వాహనాల ఉత్పత్తి నిలిపివేత నిజం కాదు: టాటా మోటార్స్; అవన్నీ వట్టి పుకార్లే..!
భారతదేశపు ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ పూనే ప్లాంట్లో వాహనాల తయారీని నిలిపివేసిందంటూ వస్తున్న పుకార్లను కంపెనీ ఖండించింది. మహారాష్ట్రలో లాక్డౌన్ కారణంగా పూణేలోని టాటా మోటార్స్ ప్లాంట్లో కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే, టాటా మోటార్స్ ఈ వార్తలను ఖండిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన పూర్తి భద్రతా చర్యలను పాటిస్తూ, పరిమిత సిబ్బందితో ప్లాంట్ను రన్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 'బ్రేక్ ది చైన్' ఆదేశాల మేరకు కంపెనీ పనిచేస్తోంది.

మహారాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ ది చైన్ ఆర్డర్లో పేర్కొన్న అన్ని భద్రతా ప్రమాణాలను అనుసరించి టాటా మోటార్స్ తమ పూణే ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వివరించింది. కాబట్టి, టాటా కార్ల వెయిటింగ్ పీరియడ్ మరియు లభ్యత గురించి కస్టమర్లు చింతించాల్సిన అవసరం లేదు.

టాటా మోటార్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో "మహారాష్ట్ర ప్రభుత్వ 'బ్రేక్ ది చైన్' ఉత్తర్వులలో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి టాటా మోటార్స్ తమ పూణే ప్లాంట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పరిమిత సంఖ్యలో ఉద్యోగులు అన్ని భద్రతా ప్రోటోకాల్లు, దూర నిబంధనలు మరియు పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి విధులకు హాజరవుతున్నారు".

"మా ఉద్యోగుల భద్రత మరియు శ్రేయస్సు పట్ల మేము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాము. ఉద్యోగలకు తప్పనిసరి పరీక్షతో పాటు, ప్లాంట్ గేట్ల వద్ద స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తున్నాము. ఎవ్వరికైనా రోగ లక్షణాలు గుర్తించబడితే, సదరు ఉద్యోగిని గ్రూపు నుండి, వేరు చేసి క్వారెంటైన్కు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత సదరు ఉద్యోగితో కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం అన్ని వివరాలను సేకరిస్తాము" అని పేర్కొంది.

టాటా మోటార్స్ తమ ప్లాంట్లో 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఉద్యోగులందరికీ టీకాలు వేయించడం కూడా ప్రారంభించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహీంద్రా, టాటా మోటార్స్, ఇసుజు, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్వ్యాగన్, బజాజ్, జెబిఎమ్ వంటి సంస్థల ఉత్పత్తి కూడా ప్రభావితమైనట్లు సమాచారం.

టాటా మోటార్స్ బ్రాండ్కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, టాటా వాణిజ్య వాహన తయారీ విభాగం పీపుల్స్ క్యారియర్గా విక్రయిస్తున్న టాటా మ్యాజిక్ను ఆధారంగా చేసుకొని ఓ కొత్త రకం అంబులెన్స్లను తయారు చేసింది.

ప్రజలకు అత్యంత సరమైన అంబులెన్స్ సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యాజిక్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ వైద్య మరియు ఆరోగ్య సంబంధిత సేవలకు మద్దతుగా రూపొందించబడింది, ముఖ్యంగా ఇది కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోనుంది.

ఈ మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లో ఆటో-లోడింగ్ స్ట్రెచర్, మెడికల్ క్యాబినెట్, ఆక్సిజన్ సిలిండర్ కోసం సదుపాయం, డాక్టర్ సీటు మరియు మంటలను ఆర్పే స్ప్రేయర్, అంతర్గత లైటింగ్, మంటలను తట్టుకునే ఇంటీరియర్స్ మరియు అనౌన్స్మెంట్ సిస్టమ్ సహా అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయి.

టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ ఏఐఎస్ 125 నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని, వెనుక క్యాబిన్లో రోగికి మరియు పరిచారకులకు తగిన స్థలం, భద్రత మరియు సౌకర్యాన్ని అందించడానికి అవసరమైన అన్ని వసతులను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులో డ్రైవర్ మరియు రోగి కంపార్ట్మెంట్లను వేరు చేయబడి ఉంటాయి.


Click it and Unblock the Notifications








