ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే
సాధారణంగా ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో కూడా దేశ రాజధాని నగరంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. అయితే గత 2020 లో ఢిల్లీలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. దీనికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి వ్యాప్తి. కరోనా ఎక్కువగా వ్యాపించడం వల్ల 2020 లో కరోనా లాక్ డౌన్ విధించబడింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలో వాహన రాకపోకలు తగ్గాయి, ఈ కారణంగా ప్రమాదాల సంఖ్య దాదాపు 26 % తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ట్రాఫిక్ స్పెషల్ పోలీస్ కమిషనర్ నివేదించారు. నివేదికల ప్రకారం, 2019 లో నమోదైన 5,610 రోడ్డు ప్రమాదాలలో మొత్తం 1,433 కేసులు తీవ్రంగా ఉన్నాయి. 2020 లో సంభవించిన మొత్తం 4,178 రోడ్డు ప్రమాదాలలో 1,163 కేసులు తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది.

గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య, మునుపటికంటే 18% తగ్గినదని నివేదికలు తెలిపాయి. గాయపడిన వారి సంఖ్య 29% తగ్గింది. 2019 లో ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 5,152 మంది గాయపడగా, మొత్తం 1,463 మంది మరణించారు. 2020 లో రోడ్డు ప్రమాదాల్లో 3,662 మంది గాయపడగా, 1,196 మంది మరణించారు.

రోడ్డు నిబంధనలపై ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహనా కల్పిస్తూనే ఉన్నారు. దీనికోసం పోలీసులు రేడియో, ప్రింట్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ సైట్లపై ఆధారపడుతున్నారు. 2020 లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై దృష్టి సారించారు.

ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు హెల్మెట్లు, లైసెన్స్ మరియు రాంగ్ రూట్ లో డ్రైవింగ్ వంటివి గుర్తించి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా, ట్రాఫిక్ ఉల్లంఘించినవారిని గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు వివిధ ప్రదేశాలలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు ఏడాది పొడవునా మితిమీరిన వేగం, డ్రింక్ అండ్ డ్రైవ్, నో పార్కింగ్ వంటి వాటిపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇటీవల అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలో వచ్చే 6 నెలల్లో అన్ని ప్రభుత్వ విభాగాల్లోని పెట్రోల్-డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా 2 వేలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తుంది.

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం గత సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమలు చేసింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేసేవారికి రిజిస్ట్రేషన్ ఫీజు మరియు రోడ్ టాక్స్ నుండి మినహాయింపు కల్పించారు. అంతే కాకుండా ఢిల్లీ ప్రభుత్వం స్విచ్ ఢిల్లీ ప్రచారాన్ని ప్రారంభించింది.

ఈ ప్రచారం కింద ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వాహనాలను వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టిన తరువాత, 12 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ అమ్మకానికి అందుబాటులో ఉంచబడ్డాయి. ఈ కార్లపై రూ. 1.5 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది.

దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది. దీనిని నిర్మూలించడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నివేదికల ప్రకారం, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల సంఖ్య పెరగటమే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగటానికి ప్రధాన కారణం. ఈ కారణంగా, పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించాలని, ఆ స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే


Click it and Unblock the Notifications








