రూ.63,000 వరకూ పెరిగిన మహీంద్రా కార్ల ధరలు.. జులై 2022లో కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఆవిష్కరణ..
దేశంలో ఓవైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కొనుగోలుదారులు సతమతం అవుతుంటే, ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూ కస్టమర్లపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra), తమ ప్యాసింజర్ కార్ల ధరలు 2.5 శాతం వరకూ పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల సవరణ తర్వాత, మోడల్ను బట్టి మహీంద్రా వాహనాల ధరలు రూ.63,000 వరకూ పెరిగాయి.

పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు మహీంద్రా ప్రకటించింది. తాజా ధరల పెంపుతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా విక్రయిస్తున్న ఎంట్రీలెవల్ మోడల్ కార్లు మొదలుకొని, లగ్జరీ కారు ఆల్ట్యూరాస్ జి4 వరకూ దాదాపు అన్ని మోడళ్ల ధరలు పెరిగాయి. అంతేకాకుండా, ఈ బ్రాండ్ నుండి కొత్తగా వచ్చిన మహీంద్రా థార్ మరియు మహీంద్రా ఎక్స్యూవీ700 ఫ్లాగ్షిప్ మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు కూడా ప్రభావితం అయ్యాయి.

కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మహీంద్రా వాహనాల ధరలు రూ. 10 వేల నుంచి రూ. 63 వేల వరకు (మోడల్ మరియు వేరియంట్ ను బట్టి) ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఏయే మోడల్పై కంపెనీ ఖచ్చితంగా ఎంత మేర ధరలు పెంచిందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే, కంపెనీ ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. లేదంటే, కస్టమర్లు తమకు సమీపంలో అధీకృత మహీంద్రా డీలరును సంప్రదించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభం మరియు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాహన తయారీ కంపెనీలు ధరలను పెంచడం ఆటోమొబైల్ పరిశ్రమలో సాధారణమైన పద్దతే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఇంధన ధరలు కూడా వాహనాల ధరల పెంపులో కీలక పాత్ర పోషించాయి. ఇటీవలి కాలంలోవాహనాల తయారీలో ప్రధానంగా ఉపయోగించే స్టీల్, అల్యూమినియం మరియు పల్లాడియం వంటి కీలక పదార్థాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో తయారీదారులపై అదనపు భారం పడుతోంది.

ఈ నేపథ్యంలో, ఆటోమొబైల్ కంపెనీలు తమపై పడుతున్న ముడి సరుకుల ధరల భారాన్ని కాస్తయినా తగ్గించుకునేందుకు, ఆ భారాన్ని ప్రజలపైకి మళ్ళిస్తున్నారు. దేశంలో ఇప్పటికే మారుతి సుజుకి, టాటా మోటార్స్ (వాణిజ్య వాహనాల విభాగం), హీరో మోటోకార్ప్, సుజుకి మోటార్సైకిల్స్, ఆడి మరియు బిఎమ్డబ్ల్యూ వంటి కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇదే కోవలం మహీంద్రా కూడా ఇప్పుడు తమ వాహనాల ధరలను 2.5 శాతం వరకూ పెంచుతున్నట్లు ప్రకటించింది.

మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ (Mahindra Born Electric)..
ఇదిలా ఉంటే, మహీంద్రా ఇప్పుడు తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్కు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా అధునాతన ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు, కంపెనీ అభివృద్ధి చేస్తున్న మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను టీజర్ చిత్రాలను కూడా ఇటీవలే విడుదల చేసింది. ఈ టీజర్ ప్రకారం, మహీంద్రా తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను జులై 2022 లో అధికారికంగా ఆవిష్కరించనుంది.

మహీంద్రా తమ కొత్త తరం ఎలక్ట్రిక్ వాహనాల కోసం "మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్" (Mahindra Born Electric) అనే అధికారిక సోషల్ మీడియా ఖాతాను కూడా ఓపెన్ చేసింది. ఈ పేజీలో కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఫొటోలను టీజర్లుగా పోస్ట్ చేస్తోంది. ఈ ఎస్యూవీ స్పెషలిస్ట్ ప్రస్తుతం మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లపై పని చేస్తోంది మరియు కంపెనీ వీటికి బోర్న్ ఎలక్ట్రిక్ రేంజ్ (Born Eelectric Range) అని పేరు పెట్టింది. ఈ మూడు మోడళ్లలో మహీంద్రా నుండి ముందుగా ఓ ఎస్యూవీ మోడల్ మార్కెట్లోకి రావచ్చని ఈ టీజర్ చిత్రాలను చూస్తుంటే అర్థమవుతుంది.

ప్రస్తుతం, దేశంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, కంపెనీ ముందుగా ఈ విభాగంలో తమ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త టీజర్లో ఎలక్ట్రిక్ వాహనం లోపలి భాగాన్ని కూడా టీజ్ చేశారు, ఇది కాక్పిట్-స్టైల్ రూపాన్ని కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. కారు లోపలి భాగంలో సెంటర్ కన్సోల్ నుండి డ్రైవర్ సైడ్ డోర్ వరకు ఎల్ఈడి లైట్లు కనిపిస్తాయి. అలాగే, సెంటర్ కన్సోల్పై రోటరీ నాబ్ మరియు లివర్ కూడా చూడవచ్చు. బహుశా ఇది డ్రైవ్ మోడ్ సెలెక్టర్లకు సంబంధించినదేమో.

ఈ ప్రోటోటైప్ ఎస్యూవీలో వ్రాప్అరౌండ్ హెడ్రెస్ట్లతో కూడిన బకెట్ సీట్లను కలిగి ఉంది. సరికొత్త అల్లాయ్ వీల్స్, సైడ్ మిర్రర్స్ స్థానంలో రియర్ వ్యూ కెమెరాలు, పానోరమిక్ సన్రూఫ్, మహీంద్రా ఎక్స్యూవీ700 లాంటి డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఎల్ఈడి టెయిల్ లైట్లు వంటి అనేక ఫీచర్లు ఈ టీజర్లలో వెల్లడయ్యాయి. యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరోప్ ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను అభివృద్ధి చేసింది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు జులై 2022 లో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications