టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. కానీ వారికి మాత్రమే దీనిని కొనే ఛాన్స్..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భవిష్యత్ ప్రయోజనం కోసం అనేక ఎలక్ట్రిక్ కార్లను డెవలప్ చేస్తున్న సంగతి తెలిసినదే. టాటా మోటార్స్ ప్రస్తుతం తమ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోడక్ట్ లైనప్లో టిగోర్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ వాహనాలను విక్రయిస్తోంది. వీటిలో నెక్సాన్ ఈవీ మాత్రమే సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉంది.

టాటా మోటార్స్ తాజాగా గోవా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (డిఎన్ఆర్ఇ)కి టిగోర్ ఈవీ ఎలక్ట్రిక్ సెడాన్లను పంపిణీ చేసినట్లు చేసింది. అయితే, వీటిని ఎంత సంఖ్యలో అందజేశారనే అంశంపై స్పష్టత లేదు.

ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్)తో టాటా మోటార్స్ యొక్క టెండర్లో భాగంగా ఈ వాహనాలను పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించి టాటా మోటార్స్ ఇటీవలే ఒక హ్యాండోవర్ వేడుకను కూడా నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ పాండురంగ్ సావంత్, నీలేష్ కాబ్రాల్ (విద్యుత్, పర్యావరణ, నాన్-కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మరియు లా అండ్ జ్యుడిషియరీ), రాజేష్ తులసిదాస్ పట్నేకర్ (గోవా శాసనసభ అసెంబ్లీ స్పీకర్) మరియు పెయిర్మల్ రాయ్ (గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)లతో పాటుగా ఇతర సీనియర్ మంత్రులు కూడా హాజరయ్యారు.

టాటా మోటార్స్ తమ ఇతర గ్రూప్ కంపెనీలైన టాటా పవర్, టాటా కెమికల్స్, టాటా ఆటో కాంపోనెంట్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ మరియు ఇతర సంస్థలతో కలిసి 'టాటా యూనివర్స్' అని పిలువబడే ఓ ఈ-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కలిసి పనిచేస్తోంది. ఈ పర్యావరణ వ్యవస్థ దేశంలోని ప్రజలు వేగంగా ఇ.వి.లను స్వీకరించడానికి అనుమతించేలా ప్రోత్సహిస్తుందని టాటా మోటార్స్ భావిస్తోంది.

ఇక టాటా మోటార్స్ అందిస్తున్న టిగోర్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ విషయానికి వస్తే, ఇది భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ ఆఫర్లలో ఒకటిగా ఉంటుంది. భారతదేశంలో ప్రస్తుతం ఇదే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా కొనసాగుతోంది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ సెడాన్లో 21.5 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 40 బిహెచ్పి పవర్ను మరియు 105 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి ఉంటుంది. ఇది ఎక్స్ఈ ప్లస్, ఎక్స్ఎమ్ ప్లస్ మరియు ఎక్స్టి ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది.

కస్టమర్ ఎంచుకునే వేరియంట్ను బట్టి టాటా టిగోర్ ఈవీ ఒకే ఛార్జీపై 140 కిలోమీటర్లు లేదా 213 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ను అందిస్తుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ధరలు రూ.9.58 లక్షల నుండి రూ.9.90 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కారు కొనుగోలుపై ప్రభుత్వం అందించే ఫేమ్ రాయితీలను పొందవచ్చు.

టాటా టిగోర్ ఈవీ ప్రస్తుతం ప్రధానంగా వాణిజ్య మరియు రవాణా కార్యకలాపాల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ప్రైవేట్ కొనుగోలుదారులకు అందుబాటులో లేదు. అయితే, టాటా మోటార్స్ జూమ్కార్స్తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకొని, అద్దె ప్రాతిపదికన ప్రైవేట్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ సెడాన్ ప్రస్తుతం భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు మరియు కోల్కతా నగరాల్లో అందుబాటులో ఉంది. టాటా టిగోర్ ఈవీ భవిష్యత్తులో ప్రైవేట్ కస్టమర్ల కోసం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








