టాటా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్.. సెప్టెంబర్లో 1,078 యూనిట్లు!
పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం మరియు దేశంలో పెట్రోల్ ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీల కారణంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి.

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం, ఈ కంపెనీ విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్లు సరసమైన ధరకే అందుబాటులో ఉండటమే కాకుండా, హై-ఎండ్ కార్లలో లభించే ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి.

టాటా మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో నెక్సాన్ ఈవీ (Nexon EV) మరియు టిగోర్ ఈవీ (Tigor EV) అనే రెండు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వీటితో పాటుగా టాటా టిగోర్ ఈవీ ఆధారంగా చేసుకొని, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం రూపొందించిన ఎక్స్ప్రెస్-టి ఈవీ (Xpres-T EV) అనే కారును కూడా కంపెనీ విక్రయిస్తోంది. టాటా మోటార్స్ గత నెల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది.

కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, టాటా మోటార్స్ సెప్టెంబర్ 2021 లో భారత ఎలక్ట్రిక్ వాహన (EV) విభాగంలో కంపెనీ మొత్తం 1,078 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. సెప్టెంబర్ 2020 లో కంపెనీ విక్రయించిన 308 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లతో పోల్చి చూస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 250 శాతం భారీ వృద్ధిని నమోదు చేశాయి.

మొత్తంగా చూసుకుంటే, గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో భారత ఎలక్ట్రిక్ వాహన (EV) విభాగంలో అన్ని ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల మొత్తం అమ్మకాలు 924 యూనిట్లుగా నమోదు కాగా, ఈ ఏడాది ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొత్తం అమ్మకాలు 2,704 యూనిట్లుగా ఉన్నాయి. ఈ డేటా ప్రకారం, గత నెలలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 193 శాతం వృద్ధిని సాధించాయి.

భారత ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో విడిభాగాల కొరత ఉన్నప్పటికీ, ఈ అమ్మకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. గడచిన సెప్టెంబర్ 2021 నెల నాటికి టాటా మోటార్స్ దేశంలో ఇప్పటి వరకూ 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిందని కంపెనీ తెలిపింది. ప్రస్తుత పండుగ సీజన్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని టాటా మోటార్స్ భావిస్తోంది.

కోవిడ్-19 సంక్షోభం కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రానిక్ భాగాల కొరతను ఎదుర్కుంటున్నాయి. మనదేశంలో టాటా మోటార్స్ కూడా ఈ కొరతను ఎదుర్కుంటుకొంది. రానున్న నెలల్లో కూడా ఈ కొరత కొనసాగవచ్చని, ఇది ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని మరియు వాటి ప్రభావం ఈవీల అమ్మకాలపై కూడా కనిపిస్తుందని భావిస్తున్నారు.

టాటా మోటార్స్ ఇటీవలే తమ సరికొత్త టిగోర్ ఈవీ (Tigor EV) ఎలక్ట్రిక్ సెడాన్ ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర) గా ఉంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ XE, XM మరియు XZ+ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

కంపెనీ తమ సరికొత్త ఈవీ సెడాన్ ను పాపులర్ జిప్ట్రాన్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించి తయారు చేసింది. ఇదే ప్లాట్ఫామ్ పై కంపెనీ తమ ప్రస్తుత నెక్సాన్ ఈవీ (Nexon EV) ఎలక్ట్రిక్ ఎస్యూవీని కూడా తయారు చేస్తుంది. అధునాతన Ziptron టెక్నాలజీతో అభివృద్ధి చేసిన కారణంగా కొత్త టిగోర్ ఈవీ మునుపటితో పోలిస్తే, మెరుగైన రేంజ్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ ని కలిగి ఉంటుంది.

గతంలో టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జ్పై 90 నుండి 100 కిమీ రేంజ్ ని మాత్రమే ఆఫర్ చేసేది. అయితే, ఈ అధునాతన జిప్ట్రాన్ టెక్నాలజీ కారణంగా ఇప్పుడు, కొత్త 2021 టాటా టిగోర్ ఈవీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ కంటే ఎక్కువ రేంజ్ను ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు.

ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 kW శక్తిని మరియు 170 ఎన్ఎమ్ ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇక చార్జింగ్ సమయం విషయానికి వస్తే, కొత్త టిగోర్ ఈవీని ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 1 గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే, సాధారణ ఛార్జర్ తో అయితే బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications