టాటా మోటార్స్ కార్లకు పెరుగుతున్న ఆదరణ; నెక్సాన్ ఈవీకి స్పెషల్ డిమాండ్!
ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, ఇటీవలి కాలంలో మార్కెట్లోకి తీసుకువస్తున్న కొత్త రకం వాహనాలను కొనుగోలుదారులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇంపాక్ట్ 2.0 డిజైన్ థీమ్తో కంపెనీ తయారు చేస్తున్న అధునాతన వాహనాలు సరికొత్త డిజైన్, ఫీచర్లు మరియు టెక్నాలజీలను కలిగి ఉంటున్నాయి.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ గడచిన జూన్ 2021 నెలలో మొత్తం 24,111 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (జూన్ 2020లో) ఇవి 11,419 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 113 శాతం వృద్ధిని సాధించాయి.

ప్రస్తుతం, అమ్మకాల పరంగా టాటా మోటార్స్ భారతదేశపు 3వ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఉంది. దేశీయ విపణిలో టాటా మోటార్స్ టియాగో, టిగోర్, అల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు ఇటీవల విడుదల చేసిన సఫారీ కార్లను విక్రయిస్తుంది. వీటిలో, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ మరియు అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ కార్లు గ్లోబల్ ఎన్సిఎపి క్రాష్ పరీక్షలలో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను దక్కించుకున్నాయి.

భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా టాటా మోటార్స్ రెండు మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో టిగోర్ ఈవీ మరియు నెక్సా ఈవీ మోడళ్లు ఉన్నాయి. టిగోర్ ఈవీ వాణిజ్య, ప్రభుత్వ వినియోగం కోసం మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, టాటా నెక్సాన్ ఈవీని సాధారణ ప్రజల వినియోగం కోసం విక్రయిస్తున్నారు.

జూన్ 2021లో టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాలు 650 యూనిట్లుగా నమోదయ్యాయి. నెక్సాన్ ఈవీ చరిత్రలోనే ఇది అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసిందని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీని ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ మోడల్ అమ్మకాలు 4,500 యూనిట్లకు పైగా నమోదయ్యాయి. జనవరి 2020లో ఈ కారును విడుదల చేశారు.

టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దేశంలో అకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో, కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండటంతో ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ 2025 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. వీటిలో ఆల్ట్రోజ్ హ్యాచ్బ్యాక్ యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉంటుంది. అంతే కాకుండా, కంపెనీ త్వరలోనే తమ హెచ్బిఎక్స్, టాటా సియెర్రా మోడళ్లను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 మొదటి త్రైమాసికంలో టాటా మోటార్స్ అమ్మకాలు ఇప్పటి వరకూ 64,386 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు కేవలం 14,571 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి. ఈ సమయంతో పోలిస్తే, టాటా మోటార్స్ మొదటి త్రైమాసికపు అమ్మకాలు 342 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications








