భారతదేశంలో నెంబర్ వన్ ఎస్యూవీ బ్రాండ్గా Hyundai.. అంతా క్రెటా, వెన్యూ మాయ..!!
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ బ్రాండ్ మరియు భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), గత నెలలో మరోసారి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీ బ్రాండ్గా నిలిచింది. గడచిన సంవత్సరంలో ఈ కంపెనీ మొత్తం 2.52 లక్షలకు పైగా ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) లను విక్రయించింది. హ్యుందాయ్ అందిస్తున్న కొత్త తరం క్రెటా (Hyundai Creta) ఈ బ్రాండ్ లైనప్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది.

గతేడాది హ్యుందాయ్ భారతదేశంలో 1.25 లక్షల యూనిట్లకు పైగా క్రెటా ఎస్యూవీలను విక్రయించింది. హ్యుందాయ్ మరొక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) కూడా 2021 లో 1.08 లక్షల యూనిట్ల అమ్మకాలను సాంధించింది. దీంతో ఇది హ్యుందాయ్ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎస్యూవీ మోడల్ గా మారింది. ఇక హ్యుందాయ్ తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన 7-సీటర్ ఎస్యూవీ హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar) కూడా అమ్మకాల్లో ముందంజలో ఉంది.

గత 2021లో మొత్తం 17,700 యూనిట్లకు పైగా హ్యుందాయ్ అల్కజార్ అమ్మకాలు నమోదయ్యాయి. కాబట్టి, మొత్తమ్మీద భారతదేశంలో కేవలం ఎస్యూవీ అమ్మకాల పరంగా చూసుకుంటే, హ్యుందాయ్ మొదటి స్థానంలో ఉంది. కానీ, ఎస్యూవీలు మరియు ఎమ్పివిల మొత్తం అమ్మకాలను కలిపి పరిశీలిస్తే, మారుతి సుజుకి ఇండియా ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. మారుతి సుజుకి జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 మధ్య కాలంలో మొత్తం 2,90,661 యూనిట్ల యుటిలిటీ వాహనాలను (ఎస్యూవీలు మరియు ఎమ్పివిలు కలిపి) విక్రయించింది. వీటిలో విటారా బ్రెజ్జా మరియు ఎస్-క్రాస్లతో పాటు ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 అమ్మకాలు ఉన్నాయి.

అయితే, కేవలం ఎస్యూవీ అమ్మకాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, ఈ జాబితాలో మారుతి సుజుకి రెండవ స్థానంలో ఉంటుంది. కానీ మొత్తం యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ (UV)ని పరిశీలిస్తే మాత్రం, మారుతి సుజుకి బ్రాండ్ బెస్ట్ సెల్లర్గా మిగిలిపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎస్యూవీలు మరియు కాంపాక్ట్ ఎస్యూవీ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా మహమ్మారి తదనంతర పరిస్థితుల్లో భారతదేశం వంటి ధరల సెన్సిటివ్ మార్కెట్లో ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ ఆశ్చర్యకరంగా ఉంది.

అంతేకాకుండా, గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్ కొరత ఉన్నప్పటికీ, సప్లయ్ చైన్ ను నిర్వహించడానికి పరిశ్రమ చూపిన సామర్థ్యం సానుకూల సంకేతాలను ఇస్తుంది. అలాగే, మనదేశంలో యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ చాలా సంవత్సరాలుగా ఎక్కువ డిమాండ్ మరియు పోటీతో కూడుకున్న సెగ్మెంట్గా ఉంది. ఈ విభాగంలో లేటెస్ట్ గా వచ్చిన ఆల్ట్రా మోడ్రన్ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్యూవీ 700, పవర్ ప్యాక్డ్ పంచ్తో వచ్చిన టాటా పంచ్, ప్రీమియం ఫోక్స్వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ కార్లతో ఈ పోటీ మరింత తీవ్రతరమైంది.

ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా డిసెంబర్ 2021 విక్రయాలను పరిశీలిస్తే, 2021 చివరి నెలలో, దాని మొత్తం అమ్మకాలు (దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కలిపి) 48,933 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 2020లో హ్యుందాయ్ విక్రయించిన మొత్తం 66,750 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు దాదాపు 26.7 శాతం క్షీణించాయి. గత కొన్ని నెలలుగా హ్యుందాయ్ సిఎన్జి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటకు రూ.100 కి పైగా చేరుకుంది. దీంతో కస్టమర్లు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనమైన సిఎన్జితో నడిచే కార్ల కోసం చూస్తున్నారు. పెట్రోల్ తో పోల్చుకుంటే, సిఎన్జి ధర తక్కువగా ఉండటమే కాకుండా, అధిక మైలేజీని కూడా ఇస్తుంది. అయితే, సిఎన్జి ఇంధనంతో నడిచే కార్ల శక్తి సామర్థ్యాలు, పెట్రోల్ ఇంధనంతో నడిచే కార్ల శక్తి సామర్థ్యాల కన్నా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం, మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ వంటి కార్ కంపెనీలు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి కిట్లతో కార్లను విక్రయిస్తున్నాయి.

గతేడాది ఏప్రిల్ మరియు సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో CNG కార్ల అమ్మకాలు సంవత్సరానికి 96 శాతం బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం, ఈ విభాగంలో మారుతి సుజుకి అత్యధిక మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. విక్రయాల పరంగా భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ తమ ప్రోడక్ట్ లైనప్లో శాంత్రో, గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఆరా అనే మూడు మోడళ్లలో సిఎన్జి ఫ్యూయెల్ ఆప్షన్ ను అందిస్తోంది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా, ఈ మూడు మోడళ్ల విక్రయాల్లో కూడా పెరుగుదల కనింపిచింది.

హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్ విషయానికి వస్తే, ఇందులో 70 మోడళ్లు CNG రూపంలో విక్రయించబడుతున్నాయి. అలాగే, 25-30 శాతం గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లు ఇప్పుడు CNG రూపంలో విక్రయించబడుతున్నాయి. ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో మైలేజీ చాలా కీలకమైన అంశం కంపెనీ చెబుతోంది. ఇంధన ధరలో హెచ్చుతగ్గులు ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. హ్యుందాయ్ కంపెనీ ప్రకారం, ప్రజలు రోజువారీ ప్రయాణానికి ఎక్కువగా సిఎన్జి కార్లను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు.


Click it and Unblock the Notifications