టాటా అభిమానులకు షాకింగ్ న్యూస్.. జనవరి 2022 నుండి పెరగనున్న కార్ల ధరలు!
కొత్త సంవత్సరంలో టాటా కార్లను కొనాలనుకునేవారికి కంపెనీ భారీ షాక్ ఇవ్వబోతోంది. జనవరి 2022 నుండి టాటా కార్లు మరింత ఖరీదైనదిగా ఉండబోతున్నాయి. వాహనాల తయారీ కోసం ఇన్పుట్ కాస్ట్ నిరంతరం పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ ఈ భారాన్ని తగ్గించుకునేందుకే వచ్చే ఏడాది నుండి ధరలను పెంచబోతోందని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దీన్నిబట్టి చూస్తుంటే, టాటా కార్లపై డబ్బు ఆదా చేసుకోవాలనుకుంటే, ఈ ఏడాదే కొనుగోలు చేయడం మంచిదని తెలుస్తోంది.

టాటా మోటార్స్ ఇటీవలే తమ వాణిజ్య వాహనాల ధరల పెంపు గురించి కూడా ప్రకటన చేసింది. తాజాగా, ఇప్పుడు ప్యాసింజర్ వాహనాల ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా దేశంలో ముడిసరుకు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి, దీని కారణంగా కంపెనీలు కూడా ధరలను పెంచవలసి వస్తోంది.

ఇప్పటికే దేశంలోని అనేక ఆటో కంపెనీలు తమ కార్ల ధరలను రెండు నుండి మూడు రెట్లు పెంచాయి. ఇప్పుడు మరోసారి ఈ సంవత్సరం చివరి నెలలో కానీ లేదా కొత్త సంవత్సరం ప్రారంభంలో కానీ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. టాటా కార్ల విషయంలో తాజా ధరల పెంపు విషయానికి వస్తే, ఏయే మోడళ్లపై ఎంత మేర ధరలను పెంచనున్నామనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

కాగా, ఇటీవలే టాటా తమ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారీ ఆటోమేటిక్ వేరియంట్ల ధరలను సుమారు రూ. 7,000 మేర పెంచింది. ఇటీవల విడుదల చేసిన టియాగో ఎన్ఆర్జి ఏఎమ్టి వెర్షన్ ధర రూ. 3,000 పెరిగింది. ఆల్ట్రోజ్ విషయానికి వస్తే, ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి - 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్.

వీటిలో న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 1,500 నుంచి రూ. 5,500 వరకు పెరగగా, డీజిల్ ట్రిమ్ ధర ఇప్పుడు రూ. 400 నుండి రూ. 5,000 వరకు పెరిగింది. అదే సమయంలో టర్బో పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 2,500 నుంచి రూ. 8,500కి పెరిగాయి. కొత్తగా ప్రారంభించబడిన ఎక్స్ఈ+ వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు మరియు ఇది రూ. 6.34 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ యొక్క ఎంపిక చేసిన పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల ధరలను కంపెనీ రూ. 11,500 వరకు పెంచింది. అయితే, టాప్-స్పెక్ ఎక్స్జెడ్+ మరియు ఎక్స్జెడ్ఏ+ ప్లస్లు మాత్రం ఈ ధరల పెంపు నుండి మినహాయించబడ్డాయి మరియు ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరల వద్దనే అందుబాటులో ఉన్నాయి. టాటా సఫారి ఆటోమేటిక్ వేరియంట్ ధరలను రూ. 7000 వరకూ పెంచారు.

టాటా మోటార్స్ ఈ సఫారీ ఎస్యూవీని మొత్తం ఆరు ట్రిమ్ లలో (XE, XM, XT, XT+, XZ, XZ+) విక్రయిస్తున్నారు. ఇందులో ఎక్స్టిఏ వేరియంట్ ధర రూ. 7000 పెరగగా, ఎక్స్ఎమ్ఏ మరియు ఎక్స్జెడ్ఏ వేరియంట్ల ధరలు రూ. 3000 వరకూ పెరిగాయి. కాగా, దీని మాన్యువల్ వేరియంట్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అదే సమయంలో, సఫారీ యొక్క మిగిలిన ఆటోమేటిక్ వేరియంట్ల ధరలను కంపెనీ రూ. 2000 మేర పెంచింది. ఈ లేటెస్ట్ ధరల పెంపు వెనుక కారణాన్ని కంపెనీ తెలియజేయలేదు.

టాటా మోటార్స్ తమ సఫారీ ఎస్యూవీలో అడ్వెంచర్ మరియు గోల్డ్ అనే రెండు ప్రత్యేక ఎడిషన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లో ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. నవంబర్ 2021లో ధరలను సవరించిన రెండు నెలల్లోనే టాటా మోటార్స్ మరోసారి తమ ఉత్పత్తుల ధరలను సవరించనుంది. ప్రస్తుతం, మార్కెట్లో టాటా కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కార్ల ధరల పెంపు కంపెనీ అమ్మకాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.

గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది టాటా మోటార్స్ అమ్మకాలు ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేశాయి. ఫలితంగా, కంపెనీ మార్కెట్ వాటా కూడా 9 శాతం నుండి 15 శాతానికి పెరిగింది. బారతదేశంలో అమ్మకాల పరంగా ప్రస్తుతం టాటా మోటార్స్ మూడవ స్థానంలో ఉంది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే టాటా మోటార్స్ ఈ జాబితాలో హ్యుందాయ్ ని అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

భారత ఆటోమొబైల్ రంగంలో సెమీకండక్టర్ చిప్ కొరత కొనసాగుతున్నప్పటికీ, గడచిన నవంబర్ నెలలో టాటా మోటార్స్ సానుకూల అమ్మకాలను నమోదు చేసింది. నవంబర్ 2021లో ఈ కంపెనీ మొత్తం 28,027 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, అమ్మకాలలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది నవంబర్ నెలలో టాటా మోటార్స్ మొత్తం 21,228 యూనిట్లను విక్రయించింది. అయితే, ఇవి గత అక్టోబర్ 2021 నెలలో టాటా మోటార్స్ విక్రయించిన 33,925 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల కంటే తక్కువ.


Click it and Unblock the Notifications








