కరోనా వైరస్ లాక్డౌన్ కొనసాగింపు: చెన్నైలో రెనో-నిస్సాన్ ప్లాంట్ షట్డౌన్!
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ, కరోనా వైరస్కి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

వైరస్ సంక్రమణ కేసులు, కోవిడ్ మరణాలు అధికం అవుతుండటంతో లాక్డౌన్ను పొడగించాలని ఆలోచిస్తున్నారు. తాజాగా, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది.

ఒకప్పుడు మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యేవి. కాగా, ఇప్పుడు తమిళనాడు ఆ విషయంలో మహారాష్ట్రను అధిగమించింది. రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించకపోవడంతో, గడచిన సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో, తమిళనాడులోని ఒరాగడమ్ ప్లాంట్లో తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు రెనాల్ట్-నిస్సాన్ కంపెనీలు ప్రకటించాయి. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, జపాన్ కార్ బ్రాండ్ నిస్సాన్లు రెండూ సంయుక్తంగా తమిళనాడులో ఒరాగడమ్ ప్లాంట్లో వాహనాలను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసినదే.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ఇరు కంపెనీలు తమ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఫలితంగా, ఈ ప్లాంట్లో మే 30 వరకు ఉత్పత్తి ఆగిపోయింది. రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ, కొన్ని పరిశ్రమలు మాత్రం ఆయా రాష్ట్రాల కోవిడ్ నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలతో సిబ్బందితో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు.

అయితే, ఈ అంటువ్యాధి కారణంగా దేశంలో వేలాది మంది చనిపోతున్న సమయంలో, మా మహమ్మారి బారిన పడుతామనే భయంతో ఉద్యోగులు పనిచేసేందుకు విముఖ చూపుతున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేయాలని రెనాల్ట్ నిస్సాన్ కోసం పనిచేసే రెనాల్ట్ నిస్సాన్ తోజిలార్గల్ కార్మిక సంగం డిమాండ్ చేసింది.

కార్మికుల డిమాండ్ మేరకు రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చివరకు తమ ప్లాంట్ను ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు తెలిపింది. చెన్నై శివార్లలోని ఒరగడమ్ ప్లాంట్లో సంస్థ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ విషయం గురించి నాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి మరియు సిఇఒ బిజు బాలేంద్రన్ పంచుకున్న అంతర్గత లేఖలో, "చెన్నై మరియు చుట్టుపక్కల ఉన్న కోవిడ్-19 పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అందువల్ల, మా ఉద్యోగులు మరియు వారి కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని మరియు ముందుజాగ్రత్తగా, మే 26 నుండి మే 30 వరకు ప్లాంట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించామని" పేర్కొన్నారు.

ప్రస్తుతం చెన్నై మరియు తమిళనాడులోని పరిస్థితులను నిశితంగా పరిశీలించడం కొనసాగిస్తామని మరియు ప్లాంట్ కార్యకలాపాలను ఎప్పుడు పునఃప్రారంభిస్తామనే సమాచారాన్ని కూడా త్వరలో తెలియజేస్తామని ఆయన అన్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే, మే 30 తర్వాత కూడా ప్లాంట్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

తమిళనాడులోని ఒరాగడంలోని రెనాల్ట్-నిస్సాన్ కర్మాగారంలో సుమారు 5,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మే 25 నాటికి తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా 34,285 కేసులు మరియు 468 మరణాలు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications








