భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెల్ తయారీ ప్లాంట్ను ప్రారంభించిన Log9 Materials.. ఎక్కడంటే..?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం, ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్లోని సెల్స్ను చాలా వరకూ ఆటోమొబైల్ కంపెనీలు విదేశాల నుంచి (ఎక్కువగా చైనా నుంచి) దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఈవీ తయారీదారుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన బ్యాటరీ సెల్స్ను అందించేందుకు బెంగుళూరుకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ముందుకు వచ్చింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.

బెంగళూరుకు చెందిన అధునాతన బ్యాటరీ-టెక్నాలజీ మరియు డీప్-టెక్నాలజీ స్టార్టప్ లాగ్9 మెటీరియల్స్ (Log9 Materials) నేడు భారతదేశపు మొట్టమొదటి దేశీయ సెల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది బెంగళూరులోని జక్కూరులో ఉన్న లాగ్9 క్యాంపస్లో ఏర్పాటు చేయబడి ఉంది. భారత ప్రభుత్వం నిర్ధేశించిన భవిష్యత్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ సెల్ తయారీ ప్లాంట్ కీలకంగా వ్యవహరించనుందని లాగ్9 మెటీరియల్స్ సంస్థ పేర్కొంది.

బెంగుళూరు నగరంలో లాగ్9 మెటీరియల్స్ ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక సెల్ తయారీ ప్లాంట్ ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద సెల్ ఉత్పత్తి శ్రేణిగా ఉండబోతోంది. భారతదేశంలో విక్రయించబడే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే సెల్లు మరియు బ్యాటరీలలో ఎక్కువ భాగం ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న తరుణంలో, ఈ ట్రెండ్ను మార్చేందుకు మరియు ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఈవీలుగా తీర్చిదిద్దేందుకు లాగ్9 శ్రీకారం చుట్టింది.

భారతదేశం 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటి బ్యాటరీ లభ్యత. మనదేశంలో బ్యాటరీల లభ్యత అంతంత మాత్రంగానే ఉండటంతో, తయారీదారులు ఇప్పుడు బ్యాటరీల కోసం విదేశాల వైపు చూస్తున్నారు. దిగుమతి చేసుకున్న బ్యాటరీలు మరియు సెల్స్ కారణంగా, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఖరీదు కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో, బ్యాటరీలు దేశీయంగానే లభించినట్లయితే, ఈవీలు మరింత సరసమైన ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

లాగ్9 మెటీరియల్స్ భారతదేశంలో మొట్టమొదటి సెల్ తయారీ ప్లాంట్ యొక్క ప్రారంభోత్సవ రోజును 'డే జీరో' (Day Zero)గా పిలుస్తోంది. ఈ స్టార్టప్ 2015లో ప్రారంభించబడినప్పటి నుండి ఈ రోజుతో సరిగ్గా 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. లాగ్9 యొక్క డే జీరో కాన్సెప్ట్ భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని పునర్నిర్మించడం, అలాగే రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఆవిష్కరణలను పునర్నిర్వచించడం మరియు ముఖ్యంగా, ఈ శుభ దినాన్ని గుర్తుచేసే ప్రత్యేక రోజును స్మరించుకోవడం వంటి ప్రారంభ దశను సూచిస్తుంది.

భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ శాశ్వతమైన పరివర్తనకు నాంది పలికేలా లాగ్9 ఈ రోజును డే జీరోగా ప్రకటిస్తూ, తమ అద్భుతమైన సెల్ ప్లాంట్ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించబడిన ఈ సెల్ తయారీ ప్లాంట్లో, లాగ్9 రాబోయే ఒక సంవత్సరంలో కనీసం 50 MWh గరిష్ట సెల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 GWh కంటే ఎక్కువకు పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఈ సందర్భంగా, లాగ్9 మెటీరియల్స్ సహ-వ్యవస్థాపకుడు మరియు సీఈఓ డాక్టర్ అక్షయ్ సింఘాల్ మాట్లాడుతూ, లాగ్9 భారతదేశపు మొట్టమొదటి సెల్ తయారీ లైన్ను ప్రారంభించడం తమకు చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉందని, ఇది భారతదేశ ఈవీ రంగంలో ఒక పెద్ద పురోగతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈవీ ఆధారిత భవిష్యత్తు కోసం దేశానికి సరైన ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉందని, అందుకే లాగ్9 కోసం, డే జీరో అనేది దేశీయంగా తయారైన సెల్ యొక్క కొత్త శకానికి నాంది పలికే రోజును సూచిస్తుందని ఆయన చెప్పారు.

ఈ ప్రత్యేకమై డే జీరో తమ సంస్థ యొక్క 7వ వార్షికోత్సవాన్ని కూడా సూచిస్తుంది, కాబట్టి ఇప్పటి వరకు తమ ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తమ ఉద్యోగులు చేసిన సంచలనాత్మక ప్రయత్నాలకు ఇది గుర్తింపుగా కూడా ఉంటుందని అన్నారు. లాగ్9 సెల్లు భారతదేశం కోసం భారతదేశంలో రూపొందించబడిన పూర్తి స్వదేశీ ఉత్పత్తి అని, అంటే దీని అర్థం లాగ్9 యొక్క సెల్లు మరియు బ్యాటరీలు భారతీయ ఆపరేటింగ్ పరిస్థితులు, వాతావరణం మరియు కస్టమర్ల అవసరాలకు బాగా సరిపోతాయని అక్షయ్ చెప్పారు.

లాగ్9 మెటీరియల్స్ నిర్వహించిన ఈ డే జీరో కార్యక్రమంలో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చైర్పర్సన్ డాక్టర్ కె శివన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖా కమీషనర్ శ్రీమతి. గుంజన్ కృష్ణ ఐఏఎస్ గౌరవ అతిథిగా విచ్చేశారు. ఇతర ప్రముఖలలో లాగ్9 పెట్టుబడిదారులు, సలహాదారులు, వ్యాపార భాగస్వాములు మరియు పర్యావరణ వ్యవస్థ భాగస్వాములు కూడా ఉన్నారు. అలాగే, అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ (ARBL), ఉమికోర్, సిబిసి మరియు బ్లూస్మార్ట్ వంటి కంపెనీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లాగ్9 మెటీరియల్స్ గురించి క్లుప్తంగా..
లాగ్9 మెటీరియల్స్ అనేది దేశీయ డీప్-టెక్ మరియు అధునాతన బ్యాటరీ-టెక్ స్టార్టప్ కంపెనీ. వాతావరణ మార్పులకు (క్లైమేట్ చేంజ్)కి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ కంపెనీ తయారు చేసే బ్యాటరీలు లేదా సెల్స్ 9 రెట్లు వేగంగా ఛార్జ్ అవుతాయని, 9 రెట్లు ఎక్కువ రేంజ్ను అందిస్తాయని మరియు 9 రెట్లు అధిక పనితీరు మరియు భద్రతను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఎలక్ట్రోడ్ మెటీరియల్స్ నుండి సెల్ ఫ్యాబ్రికేషన్ మరియు బ్యాటరీ ప్యాక్ల తయారీ వరకు అంతర్గత సామర్థ్యాలను కలిగి ఉన్న ఏకైక భారతీయ కంపెనీ లాగ్9 మెటీరియల్స్. లాగ్9కి సీక్వోయా మరియు ఎక్స్ఫినిటీ వెంచర్స్ వంటి ప్రముఖ VCలు మరియు అమర రాజా బ్యాటరీస్ మరియు పెట్రోనాస్ (మలేషియా) వంటి వ్యూహాత్మక పెట్టుబడిదారులు నిధులు సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications








