తెలంగాణాకు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీని తీసుకొచ్చిన కెటిఆర్, హైదరాబాద్లో Fisker Inc ఐటి సెంటర్!
తెలంగాణా ఐటి మంత్రి కెటిఆర్ (KTR) రాష్ట్రానికి మరొక అమెరికన్ ఎమ్ఎన్సి కంపెనీని తీసుకువచ్చారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఫిస్కర్ ఐఎన్సి (Fisker Inc) ఇప్పుడు భారతదేశంలో తమ తొలి ఐటీ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది. ప్రారంభ దశలో భాగంగా, ఈ కంపెనీలో 300 మంది ఐటీ నిపుణులకు ఉపాధి లభించనుంది.

తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయిన కెటి రామారావు అమెరికాలోని ఫిస్కర్ ఇన్కార్పోరేషన్ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెన్రిక్ ఫిస్కర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గీతా ఫిస్కర్ మరియు మేనేజ్మెంట్ బృందంతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఫిస్కర్ సంస్థ హైదరాబాద్లో తమ ఐటి, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో జరుపుతున్న సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి.

ఫిస్కర్ ఐఎన్సికి లాస్ ఏంజెల్స్లో ఓ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బ్రాండ్ భారతదేశంలో తమ ఐటి సెంటర్ ను ఏర్పాటు చేయడం చూస్తుంటే, మరో రెండు మూడేళ్లలో ఈ బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్లు ఇక్కడి రోడ్లపై పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారబోతుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుందని ఫిస్కర్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

భారతదేశంలో ఫిస్కర్ తమ ఐటి డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నందు గానూ కెటిఆర్ ఈ అమెరికన్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అనుసరిస్తున్న విధానాల (ఈవీ పాలసీ) గురించి కెటిఆర్ వివరించారు. దేశంలో స్థానిక ఈవీ పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మరియు సహకారం యొక్క ఇతర మార్గాలను అన్వేషించడానికి ఫిస్కర్ నుండి ఒక బృందం త్వరలోనే హైదరాబాద్ ను సందర్శించనుంది.

ఈ సందర్భంగా కెటిఆర్ తమ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీపై చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పలు కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయని, జెడ్ఎఫ్, హ్యుందాయ్ వంటి పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ టెక్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించిందని ఆయన అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు హైదరాబాద్ లో అద్భుతమైన అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మొబిలిటీ క్లస్టర్ ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నామని, ఇందులో తాము కూడా భాగస్వాములు కావాలని ఫిస్కర్ కంపెనీని కెటిఆర్ కోరారు.

ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ గురించి కెటిఆర్ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిస్కర్ సంస్థ ప్రతినిధులు కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మొబిలిటీ క్లస్టర్ లో భాగస్వాములయ్యేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు ఫిస్కర్ తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమరంత్ రెడ్డి ఆత్మకూరి, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కరంపురి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫిస్కర్ సంస్థ సిఈఓ హెన్రీక్ ఫిష్కర్ మాట్లాడుతూ.. తమ ఐటి,డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రపంచంలోని అనేక దేశాలను మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలను కూడా తాము పరిశీలించామని, అయితే తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత మరియు ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలు తమను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే హైదరాబాదులో ఐటి సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
రాష్ట్రంలో ఈ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో ఇటు ఆటోమొబైల్ మరియు సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన దాదాపు 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. భవిష్యత్తులో ఈ ఉద్యోగాల సంఖ్యను మరింతగా విస్తరించి, మరికొంత ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తమ రీసెర్చ్, ఇంజనీరింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం కెటిఆర్కు అందజేశారు.

ఫిష్కర్ కంపెనీ ఇప్పుడు ఓషన్ (Fisker Ocean) అనే ఓ ఎలక్ట్రిక్ ఎస్యూవీని తయారు చేస్తోంది. ఇది ఈ విభాగంలో టెస్లా కార్లకు పోటీగా నిలుస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మోడల్ అమ్మకాలు, డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఫిస్కర్ ఓషన్ మూడు ట్రిమ్ లలో అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిది ఓషన్ స్పోర్ట్. మార్కెట్లో దీని ధరలు 37,499 డాలర్ల (సుమారు రూ.28.59 లక్షల) నుండి ప్రారంభం కానున్నాయి. ఇది బేస్ వేరియంట్ మరియు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 440 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

ఫిస్కర్ ఓషన్ స్పోర్ట్ 275HP (205kW) శక్తిని జనరేట్ చేసే సింగిల్ మోటార్ (ఫ్రంట్ వీల్ డ్రైవ్) డ్రైవ్ట్రైన్ ఉంటుంది మరియు ఇది కేవలం 6.9 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 వేగాన్ని చేరుకుంటుంది. ఇక రెండవ ట్రిమ్ విషయానికి వస్తే, ఓషన్ అల్ట్రా. మార్కెట్లో దీని ధరలు 49,999 డాలర్లు (సుమారు రూ.38.11 లక్షలు)గా ఉంటుంది. ఇందులో 540HP (400kW) పవర్ ను ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ (ఆల్ వీల్ డ్రైవ్) డ్రైవ్ట్రైన్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 610 కిమీ రేంజ్ ను అందిస్తుంది. ఈ కారు కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.
ఇక మూడవ ట్రిమ్ అయిన ఓషన్ ఎక్స్ట్రీమ్ విషయానికి వస్తే, దీని ధర 68,999 డాలర్లుగా ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 630km కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారులో 550HP (410kW) శక్తిని జనరేట్ చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కూడిన (ఆల్ వీల్ డ్రైవ్) డ్రైవ్ట్రైన్ ఉంటుంది. ఈ కారు కేవలం 3.6 సెకండ్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓషన్ స్పోర్ట్ ట్రిమ్లో కంపెనీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను ఉపయోగిస్తుండగా, ఇతర ట్రిమ్లలో నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC) బ్యాటరీలను ఉపయోగిస్తుంది.


Click it and Unblock the Notifications








