మారుతి సుజుకి జిప్సీ (Maruti Suzuki Gypsy)కి ఇండియన్ ఆర్మీ కూడా గుడ్బై చెప్పనుందా..?
భారతదేశపు తొలి యుటిలిటీ వాహనాలలో మారుతి సుజుకి జిప్సీ (Maruti Suzuki Gypsy) కూడా ఒకటి. దేశంలో ఎస్యూవీ ట్రెండ్ ప్రారంభానికి దారితీసిన జిప్సీ ఎస్యూవీని మారుతి సుజుకి తొలిసారిగా 1984 లో ప్రవేశపెట్టింది. భారతదేశంలోని ఆఫ్-రోడ్ ఔత్సాహికుల దృష్టిని త్వరగా ఆకర్షించడంలో మారుతి జిప్సీ విజయవంతం అయింది. అత్యుత్తమ ఆఫ్-రోడ్ పనితీరు, సాటిలేని పెట్రోల్ ఇంజన్ మరియు అత్యంత సాధారణ హార్డ్వేర్ పరికరాలతో ఇది దేశీయ వినియోగదారులను మరియు దేశ ఆర్మీని కూడా అలరించింది.

మారుతి సుజుకి జిప్సీని సాధారణ కొనుగోలుదారుల కోసం కంపెనీ చాలా కాలం క్రితం నిలిపివేసింది. అయినప్పటికీ, ఈ పాపులర్ ఆఫ్-రోడర్ భారత సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి ఇండియన్ ఆర్మీలో ఇప్పటికీ ఓ భాగంగా ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇండియన్ ఆర్మీ కూడా ఇప్పుడు ఈ మేడ్ ఇండియా జిప్సీ ఎస్యూవీని పక్కన పెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీలో సుదీర్ఘ సేవలను అందించిన మారుతి సుజుకి జిప్సీకి ఇప్పుడు రిటైర్ అయ్యే సయమం ఆసన్నమైంది.

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుతం దేశంలో అనేక అధునాతనమైన 4X4 వాహనాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం, ప్రస్తుతం భారత సైన్యంలో ఉన్న దాదాపు 35,000 యూనిట్ల మారుతి సుజుకి జిప్సీ ఎస్యూవీలను విక్రయించేసి, వాటి స్థానంలో కొత్త 4X4 వాహనాలను రీప్లేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో కొత్త లైట్ వెహికల్స్ జిఎస్ 4X4 (Light Vehicles GS 4X4) కొనుగోలు చేయాలన్న భారత సైన్యం ప్రతిపాదనను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆమోదించిన నేపథ్యంలో, జిప్సీలను విక్రయించే ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది.

తాజా అవసరాల ప్రకారం, భారత సైన్యం 4,964 కొత్త 4X4ల కొనుగోలుకు అనుమతిని పొందినట్లు నివేదించబడింది. ఇది ప్రభుత్వ ఆవశ్యకం కాబట్టి, ప్రతిపాదన కోసం అభ్యర్థన (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, RFP) జారీ చేయబడుతుంది మరియు దానిని అనుసరించి, వివిధ విక్రేతల నుండి 4X4 వాహనాల కొనుగోలును అంచనా వేయడానికి ట్రయల్ కూడా నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా, ఈ వాహనాలను బరువను కనీసం 500 కేజీల నుండి 800 కేజీలకు డిఏసి పెంచింది మరియు వివిధ రకాల భూభాగాలపై ఉపయోగించగల సాఫ్ట్-టాప్ 4X4 వాహనాల కోసం భారత సైన్యం వెతుకుతోంది.

ఇండియన్ ఆర్మీ ప్రత్యేకించి సాఫ్ట్-టాప్ 4X4 వాహనాలను ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రధానమైనది దాని తక్కువ బరువు మరియు అత్యవసర సమయాల్లో సులువుగా/తేలికగా ముందుకు సాగిపోవడం. కాబట్టి, భారత సైన్యం ఇప్పుడు అత్యంత శక్తివంతమైన మరియు సమర్థవంతమైన ఆఫ్-రోడ్ వాహనాలను తమ ఫ్లీట్లో కలిగి ఉండాలనుకుంటోంది. ప్రస్తుతం, టాటా సఫారీ స్టోర్మ్ కూడా దేశంలో సాధారణ పౌరుల కోసం అందుబాటులో లేనప్పటికీ, భారత సైన్యానికి సేవలు అందిస్తోంది.

భారత సైన్యం 2017లో టాటా మోటార్స్తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, 3,000 కంటే ఎక్కువ టాటా సఫారీ స్టోర్మ్ ఎస్యూవీలను టాటా మోటార్స్ భారత సైన్యానికి సరఫరా చేసింది. దీనితో పాటు, టాటా మోటార్స్ చెన్నైలో జరిగిన 2018 డిఫెన్స్ ఎక్స్పోలో టాటా సఫారి స్టోర్మ్ యొక్క 3-డోర్ల సాఫ్ట్-టాప్ వెర్షన్ను కూడా ప్రదర్శించింది. మారుతి సుజుకి జిప్సీ స్థానంలో ఈ మోడల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మహీంద్రా మరియు ఫోర్స్ మోటార్స్ నుండి కొత్తగా వచ్చిన థార్ మరియు గుర్ఖా 4X4 వాహనాలు కూడా ఈ అసెస్మెంట్ మరియు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది.

ఏదేమైనప్పటికీ, ఈ పరిణామాలను చూస్తుంటే, త్వరలోనే మారుతి సుజుకి జిప్సీ కూడా భారత సైన్యం నుండి నిష్క్రమించే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి, మారుతి సుజుకి జిప్సీకి భారతదేశంలో చాలా బలమైన ఫాలోయింగ్ ఉంది మరియు దానితో పాటు, కొత్త 4X4 వాహనాలు సైనికుల రవాణా కోసం భారత సైన్యానికి చాలా కీలకమైనవి. మారుతి సుజుకి జిప్సీని భర్తీ చేయడం అంత తేలికైన పని కాదు, అయితే ఆయుధాగారంలో భారీ శక్తివంతమైన ఆయుధాలతో, జిప్సీని మరింత ఆధునిక మరియు అధునాతన 4X4తో భర్తీ చేయడానికి ఇదే సరైన సమయం అనేది మా అభిప్రాయం.

సుజుకి జిమ్నీకి ఆర్మీలో ఏదైనా అవకాశం ఉంటుందా..?
ఇదిలా ఉంటే, మారుతి సుజుకి భారతదేశంలో సుజుకి జిమ్నీ ఎస్యూవీ యొక్క 3-డోర్ వెర్షన్ ను కంపెనీ యొక్క అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఇక్కడే స్థానికంగా తయారు చేస్తోంది. సుజుకి జిమ్నీ ఎస్యూవీని జిప్సీ యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్గా చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లోల ఇది హార్డ్ టాప్ మరియు 3-డోర్ వెర్షన్ గా అందుబాటులో ఉంది. మారుతి సుజుకి ఇటీవలే తమ జిమ్నీ వాహనాల తయారీకి భారతదేశాన్ని తమ గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా కూడా మార్చుకుంది. అంటే, ఇక్కడ భారత్లో తయారైన సుజుకి జిమ్నీ ఎస్యూవీలను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది.

ఓ నివేదిక ప్రకారం, భారతదేశంలో ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని మారుతి సుజుకి, జిమ్నీ ఎస్యూవీలో ఓ 5-డోర్ వెర్షన్ ను ఇక్కడి మార్కెట్లో కూడా విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే, ఈ చిన్న ఎస్యూవీ భారత రోడ్లపై పరీక్షించబడుతోంది. నిజానికి, మారుతి సుజుకి ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో బలమైన ఎస్యూవీ ఇంతవరకూ రాలేదు. ప్రస్తుతం, ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి నుండి లభిస్తున్న ఏకైక మోడల్ విటారా బ్రెజ్జా. ఈ మోడల్ కేవలం పెట్రోల్ ఇంజన్తో మాత్రమే లభిస్తుంది.

అమ్మకాల పరంగా, విటారా బ్రెజ్జా పనితీరు బాగానే ఉన్నప్పటికీ, ఎస్యూవీ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో కంపెనీ ఒకే ఒక మోడల్ను అందించడం ఎస్యూవీ ఔత్సాహికులను నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఇదే విభాగంలో, ఇతర కార్ కంపెనీలు ఒకటి కంటే ఎక్కువ ఎస్యూవీలను విక్రయిస్తున్నాయి. ఒకవేళ మారుతి సుజుకి తమ ప్లాన్లో భాగంగా, జిమ్నీ ఎస్యూవీని ఇక్కడి మార్కెట్లో విడుదల చేయగలిగితే, ఇదే ఎస్యూవీ యొక్క లైటర్ వెర్షన్ ఇండియన్ ఆర్మీకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందనేది మా అభిప్రాయం. మీరేమంటారు?
Source: ThePrint


Click it and Unblock the Notifications