చిప్స్ కొరత.. మారుతి సుజుకి ప్లాంట్ బంద్.. పెరగనున్న వెయిటింగ్ పీరియడ్..!?
ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ను వేధిస్తున్న సెమీకండక్టర్ల చిప్స్ కొరత, ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ చిప్స్ కొరత కారణంగా భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా తరువాత, ఇప్పుడు మారుతి సుజుకి కూడా తమ ఉత్పత్తిని తగ్గించే ఆలోచనలో ఉంది.

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ఒకే షిఫ్ట్లో కార్ల ఉత్పత్తిని నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఆగస్టు 7, 14 మరియు 21 తేదీలలో అహ్మదాబాద్ ప్లాంట్లో కంపెనీ తమ వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

వాహన తయారీలో సెమీకండక్టర్ చిప్స్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. మోడ్రన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఈసియూ (ఇంజన్ కంట్రోల్ యూనిట్), డ్రైవర్ అసిస్టెడ్ ఫీచర్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఈ సెమీకండక్టర్ చిప్లను ఉపయోగిస్తారు.

ఈ సెమీకండక్టర్ చిప్స్ లేకుండా, కారు తయారీలో అవసరమైన ఇలాంటి ముఖ్యమైన భాగాలను తయారు చేయలేరు మరియు వాటిని అమర్చలేరు. ఫలితంగా, కార్ల ఉత్పత్తి కూడా అసాధ్యంగా మారుతుంది. ఈ సమస్య వలన మారుతి సుజుకి తమ వాహనాల ఉత్పత్తిలో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కోనుంది.

మారుతి సుజుకి ఈ పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని మరియు వివిధ రకాల మోడళ్లు, ప్రొడక్షన్ లైన్లు లేదా షిఫ్ట్లపై రోజువారీ నిర్ణయాలు తీసుకుంటుందని, సెమీకండక్టర్ కొరత కారణంగా ఈ నెలలో ఉత్పత్తి పాక్షికంగా ప్రభావితమవుతుందని" కంపెనీ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.

మార్చి 2014 లో స్థాపించబడిన ఈ ప్లాంట్ సంవత్సరానికి 7.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అక్టోబర్ 2020 లో, ఈ ప్లాంట్ మారుతి సుజుకి సంస్థ యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి సౌకర్యాలలో ఒకటిగా మారింది మరియు రికార్డు స్థాయిలో 1 మిలియన్ యూనిట్ల వాహనాల ఉత్పత్తిని సాధించింది.

ఇటీవలి కాలంలో సెమీకండక్టర్ చిప్స్ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి మరియు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా తయారు చేసే వాహనాలలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. కొత్తగా వస్తున్న వాహనాలు బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్మెంట్ మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో రూపుదిద్దుకుంటున్నాయి. వీటన్నింటికీ ఈ చిప్స్ ఎంతో అవసరం.

చిప్స్ కొరత వల్ల ఇతర కంపెనీల ఉత్పత్తి కూడా ప్రభావితం అవుతోంది.
సెమీకండక్టర్స్ చిప్స్ కొరత మారుతి సుజుకి సంస్థనే కాదు ఎమ్జి మోటార్, నిస్సాన్, టాటా మోటార్స్ మరియు మహీంద్రా వంటి అనేక ఇతర కార్ల తయారీదారుల ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తోంది. టాటా మోటార్స్ ఇటీవల ప్రపంచ సెమీకండక్టర్ కొరతను పరిష్కరించడానికి వివిధ చర్యలను ప్లాన్ చేసినట్లు తెలిపింది.

ఈ చిప్స్ కొరతను అధిగమించడానికి, కంపెనీలు తమ ఉత్పత్తులను సవరించడంతో పాటు, సెమీకండక్టర్ తయారీదారుల నుండి నేరుగా చిప్లను కొనుగోలు చేసే పద్ధతిని అవలంబిస్తున్నాయి. అంతే కాకుండా, కంపెనీలు చిప్ను మార్చడం లేదా ఇతర ఆల్టర్నేటివ్ చిప్లను ఉపయోగించడం ద్వారా చిప్ కొరతను పరిష్కరిస్తున్నాయి. అయితే, ప్రస్తుత త్రైమాసికంలో వీటి సరఫరా పరిస్థితి చాలా సవాలుగా ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది.


Click it and Unblock the Notifications








