మే 2021లో విడుదల కానున్న కొత్త కార్లు: అల్కజార్, సెల్టోస్, సోనెట్, గుర్ఖా, టైగన్
దేశంలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 2021లో జరగాల్సిన పలు కొత్త కార్ల విడుదలలు వచ్చే నెలకు వాయిదా పడిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, వీలైనంత వరకూ మే నెలలోనే తమ కొత్త కార్లను విడుదల చేస్తామని కొన్ని కార్ కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. మరి మే 2021లో భారతదేశంలో విడుదల కానున్న ఆ కొత్త కార్ల వివరాలేంటో తెలుసుకుందాం రండి:

1. హ్యుందాయ్ అల్కాజార్
హ్యుందాయ్ క్రెటా ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న 7-సీటర్ హ్యుందాయ్ అల్కాజార్ను కంపెనీ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇదివరకటి ప్లాన్ ప్రకారం, ఈ ఎస్యూవీ ఏప్రిల్ నెలాఖరులో విడుదల కావలసి ఉంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పుడు ఇది మే నెలాఖరుకు వాయిదా పడింది.

మే 2021లో హ్యుందాయ్ అల్కజార్ యొక్క లాంచ్ డేట్ను కంపెనీ ఇంకా ఖచ్చితంగా వెల్లడించలేదు. వచ్చే నెలలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. హ్యుందాయ్ అల్కాజార్ పెట్రోల్ (2.0 లీటర్) మరియు డీజిల్ (1.5 లీటర్) ఇంజన్ ఆప్షన్లతో రానుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్పి శక్తిని మరియు డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

2. 2021 కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్
కియా మోటార్స్ తమ సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ కూడా మే నెలలో విడుదల కానుంది. మార్కెట్ సమాచారం ప్రకారం, కొత్త సెల్టోస్ను 6 లేదా 7 సీట్ల వేరియంట్లలో తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇది హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారి మరియు ఎంజి హెక్టర్ ప్లస్ వంటి 7-సీటర్ మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది.

3. 2021 కియా సోనెట్
కియా మోటార్స్ ఇటీవల తమ కొత్త బ్రాండ్ లోగోను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ కొత్త లోగోతో కూడిన 2021 మోడల్ కియా సెల్టోస్ కాంపాక్ట్ ఎస్యూవీని కంపెనీ త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. కొత్త 2021 కియా సోనెట్పై కొత్త లోగో పాటుగా దాని వేరియంట్ లైనప్లో కూడా స్వల్ప మార్పులు చేయవచ్చని సమాచారం.

4. 2021 ఫోర్స్ గూర్ఖా
ఫోర్స్ మోటార్స్ నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న వాహనాలలో సరికొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీ కూడా ఒకటి. అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగిన ఫోర్స్ గుర్ఖా లేటెస్ట్ వెర్షన్ను కంపెనీ తొలిసారిగా 2020 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. పలు కారణాల వలన భారత్లో ఈ కార్ లాంచ్ చాలా ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం, ఇది మే 2021లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

కొత్త ఫోర్స్ గూర్ఖాను పూర్తిగా సరికొత్త ప్లాట్ఫామ్పై అధునాతన డిజైన్తో రూపొందించారు. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు మరియు ఐస్ క్యూబ్ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. దీనితో పాటు టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పవర్ విండోస్, ఏబిఎస్, ఎయిర్బ్యాగ్స్ వంటి కొన్ని కొత్త ఫీచర్లను ఈ కారులో జోడించారు.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఫోర్స్ గుర్ఖాలో శక్తివంతమైన 2.6-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్పి పవర్ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ ఆప్షన్ కూడా లభ్యం కానుంది.

5. ఫోక్స్వ్యాగన్ టైగన్
జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్వ్యాగన్ ఇటీవలే భారతదేశంలో తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్యూవీని టైగన్ను ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్కు సంబంధించిన టీజర్లను కూడా విడుదల చేసింది. వాస్తవానికి ఫోక్స్వ్యాగన్ టైగన్ ఈ నెలలోనే మార్కెట్లోకి రావల్సి ఉంది. కానీ, కోవిడ్-19 కారణంగా ఇది మరింత ఆలస్యమైంది.

ఫోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి ఎస్-క్రాస్ మరియు త్వరలో విడుదల కానున్న స్కొడా కుషాక్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. కంపెనీ ఈ ఎస్యూవీని భారత్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఎమ్క్యూబి ఏ0 ఇన్ ప్లాట్ఫామ్పై నిర్మిస్తోంది.

స్కొడా తమ కుషాక్ ఎస్యూవీని కూడా ఇదే ప్లాట్ఫామ్పై తయారు చేయనుంది. ఈ నేపథ్యంలో, కుషాక్ మరియు టైగన్ ఎస్యూవీలలో దాదాపు ఒకేరకమైన లక్షణాలు ఉండొచ్చని అంచనా. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో రానున్నాయి.

6. 2021 స్కోడా ఆక్టేవియా
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో నుండి ఈ నెలలో విడుదల కావలసిన కొత్త 2021 మోడల్ స్కొడా ఆక్టేవియా లాంచ్ కూడా మే నెలకు వాయిదా పడింది. స్కొడా ఇండియా తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరించింది. కోవిడ్-19 కారణంగా ఈ కార్ లాంచ్ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియాను కంపెనీ ఇప్పటికే తమ అధికారిక డీలర్షిప్ కేంద్రాలకు పంపిణీ చేసింది. మునుపటి తరం మోడల్తో పోల్చుకుంటే ఈ కొత్త తరం స్కొడా ఆక్టేవియా కాస్తంత పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. ఇందులో 190 బిహెచ్పి శక్తిని జనరేట్ చేసే 2.0-లీటర్ టిఎస్ఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








