భారతదేశంలో టాప్ 5 కార్ ఎక్స్పోర్టర్స్.. ఈ బ్రాండ్ కార్లకు విదేశాల్లో భలే డిమాండ్..
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా విధించిన ఆంక్షల నేపథ్యంలో, గతేడాది భారతదేశం నుండి కార్ల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈ ఏడాది ఆంక్షలను క్రమంగా సడలించడంతో విదేశీ డిమాండ్ను తీర్చేందుకు భారత ఆటోమొబైల్ కంపెనీలు ఎక్కువ కార్లను ఎగుమతి చేశాయి.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మరియు జూలై 2021 మధ్య కాలంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 131 శాతం వృద్ధి చెందాయి. ఆర్థిక సంవత్సరం 2021-22 మొదటి నాలుగు నెలల్లోనే మొత్తం 1,79,434 యూనిట్ల కార్లు భారతదేశం నుండి వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయబడ్డాయి.

కాగా గతేడాది ఇదే సమయంలో (ఆర్థిక సంవత్సరం 2020-21 ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలంలో) భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన కార్ల సంఖ్య 77,802 యూనిట్లుగా ఉంది. ఇది భారతదేశంలో తయారయ్యే ప్యాసింజర్ కార్ల డిమాండ్కు మంచి సంకేతం మాత్రమే కాకుండా, గ్లోబల్ మార్కెట్ల ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది.

ఇంతకు ముందు, Hyundai Motor India భారతదేశంలో అతిపెద్ద వాహన ఎగుమతిదారుగా ఉండేది. అయితే, ఇప్పుడు గణాంకాలు తారుమారు అయ్యాయి. భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ Maruti Suzuki ఎగుమతుల పరంగా ఈ ఏడాది ఏప్రిల్ మరియు జూలై మధ్య కాలంలో Hyundai ను అధిగమించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఆర్థిక సంవత్సరం (2021-2022) ఏప్రిల్ మరియు జూలై మధ్య కాలంలో భారతదేశం నుండి అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసిన టాప్ 5 కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి:

Maruti Suzuki : 66,059 యూనిట్లు
అమ్మకాలు మరియు ఉత్పత్తి పరంగా భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న Maruti Suzuki India Limited ఈ ఆర్థిక సంవత్సరం (2021-2022) ఏప్రిల్ మరియు జూలై మధ్య కాలంలో ఇప్పటి వరకు 66,059 యూనిట్ల కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు సంవత్సరానికి 311 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఈ సంఖ్యతో Maruti Suzuki అమ్మకాల పరంగా కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా ఎగుమతుల పరంగా కూడా అగ్రస్థానంలో నిలిచింది. కాగా, 2021-2020 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ ఎగుమతి చేసిన కార్ల సంఖ్య 23,971 యూనిట్లుగా ఉంది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (2021-22)లో Maruti Suzuki తమ ప్రీమియం హ్యాచ్బ్యాక్ Baleno ను గరిష్టంగా 16,175 యూనిట్లు ఎగుమతి చేసింది. అలాగే, ఈ సమయంలో కంపెనీ S-Presso హ్యాచ్బ్యాక్ 9,986 యూనిట్లు, Dzire కాంపాక్ట్ సెడాన్ 9,914 యూనిట్లు, Swift హ్యాచ్బ్యాక్ 7,402 యూనిట్లు మరియు Vitara Brezza కాంపాక్ట్ ఎస్యూవీ 6,839 యూనిట్లను ఎగుమతి చేసింది.

Hyundai Motor India : 42,088 యూనిట్లు
కొరియన్ కార్ బ్రాండ్ మరియు దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన Hyundai Motor India Limited గడచిన ఆర్థిక సంవత్సరం (FY 2020-21) లో కార్ల ఎగుమతుల పరంగా మొదటి స్థానంలో ఉంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY 2021-22) లో Hyundai మొదటి స్థానం నుండి రెండవ స్థానానికి పడిపోయింది.

ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే మిడ్-సైజ్ ఎస్యూవీ Hyundai Creta కంపెనీ ఎగుమతులకు అతిపెద్ద సహకారిగా ఉంది మరియు ఈ సమయంలో కంపెనీ 10,833 యూనిట్ల Creta ఎస్యూవీలను ఎగుమతి చేసింది. ఈ పాపులర్ ఎస్యూవీ ఎగుమతుల పరంగానే కాకుండా భారత మార్కెట్లో కూడా అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్యూవీగా నిలిచింది.

Volkswagen India : 16,455 యూనిట్లు
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Volkswagen India ఎగుమతుల విషయంలో మెరుగైన లాభాలను ఆర్జిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 31,089 యూనిట్లను భారతదేశం నుండి ఎగుమతి చేసి ఆరవ స్థానంలో ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 16,455 యూనిట్లను ఎగుమతి చేసి ఈ జాబితాలో మూడవ స్థానానికి చేరుకోగలిగింది.

Kia India : 15,641 యూనిట్లు
Kia India భారత మార్కెట్లోకి లేట్ గా ప్రవేశించినప్పటికీ, అమ్మకాల పరంగా లేటెస్ట్ గా దూసుకుపోతోంది. మనదేశంలో ఈ కంపెనీ ఇటీవలే 24 నెలల్లో 3,00,000 యూనిట్ల కార్ల విక్రయాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో Kia India ఇప్పటివరకు 15,641 యూనిట్ల కార్లను ఎగుమతి చేసి ఈ జాబితాలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది.

Ford India : 12,010 యూనిట్లు
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Ford India గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల పరంగా మూడవ స్థానంలో ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదవ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ జూలై కాలంలో కంపెనీ మొత్తం 12,010 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది.
ఈ సమయంలో కంపెనీ మొత్తం ఎగుమతులలో, దాని కాంపాక్ట్ ఎస్యూవీ Ford EcoSport ని అత్యధికంగా 10,367 యూనిట్లు ఎగుమతి చేసింది.


Click it and Unblock the Notifications








