్తుందని అన్నారు.

ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఇకపై మెట్రో పార్కింగ్ సదుపాయంలో FASTag స్టిక్కర్ ఉన్న కార్ల నుండి నగదు రహిత లావాదేవీలన్నీ కూడా Paytm చెల్లింపుల ద్వారా జరుగుతాయి. అయితే, పార్కింగ్ కోసం వచ్చే ద్విచక్ర వాహనదారులు మాత్రం UPI ఆధారిత చెల్లింపు ద్వారా పార్కింగ్ ఫీజును చెల్లించే సౌలభ్యం కూడా ఉంటుంది.

ప్రస్తుతం Paytm దేశంలోని వివిధ రాష్ట్రాలలోని అనేక మున్సిపల్ కార్పొరేషన్లతో కలిసి FASTag ఆధారిత పార్కింగ్ సదుపాయాలను పరిచయం చేయడానికి కృషి చేస్తోంది. అదనంగా, దేశంలోని షాపింగ్ మాల్లు, ఆసుపత్రులు మరియు విమానాశ్రయాలలో డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను అమలు చేయడానికి వివిధ వాటాదారులతో కూడా చర్చలు జరుపుతోంది.

దేశంలో నగదు రహిత పార్కింగ్ సేవలను అందించేందుకు వివిధ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని పేటీఎం మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సతీష్ గుప్తా తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో, నగదు రహిత పార్కింగ్ దేశంలో పెద్ద ఎత్తున స్వీకరించబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో జాతీయ రహదారుల గుండా ప్రయాణించే వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి చేయటంతో, గడచిన జూన్ 2021 నెలలో, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ 10 మిలియన్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్ లను జారీ చేసిన మొదటి కంపెనీగా అవతరించింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూన్ చివరి వరకు దేశంలో 3.47 కోట్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్ లు జారీ చేయబడ్డాయి.

డిజిటల్ మాధ్యమం ద్వారా టోల్ ఫీజు వసూలు కోసం FASTag ఆధారిత టోల్ పన్ను చెల్లింపు వ్యవస్థను ఉపయోగించడం జరుగుతోంది. FASTag ఉన్న వాహనాలు ఇదివరకటిలా టోల్ బూత్ ల వద్ద గంటల తరబడి వేచి ఉండి, టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ట్యాగ్ కలిగిన వాహనాల యొక్క టోల్ ఫీజును, టోల్ ప్లాజాల వద్ద అమర్చిన డిజిటల్ స్కానర్ల సాయంతో సదరు వాహన యజమాని బ్యాంక్ ఖాతాను ఆటోమేటిక్గా డిడక్ట్ చేయటం జరుగుతుంది.

టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించి, టోల్ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయటం తద్వారా ప్రయాణీకుల ప్రయాణాన్ని సౌకర్యంగా మార్చడమే ఈ FASTag ఒక్క ప్రధాన లక్ష్యం. ఫాస్ట్ట్యాగ్ అనేది ఎలక్ట్రానికి చిప్ మరియు బార్కోడ్ తో కూడిన ఓ స్టిక్కర్, ఇది వాహనాల ఫ్రంట్ విండ్షీల్డ్ పై అంటించబడి ఉంటుంది మరియు ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది.

FASTag స్టిక్కర్ కలిగిన వాహనాలు వాహనాలు టోల్ ప్లాజా గుండా వెళుతున్నప్పుడు, టోల్ ట్యాక్స్ ఆటోమేటిక్గా బ్యాంక్ లేదా ఫాస్ట్ట్యాగ్ కి లింక్ చేయబడిన ప్రీపెయిడ్ ఖాతా నుండి చెల్లించబడుతుంది. అంటే, ఫాస్ట్ట్యాగ్ స్టిక్కర్ కలిగి ఉన్న వాహనాలు, టోల్ ఫీజు చెల్లింపు కోసం టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు.
జాతీయ రహదారులపై ఉపయోగించే ప్రయాణీకుల నాలుగు చక్రాల వాహనాలు (కార్లు), బస్సులు, ట్రక్కులు, లారీలు మరియు వాణిజ్య వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ అమలు చేయబడింది. ద్విచక్ర వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ ను ఇన్స్టాల్ చేయడం అవసరం లేదని గమనించండి.

కొత్తగా ఫాస్ట్ట్యాగ్ కొనాలనుకునే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా కెవైసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకులు మరియు ఈ కామర్స్ కంపెనీల ద్వారా ఫాస్ట్ట్యాగ్ ను కొనుగోలు చేయవచ్చు.హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ వంటి బ్యాంక్స్ మరియు పేటీఎం, అమెజాన్ వంటి సంస్థల ద్వారా కూడా ఇది అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








