సైరస్ మిస్త్రీ ట్రాజెడీ: దేశంలో సీట్బెల్ట్ క్లిప్లు మరియు అలారం స్టాపర్లపై నిషేధం!
సైరస్ మిస్త్రీ మరణం ఇప్పుడు భారతదేశంలో పెద్ద చర్చనీయాసంగా మారింది. హై-ఎండ్ లగ్జరీ కారు యాక్సిడెంట్కు గురికావడంతో ఖరీదైన కార్ల సేఫ్టీ విషయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వెనుక సీటులో కూర్చుని, సీట్ బెల్టులు ధరించని కారణంగా మిస్త్రీ చనిపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు సీట్ బెల్టు నిబంధనలు కూడా మరింత కఠినతరం కానున్నాయి.
Recommended Video
ఆటోమొటివ్ తయారీదారులు కారులోని ప్రతి ప్రయాణీకుడి కోసం తప్పనిసరిగా త్రీ-పాయింట్ సీట్ బెల్టులను అందిస్తారు. ఇవి ధరించడం వలన ప్రమాద సమయాల్లో ప్రయాణీకులు కారు లోనుంచి ఎగిరి బయటకు లేదా ముందుకు పడిపోకుండా పట్టి ఉంచడంలో సహాయపడుతాయి మరియు అత్యవసర సమయాల్లో ఎయిర్బ్యాగ్లు ఓపెన్ అయ్యేలా చేయడంలో సహకరిస్తాయి. కారు ఎంత ఖరీదైనది అయినా, అందులో ఎన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నా ప్రయాణీకులు సీట్ బెల్టులు ధరించకపోతే భారీ మూల్యం చెల్సించాల్సి వస్తుంది. ఇందుకు సైరస్ మిస్త్రీ ఘటనే నిలువెత్తు ఉదాహరణ.

కారులో ప్రయాణిస్తూ సీట్ బెల్టులు ధరించని కారణంగా మరణించిన ఒక్క సైరస్ మిస్త్రీనే కాదు. చాలా మంది ప్రముఖులు మరియు సాధారణ ప్రజలు కూడా ఈ చిన్న నిర్లక్ష్యం కారణంగా తమ ప్రాణాలను కోల్పోయారు. టూవీలర్పై ప్రయాణిస్తున్న హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో, కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్టులు ధరించడం కూడా అంతే ముఖ్యం. వాస్తవానికి, కారులో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాలి, అలా చేయకపోతే చట్ట విరుద్ధం అవుతుంది. అనేక దేశాలలో ఈ నిబంధన చాలా కఠినంగా అమలు చేయబడుతుంది. అయితే, మనదేశంలో మాత్రం దీనిని చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ మరియు ప్రస్తుత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ అయిన సైరస్ మిస్త్రీ వంటి హై-ప్రొఫైల్ వ్యక్తి మరణంతో ఇప్పుడు దేశంలో మరోసారి చలనం మొదలైంది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో సీట్ బెల్ట్ ఆవశ్యకత గురించి పోస్టులు చేస్తున్నారు. అలాగే తమ ప్రొఫైల్ పిక్స్ మరియు డిపిలలో సీట్ బెల్టుల ప్రాధాన్యత గురించి ప్రచారం చేస్తున్నారు. కాగా, ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. సీట్ బెల్ట్ అలారంలను ఆపివేసే సాధానాలు, యాక్ససరీలను నిషేధించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న అన్ని ఆధునిక కార్లలో సీట్ బెల్ట్ రిమైండర్లు ఉంటున్నాయి. అంటే, కారు ఆన్ అయిన తర్వాత డ్రైవర్ గేర్ వేసి ముందుకు నడపగానే సీట్ బెల్ట్ అలారం మ్రోగడం మొదలువుతుంది. కారులో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఇద్దరూ ప్రయాణిస్తున్నట్లయితే, వారు తప్పనిసరిగా సీట్ బెల్టులను ధరిస్తేనే ఈ అలారం ఆఫ్ అవుతుంది. అయితే, చాలా మందికి సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, ఇది వారికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే, ఈ అలారం మ్రోగకుండా చేయడానికి వారు ఫేక్ సీట్ బెల్ట్ క్లిప్ లను ఉపయోగిస్తుంటారు.

అంటే, ఈ సీట్ బెల్ట్ క్లిప్ లను నేరుగా బకిల్లో ఇన్సెర్ట్ చేయడం ద్వారా సీట్ బెల్ట్ అలారం మ్రోగకుండా చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా తాము కారులో అనవరమైన అలారం శబ్ధం వినకుండా, సీట్ బెల్టు ధరించినప్పుడు వచ్చే చిరాకు లేకుండా ప్రయాణించవచ్చనేది కొందరి అభిప్రాయం. కానీ, అత్యవసర సమయాల్లో ఇది చాలా ప్రమాదకరమని వారు గుర్తించాలి. కారులోకి ప్రవేశించిన వెంటనే ముందు సీట్ బెల్ట్ ధరించిన తర్వాత మాత్రమే ఇంజన్ను ఆన్ చేయాలి. సీట్ బెల్ట్ ధరించని కారణంగా కొన్ని సందర్భాల్లో చిన్నపాటి ప్రమాదాలకు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

ఈ నేపథ్యంలో, భారతదేశంలో సీట్ బెల్ట్ క్లిప్లు మరియు అలారం స్టాపర్ల తయారీ మరియు అమ్మకాలను నిషేధించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. సెప్టెంబర్ 4, 2022న జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దిగ్భ్రాంతికరమైన మరణం తర్వాత ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవలి కాలంలో, భారత మార్కెట్లో కార్ల భద్రత మరియు సేఫ్టీ రేటింగ్లపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది.

భారతదేశంలో కార్లు అనేక దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ, భద్రతా విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉదాహరణకు, ఎయిర్బ్యాగ్లు మొట్టమొదట 1952లో ఆటోమోటివ్ ఉపయోగం కోసం పేటెంట్ పొందాయి, అయితే, భారత ప్రభుత్వం 2019లో మాత్రమే కార్లకు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించింది. అంతకు ముందు వరకూ ఇవి ఖరీదైన కార్లలో మరియు అధిక ధర వద్ద ఆప్షనల్గా మాత్రమే లభించే యాడ్-ఆన్ సేఫ్టీ ఫీచర్. సీటు బెల్టుల విషయంలోనూ ఇదే కథ. స్వీడన్ కార్ బ్రాండ్ వోల్వో 1959లో ప్రామాణిక సేఫ్టీ ఫీచర్గా త్రీ-పాయింట్ సీట్బెల్ట్లను పరిచయం చేసింది. వాస్తవానికి, కార్లలో సీట్ బెల్టులను అందించిన మొదటి ఆటోమొబైల్ కంపెనీ కూడా ఇదే.

ప్రస్తుతం, భారతదేశంలో విక్రయించబడే అన్ని కార్లలో రెండు ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్), సీట్బెల్ట్ రిమైండర్, ఏబిఎస్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలి. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో, ఇప్పటికీ సీట్బెల్ట్లను ధరించడం తప్పనిసరి కాదు, కాబట్టి చాలామంది సీట్బెల్ట్లను ధరించరు. అనేక మెట్రోపాలిటన్ నగరాలు ముందు కూర్చున్న వారు సీటు బెల్ట్లను తప్పనిసరిగా ఉపయోగించాలి, కానీ వెనుక కూర్చున్న వారికి అలాంటి నియమం లేదు. కానీ, సైరస్ మిస్త్రీ మరణంతో ఈ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. కారులో కూర్చున్న ప్రతి ఒక్కరూ సీట్ బెల్టు ధరించేలా చర్యలు తీసుకుంటే, రోడ్డు ప్రమాదాలో మరణాల సంఖ్యను చాలా వరకూ తగ్గించవచ్చు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో, భారతదేశంలో సీట్బెల్ట్ క్లిప్లను తయారు చేయకుండా మరియు వాటిని విక్రయించకుండా నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీటు బెల్ట్ స్టాపర్ క్లిప్ల తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశానని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కాబట్టి, మిత్రులారా ఇకనైనా మేల్కోండి.. కారులో ప్రయాణిస్తున్న ఏ సీటులో కూర్చున్నా సరే తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించండి. సురక్షితంగా మీ గమ్యాలను చేరుకోండి.


Click it and Unblock the Notifications








