ఈసారి క్యాన్సిల్ చేసేది లేదు.. ఆటో ఎక్స్పో 2023 డేట్స్ వెల్లడి: ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందంటే..?
భారతదేశంలో ఆటో ఎక్స్పో (Auto Expo) మంచి ప్రాచుర్యం సంపాధించుకుంది. దేశవిదేశాలకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఇదొక గొప్ప వేదికగా నిలిచింది. అంతర్జాతీయ ఆటోమొబైల్ షోలకు ధీటకుగా మనదేశంలో భారతదేశంలో ఆటో ఎక్స్పో ను నిర్వహిస్తున్నారు. ఆటో ఎక్స్పోను దేశంలోని ప్రీమియర్ ఆటోమొబైల్ షోగా పిలుస్తారు. మనదేశంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆటో ఎక్స్పో ను నిర్వహిస్తారు.

భారతదేశంలో ఆటో ఎక్స్పో చివరిసారిగా 2020 సంవత్సరంలో నిర్వహించబడింది. దేశంలోకి కోవిడ్-19 మహమ్మారి ప్రవేశించకమునుపే ఈ కార్యక్రమం జరిగింది. కాగా, ఆ తర్వాతి ఎడిషన్ ఆటో ఎక్స్పో 2022 ఈ ఏడాది ఆరంభంలో జరగాల్సి ఉంది. కానీ, కోవిడ్-19 యొక్క తదుపరి వేరియంట్లు మరియు మూడవ దశ వంటి హెచ్చరికల నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో, 2022లో జరగాల్సిన వేడుకను 2023 లో నిర్వహించాలని ఆటో ఎక్స్పో నిర్వాహకులు నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం, ఆటో ఎక్స్పో తదుపరి ఎడిషన్ 2023 సంవత్సరంలో జనవరి 13 నుండి 18 తేదీలలో జరుగుతుంది. ఆటో ఎక్స్పో యొక్క ఈ ఎడిషన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరగాల్సి ఉంది కానీ కోవిడ్-19 పరిస్థితి కారణంగా ఇది రద్దయింది.

ఈ విషయంపై సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) డైరెక్టర్ జనరల్, రాజేష్ మీనన్ మాట్లాడుతూ, "ఇండియా ఎక్స్పో మార్ట్ 2023 ఎడిషన్ ను గ్రేటర్ నోయిడాలో జనవరి 13-18, 2023 తేదీలలో నిర్వహించాలని నిర్ధారించబడిందని, ఇది జనవరి 11 వ తేదీన మీడియా కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ చేయబడిందని మరియు ఆ తర్వాత జనవరి 12న మీడియా, ప్రముఖులు, డీలర్ల ప్రారంభోత్సవం ఉంటుందని" ఆయన తెలిపారు.

గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో జరగనుండగా, మరోవైపు కొత్త ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ లో ఆటో కాంపోనెంట్ షోను నిర్వహించనున్నారు. గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన ఒక ప్రకటనలో, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే ఆటో ఎక్స్పో వంటి బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) షోలలో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని రాజేష్ మీనన్ చెప్పారు. అందుకే 2022 ఎడిషన్ ఆటో ఎక్స్పో మోటర్ షోను ఆ సమయంలో వాయిదా వేయాల్సి వచ్చిందని అన్నారు.

ఆటో ఎక్స్పోలో పాల్గొనే మరియు హాజరయ్యే ఎగ్జిబిటర్లు, సందర్శకులు మరియు వాటాదారులందరి భద్రత చాలా ముఖ్యమైనదని, ఈ నేపథ్యంలోనే కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందన్న భయాల కారణంగా ఆటో ఎక్స్పో నిర్వహణలో అంతర్గతంగా ఉన్న నష్టాలను భారత ఆటోమొబైల్ పరిశ్రమ మరియు SIAM ముందుగానే గుర్తించాయని గత ఏడాది ఆయన చెప్పారు.

గత 2020లో జరిగిన ఆటో ఎక్స్పోలో దాదాపు ఆరు లక్షల మంది సందర్శకులు 108 ఎగ్జిబిటర్ల నుండి 352 ఉత్పత్తులను ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రీమియర్ ఆటో షోలో సుమారు 70 ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్ చేయబడ్డాయి. ప్రస్తుతం, దేశంలో గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, వచ్చే ఏడాది తప్పనిసరిగా 2023 ఆటో ఎక్స్పోను నిర్వహించి తీరాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఆటో ఎక్స్పో 2020 ముగిసిన వెంటనే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ముమ్మరం కావడంతో ఆ సమయంలో ప్రదర్శించిన వాహనాలు, కాన్సెప్ట్ లు మరియు టెక్నాలజీలు కార్యరూపం దాల్చడానికి చాలా సమయమే పట్టింది. మరోవైపు ఈ ఏడాది జరగాల్సిన ఆటో ఎక్స్పో 2022 కూడా వాయిదా పడటంతో, వచ్చే ఏడాది జరగబోయే ఆటో ఎక్స్పో 2023 పై పరిశ్రమ భారీ అంచనాలు పెట్టుకుంది. అలాగే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరగడంతో వచ్చే ఏడాది ఆటో ఎక్స్పో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మరియు టెక్నాలజీల ఆవిష్కరణను కూడా అశించవచ్చు.

ఈ ఏడాది మార్కెట్లోకి రానున్న డీజిల్ కార్లు..
ఇదిలా ఉంటే, భారత మార్కెట్లో డీజిల్ కార్ల హవా తగ్గుతున్న నేపథ్యంలో, ఈ విభాగంలోకి కొత్తగా మరో ఐదు మోడళ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గిందేకు ప్రభుత్వం కొత్త బిఎస్6 ఉద్గార నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత, కార్ల తయారీ సంస్థలు డీజిల్ కార్ల తయారీని తగ్గించి పెట్రోల్ కార్ల తయారీపై దృష్టి పెట్టాయి. ఇందుకు ప్రధాన కారణం, కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా డీజిల్ కార్లను తయారు చేయడం మరింత ఖరీదైన పనిగా మారింది.

కానీ, ఇప్పుడు మహీంద్రా, టొయోటా, హ్యుందాయ్ మరియు జీప్ వంటి బ్రాండ్లు ఈ ఏడాది కొత్త డీజిల్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా ఓ కొత్త తరం స్కార్పియో మోడల్ పై పనిచేస్తోంది. ఇది 2.2 లీటర్ ఎమ్హాక్ డీజిల్ ఇంజన్తో రానుంది. కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ కూడా కొత్త 2022 మోడల్ క్రెటా మరియు టూసాన్ ఎస్యూవీలను విడుదల చేయనుంది. ఇవి కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో రానున్నాయి. ఇకపోతే, జీప్ మెరిడియన్ 7-సీటర్ ఎస్యూవీ మరియు టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కులు కూడా డీజిల్ ఇంజన్లతో రానున్నాయి.


Click it and Unblock the Notifications








