ధరలు పెరుగుతున్నాయని తెలుసు కానీ, మేమేం చేయలేము: పెట్రోలియం మంత్రి!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపు ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేయడంతో, వాటి ధరల నిర్వహణ చమురు కంపెనీల చేతికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో, చమురు కంపెనీ ఇష్టారాజ్యంగా దేశంలో ఇంధన ధరలను పెంచేస్తున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది, డీజిల్ ధరలు కూడా ఇంచు మించు అందే రేంజ్లో ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను మరింత నిరాశపరిచే వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పెరుగుతున్న ఇంధన ధరల గురించి తమకు తెలుసునని, అయితే ప్రభుత్వం ఆ డబ్బును సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్నందున దానిని తగ్గించలేమని ఆయన అన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ప్రస్తుత ఇంధన ధరలు ప్రజలకు పెద్ద సమస్య అని నేను అంగీకరిస్తున్నాను, అయితే ఒక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కోసం రూ.35,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాయి. సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయడానికి డబ్బు ఆదా చేస్తున్నారు" అని చెప్పారు.

"ఎనిమిది నెలల పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 1 లక్షల కోట్ల రూపాయలను ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదించారు. పిఎమ్ కిసాన్ పథకం కింద మన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వేలాది కోట్ల రూపాయాలు నేరుగా డిపాజిట్ చేయబడ్డాయి. ఇటీవల ఎంఎస్పి కూడా పెరిగింది మరియు ఇవన్నీ ఈ సంవత్సరంలోనే జరుగుతున్నాయని" ధర్మేంద్ర చెప్పారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయాన్ని దాటవేస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ఈ ప్రకటనను చూస్తుంటే, రాబోయే కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో, ఇంధన ధరలను తగ్గించకపోతే, చాలా నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు రూ.100 దాటిపోయే ప్రమాదం ఉంది.

కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క ప్రకటనను పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించే అవకాశం లేదని ఊహించవచ్చు. ఎందుకంటే, ఆయన స్టేట్మెంట్ ప్రకారం, ఇలా పెట్రోల్ ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్నంతా వివిధ సంక్షేమ పథకాల కోసమే ఆదా చేయబడుతోంది.

ప్రస్తుతం భారతదేశం యొక్క పూర్తి ఇంధన డిమాండ్లో 82 శాతం ఇంధనాన్ని విదేశాల నుండే దిగుమతి చేసుకుంటోంది. పెట్రోల్, డీజిల్పై ఇప్పటికే పన్నులు భారీగా ఉన్నాయి. దీంతో సిఎన్జి, ఎలక్ట్రిక్ కార్లు, జీవ ఇంధనాల వంటి వివిధ ప్రత్యామ్నాయ ఇంధనాలను మరియు సదరు ఇంధనాలతో నడిచే వాహనాల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఫేమ్-2 సబ్సిడీని కూడా ప్రభుత్వం సవరించింది. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎక్కువ మందిని ఆకర్షించడంలో సహాయపడుతుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications








