ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పూర్తిగా ఫ్రీ..! ఫ్రీ..!! కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసిన ఎలక్ట్రివా (ElectriVa)
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని ఎలక్ట్రి వాహనాలను కొందామనుకుంటే, ఇప్పుడు పెరుగుతున్న విద్యుత్ చార్జీలు అందుకు సహకరించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తి ఉచితంగా చార్జింగ్ సదుపాయం లభిస్తే ఎలా ఉంటుంది? అలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎలక్ట్రివా (ElectriVa). దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపుకు ప్రోత్సహించేందుకు ఈవీ చార్జింగ్ స్టార్టప్ ఎలక్ట్రివా ఇప్పుడు ఉచిత ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో 40కి పైగా ఛార్జింగ్ స్టేషన్లలో ఉచిత ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలను పొందవచ్చని ఎలక్ట్రివా తెలిపింది. అయితే, ఉచిత చార్జింగ్ సదుపాయం పొందడానికి ఓ చిన్న షరతు కూడా ఉంది. ఎలక్ట్రివా ఈవీ చార్జింగ్ పాయింట్ల వద్ద రోజు మొత్తం చార్జింగ్ సదుపాయం ఉచితంగా ఉండదు. ఈ చార్జింగ్ పాయింట్ల వద్ద కేవలం మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య మాత్రమే ఎలక్ట్రివా ఉచిత చార్జింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. మిగిలిన సమయాల్లో ఈవీలను చార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం తప్పనిసరిగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఎలక్ట్రివా ప్రకారం, తమ చార్జింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు మాత్రమే ఉచిత చార్జింగ్ సౌకర్యం లభిస్తుంది. నిజానికి, ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి అంత అనువైన సమయం కానప్పటికీ, చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగడపడుతుంది. ప్రత్యేకించి వాణిజ్య వినియోగం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించి వారికి చాలా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎలక్ట్రివా తీసుకున్న చొరవ ద్వారా దేశంలో కాస్తంతైనా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ కంపెనీకి ఉచిత మార్కెటింగ్ పరిష్కారం కూడా లభించనుంది.

భూమిలో శిలాజ ఇంధనాలు (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) అంతరించిపోతున్న తరుణంలో, గడచిన కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈవీ విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల ప్రోత్సాహకాలను మరియు రాయితీలను అందిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ప్రభుత్వాలు మరియు తయారీదారులు తీసుకుంటున్న చొరవ కారణంగా, భారతదేశంలో చాలా మంది వాహనదారులను గ్రీన్ మొబిలిటీకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ కు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా, ఇప్పుడు అనేక ఈవీ ఛార్జింగ్ స్టార్టప్లు ఛార్జింగ్ సమస్యను పరిష్కరించేందుకు సరకొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందులు లేని చార్జింగ్ మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

సాధారణంగా, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వాహనదారులు దాదాపుగా తమ ఈవీలను ఇంటి వద్దనే చార్జ్ చేయడానికి ఇష్టపడుతారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇలాంటి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగిస్తుంటారు. మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత విస్తృతంగా పెరగాలంటే, ఇలాంటి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు చాలా అవసరం. అయితే, వినియోగదారులు వీటిని రోజులో నిర్దిష్ట సమయంలో మాత్రమే వినియోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే, చార్జింగ్ స్టేషన్లు నిరుపయోగంగా కూడా మారుతున్నాయి.

సాధారణంగా, చార్జింగ్ స్టేషన్లను మధ్యాహ్నం సమయంలో ఉపయోగించకుండా వదిలేస్తారు. అయితే, ఇది వ్యక్తుల యొక్క వినియోగ తీరుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అయితే, చాలా ఈవీలు మధ్యాహ్న సమయంలో ఇంటి వద్ద కానీ లేదా కార్యాలయంలో కానీ పార్క్ చేయబడి ఉంటాయి. కాబట్టి, ఆ సమయంలో చార్జింగ్ స్టేషన్ల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈవీ వినియోగదారులలో బ్రాండ్ అవగాహనను పెంచడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఎలక్ట్రివా సంస్థలోని మార్కెటింగ్ మేధావులు మధ్యాహ్నం ఉచిత ఈవీ ఛార్జింగ్ ఆలోచనతో ముందుకు వచ్చారు.

ఒకవేళ మీరు ఢిల్లీ నివసిస్తూ ఉన్నట్లయితే, మీరు ఇప్పుడు మీ ఈవీని ఎలక్ట్రివా యొక్క 40 కి పైగా ఛార్జింగ్ స్టేషన్లలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్యలో ఉచితంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ-ఎన్సిఆర్ అంతటా ఉన్నాయి. హౌజ్ ఖాస్, గ్రేటర్ కైలాష్, రోహిణి, సాకేత్, మయూర్ విహార్, లజ్పత్ నగర్, బికాజీ కామా ప్లేస్, నెల్సన్ మండేలా రోడ్, సౌత్ ఎక్స్టెన్షన్, సౌత్ క్యాంపస్ మొదలైనవి కొన్ని ప్రముఖ ప్రదేశాలలో ఎలక్ట్రివా చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.

ఈ చొరవ గురించి ElectriVa వ్యవస్థాపకుడు సుమిత్ ధనుక మాట్లాడుతూ, "తాము అన్ని వాణిజ్య మరియు వాణిజ్యేతర ఈవీ వినియోగదారులకు మధ్యాహ్నం 12 మరియు 3 గంటల మధ్య ఉచితంగా ఛార్జింగ్ను అందిస్తున్నామని, మధ్యాహ్నం సమయంలో ఉచిత ఛార్జింగ్ అందించడం ద్వారా, తాము ఈవీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటున్నామని చెప్పారు. దేశ రాజధానిలో ప్రజలను శిలాజ ఇంధనం నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా చేయడానికి పబ్లిక్ ఛార్జింగ్ను ప్రోత్సహించడం చాలా ముఖ్యం" అని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








