300 మిలియన్ డాలర్లతో సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి సిద్ధం: Tata Motors
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ (Tata Motors) ఆధునిక కార్లు మరియు కమర్షియల్ వాహనాలు విడుదల చేసి తన కంటూ ఆటో మొబైల్ పరిశ్రమలో ఒక గుర్తింపు పొందుతూనే ఉంది. టాటా మోటార్స్ యొక్క వాహనాలను కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా ఎక్కువా సంఖ్యలో అమ్ముడవుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీ వాహనాలలో అందిస్తున్న నాణ్యత.

అయితే గత కొంత కాలంగా భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమలోని దాదాపు చాలా కంపెనీలు సెమికండక్టర్ చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి భారతదేశంలో విజృభించిన కారణంగా ఈ కొరత ప్రారంభమయ్యింది. ఈ చిప్ కొరత కారణంగా టాటా మోటార్ కంపెనీ తగిన సంఖ్యలో వాహనాలను ఉత్పత్తి చేయలేకపోతోంది. అంతే కాకుండా కస్టమర్లకు సరైన సమయంలో వాహనాలను డెలివరీ చేయలేకపోతోంది. ఈ కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు చాలా వరకు క్షీణిస్తున్నాయి.

భారత మార్కెట్లో కేవలం టాటా మోటార్స్ కంపెనీ మాత్రమే కాకుండా, చాలా కంపెనీలు ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనిని దృష్టిలో ఊన్చుకుని ఇప్పుడు టాటా మోటార్స్ భారతదేశంలో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికోసం కంపెనీ ఏకంగా $ 300 మిలియన్స్ వెచ్చించనుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ అక్షరాలా రూ. 2,200 కోట్లు.

ఈ ఫ్యాక్టరీ కోసం టాటా గ్రూప్ ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. ఈ ఫ్యాక్టరీ 2022 నాటికి ప్రారభించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. కంపెనీ సెమీకండక్టర్ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు కొంతకాలం క్రితం నివేదించబడింది, అయితే దీని గురించి సమాచారం బయటకి రావడం ఇదే మొదటిసారి.

టాటా మోటార్స్ అత్యాధునిక సాంకేతికత తయారీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఇది ఒక ప్రధాన అడుగు. ఇది అవుట్సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ ప్లాంట్ కానుంది. అటువంటి ప్లాంట్లలో, సిలికాన్ పొరలను ప్యాక్ చేసి, అసెంబుల్ చేసి పరీక్షించి సెమీకండక్టర్ చిప్లుగా మారుస్తారు.

నివేదికల ప్రకారం టాటా మోటార్స్ సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఒక పవర్ ఫుల్ కంపెనీ, అంతే కాకుండా హార్డ్వేర్ లో కూడా తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు సెమీకండక్టర్ చిప్ తయారీ ప్రారంభిస్తే కంపెనీ దేశంలో ఒక తిరుగులేని సంస్థగా నిలుస్తుంది. ఇందుకోసం ఇప్పుడు తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

ఇది వరకు చెప్పుకున్నట్లుగా టాటా మోటార్స్ వచ్చే ఏడాది ఈ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే, సంవత్సరం చివరి నాటికి ఈ ఫ్యాక్టరీలో పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇందులో దాదాపు 4,000 మందికి ఉపాధి కూడా లభించే అవకాశం ఉంటుంది. టాటా ఈ ప్లాంట్ను ప్రారంభించిన వెంటనే, దాని చుట్టూ పర్యావరణ వ్యవస్థ కూడా సమతుల్యత చేయడానికి సన్నాహాలు చేయాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని దానికి కావాల్సిన స్థలాలకోసం వెతుకుతోంది. కంపెనీ ఈ ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

సెమీకండక్టర్ చిప్స్ వినియోగం ఆటోమొబైల్ సెక్టార్లో కీలక పాత్ర పోషిస్తోన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లలో వినియోగించే సర్కుట్లల్లో వీటిని వాడుతుంటారు. కార్ల తయారీలో చిప్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్ కంట్రోల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్, డిస్ప్లే, ఓడోమీటర్ యూనిట్లు పనిచేయాలంటే చిప్ల అవసరం ఉంటుంది. చివరికి వైపర్ పని చేయాలన్నా కూడా చిప్ అవసరమౌతుంది. ఒక కంపెనీ యొక్క కారు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుని ప్లాంట్ నుంచి బయటికి వచ్చిందంటే, అందులో సెమీకండక్టర్ చిప్ లేనిదే అది పూర్తి నిర్మాణం జరగదు. కావున కార్లు తాయారు కావాలంటే చిప్స్ చాలా అవసరం.

భారతదేశంలో సెమికండక్టర్ల తయారీ చాలా తక్కువగా ఉన్నాయి, ఈ చిప్లను తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ సంస్థలు అధికంగా ఉత్పత్తి చేస్తోన్నాయి. కావున ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటారు. నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన సెమీకండక్టర్ చిప్ లను మన దేశం దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ త్వరలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఫ్రాంచైజీ వెహికల్ స్క్రాపేజ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో గుజరాత్ ప్రభుత్వ సహాయంతో కంపెనీ తన మొదటి స్క్రాపింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. గుజరాత్లో స్క్రాపింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ఫ్రాంచైజీలను ఆహ్వానించింది. కంపెనీ ఫ్రాంచైజీని తీసుకోవడానికి ఇష్టపడే భాగస్వాములకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపడం కూడా ప్రారంభించింది.

అహ్మదాబాద్ ఆధారిత స్క్రాపేజ్ సెంటర్ ప్రయాణీకుల మరియు వాణిజ్య వాహనాల కోసం అభివృద్ధి చేయబడుతుంది మరియు ఏటా 36,000 వాహనాలను రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కావున దేశంలో స్క్రాపింగ్ ప్రక్రియ కూడా సులభతరం కానుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు ప్రధానంగా సెమీకండక్టర్ల కోసం చైనాపై ఆధారపడి ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా కరోనా మహమ్మారి వల్ల భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. కావున ఇటువంటి పరిస్థితిలో టాటా మోటార్స్ తీసుకున్న నిర్ణయం దేశంలోని ఆటోమొబైల్ తయారీదారులందరికి గొప్ప ఊరటను అందిస్తుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.
Source: ET Auto


Click it and Unblock the Notifications








