నాలుగేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొస్తాం : టాటా మోటార్స్
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2025 నాటికి 10 కొత్త బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మారుతున్న మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా తమ సంస్థ కుడా క్లీన్ ఎనర్జీ వాహనాల తయారీ వైపుకు మారుతోందని కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.

టాటా మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో టిగోర్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వీటిలో టిగోర్ ఈవీని ప్రభుత్వ మరియు వాణిజ్య ప్రయోజనాల ఉపయోగార్థం మాత్రమే విక్రయిస్తుండగా, నెక్సాన్ ఈవీని సాధారణ ప్రజల వినియోగార్థం విక్రయిస్తున్నారు. అలాగే, ఆల్ట్రోజ్ హ్యాచ్బ్యాక్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ను కంపెనీ రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ కార్ విభాగంలోనే అత్యధిక మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తమ అగ్రస్థానాన్ని అలానే కొనసాగించేందుకు, తమ ఈవీ పోర్ట్ఫోలియోకు మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని చూస్తోంది.

టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4,000 యూనిట్లకు పైగా విక్రయించింది. టాటా నెక్సాన్ ఈవీ భారతదేశంలో స్థిరమైన ప్రజాదరణ పొందుతూ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఇది గడచిన ఆర్థిక సంవత్సరంలో 64 శాతం మార్కెట్ వాటాతో భారతదేశపు నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.

మొత్తంగా చూసుకుంటే, టాటా మోటార్స్ మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 2 శాతంగా మాత్రమే ఉందని, అయితే రాబోయే కొన్నేళ్లలో ఇది వేగంగా వృద్ధి చెందుతుందని చంద్రశేఖరన్ చెప్పారు. టాటా మోటార్స్ 2025 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా, ఈవీ మార్కెట్కు ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన తెలియజేశారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విషయంలో ఇటీవల భారత ప్రభుత్వం చేసిన ప్రోత్సాహకాల సవరణ గురించి చంద్రశేఖరన్ మాట్లాడుతూ, దేశంలో కార్బన్ పాదముద్రను తగ్గించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం వారికి అనేక విధాలుగా సహకరిస్తోంది.

భారత ప్రభుత్వం తమ ఎలక్ట్రిక్ వాహన విధానాల ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇవ్వడం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించిందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్ 2022లో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్సైజ్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టి)ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి కూడా ఆదాయపు పన్ను మినహాయింపును కూడా ఇస్తున్నారు.

దేశంలో ఈవీ పర్యావరణ వ్యవస్థను నిర్మించిన మొట్టమొదటి సంస్థ టాటా మోటార్స్. ఈ సంస్థ ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ప్లాంట్లు మరియు ఈవీల కోసం అమ్మకపు సేవా సౌకర్యాలను నిర్మించింది. దేశంలో ఈవీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఏడు టాటా గ్రూప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిలో టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కెమికల్స్, క్రోమా, టాటా ఆటో కాంపోనెంట్స్ మరియు టాటా మోటార్స్ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి.

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై తమ విధానాన్ని ప్రకటించింది. వచ్చే 2030 నాటికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారు చేసే ప్రతి 10 కార్లలో 6 కార్లు ఎలక్ట్రిక్ రూపంలోనే ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా, 2032 నాటికి దేశంలోని అన్ని వాహనాలను విద్యుదీకరించే లక్ష్యాన్ని చేరుకోవటానికి, ప్రభుత్వం ఈవీ అమ్మకాలపై దీర్ఘకాలిక విధానాన్ని మెరుగుపరచాలని చంద్రశేఖరన్ అన్నారు.


Click it and Unblock the Notifications