ముంబైలో హెడ్క్వార్టర్స్ మరియు తొలి షోరూమ్ను ఏర్పాటు చేయనున్న టెస్లా!
ప్రపంచంలోని అత్యంత విలువైన వాహన తయారీ సంస్థగా అవతరించిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ టెస్లా ఐఎన్సి, భారతదేశంలో కూడా తమ వాహనాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పుడు తాజాగా ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించింది.

తాజా నివేదికల ప్రకారం, టెస్లా భారతదేశంలో తమ హెడ్క్వార్టర్స్ కోసం దేశ వాణిజ్య రాజధాని ముంబైని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. టెస్లా సంస్థ త్వరలోనే ముంబైలోని లోయర్ పరేల్-వర్లి వ్యాపార జిల్లాలో తమ మొదటి షోరూమ్ను మరియు కార్పోరేట్ ఆఫీస్ను ప్రారంభించనుంది.

ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ తయారీ కంపెనీ (స్పేస్ ఎక్స్) అధినేత ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా బ్రాండ్ చాలాకాలంగా భారత మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, భారతదేశంలో ఓ రిటైల్ అవుట్లెట్ను ఏర్పాటు చేయటంతో పాటుగా తమ మొట్టమొదటి భారత కార్యాలయాన్ని స్థాపించడానికి కంపెనీ ముంబై నగరాన్ని ఎంచుకుంది.

టెస్లా ఇప్పటికే భారతదేశంలోని బెంగుళూరు నగరంలో తమ సంస్థ పేరును కూడా రిజిస్టర్ చేసుకుంది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ తమ భారతీయ విభాగాన్ని రిజిస్టర్ చేసుకుంది.

అయితే, టెస్లా సంస్థ బెంగుళూరులో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందా లేక బెంగుళూరులో హెడ్క్వార్టర్స్ను ఏర్పాటు చేసి ముంబైలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

టెస్లా బ్రాండ్ భారతదేశానికి రావడాన్ని ఆ సంస్థ అధినేత ఎలోన్ మస్క్ ధృవీకరించిన తరువాత, కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యాడ్యూరప్ప అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ మరియు క్లీన్ ఎనర్జీ కంపెనీ టెస్లా తమ తొలి ఉత్పత్తి కేంద్రాన్ని కర్ణాటకలోనే ఏర్పాటు చేస్తామని గత ఫిబ్రవరిలో ప్రకటించారు.

టెస్లా ఇప్పుడు తమ భారత కార్యకలాపాల కోసం సిబ్బందిని నియమించుకునే పనిలో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థ దేశంలోని కొన్ని అధికారులను కూడా నియమించింది. ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి మనుజ్ ఖురానాను ఇండియా కార్యకలాపాల కోసం పాలసీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్గా కంపెనీ నియమించుకుంది.

టెస్లా ఇండియాకు సూపర్ ఛార్జింగ్, డెస్టినేషన్ ఛార్జింగ్ మరియు హోమ్ ఛార్జింగ్ వ్యాపారానికి అధిపతిగా వ్యవహరించే నిశాంత్ను ఛార్జింగ్ మేనేజర్గా కంపెనీ నియమించింది. అతను అంతకుముందు స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎనర్జీ స్టోరేజ్ హెడ్గా పనిచేశారు.

ఇదివరకు వాల్మార్ట్ మరియు రిలయన్స్ రిటైల్లో పనిచేసిన చిత్రా థామస్ను టెస్లా ఇండియా కంట్రీ హెచ్ఆర్ లీడర్గా అపాయింట్ చేసుకుంది. లోకల్ టీమ్ను ఏర్పాటు చేసుకోవటంలో టెస్లా ఇండియా పూర్తి వేగంతో ముందుకు సాగుతోందని, ఈ పురోగతి పట్ల తాము సంతోషంగా ఉన్నామని టెస్లా క్లబ్ ఇండియా ఓ ట్వీట్లో తెలిపింది.

టెస్లా ఇండియా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై మరియు ఐటి రాజధాని బెంగుళూరు నగరాల్లో ముందుగా తమ కార్ షోరూమ్లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మూడు నగరాల్లో సుమారు 20,000-30,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని అన్వేషించేందుకు ఎగ్జిక్యూటివ్లను కూడా టెస్లా నియమించింది.

ఈ నగరాల్లో కొత్త షోరూమ్లతో పాటుగా సర్వీస్ సెంటర్లు కూడా ప్రారంభించబడుతాయి. టెస్లా తమ మొదటి మోడల్ను 2021 మధ్య నాటికి భారత్కు తీసుకురావాలాని భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో టెస్లా విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కార్ 'మోడల్ 3' సెడాన్ను కంపెనీ భారత్లోకి దిగుమతి చేసుకొని విక్రయించనుంది.


Click it and Unblock the Notifications








