Mahindra నుండి తర్వాత రాబోయే అతిపెద్ద లాంచ్ ఇదే.. టీజర్ చూస్తేనే మైండ్ బ్లాంక్ అవుద్ది..!!
ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra), ఇటీవలే తమ సరికొత్త ఎక్స్యూవీ700 (Mahindra XUV700) ఎస్యూవీని అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసినదే. కొత్త తరం థార్ మరియు సరికొత్త ఎక్స్యూవీ700 మోడళ్ల లాంచ్ తో వరుస విజయాలను దక్కించుకున్న మహీంద్రా, ఇప్పుడు మరో అతిపెద్ద లాంచ్ కు సిద్ధమవుతోంది. తాజాగా, కంపెనీ ఇందుకు సంబంధించి ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా ప్రవేశపెట్టబోయే తమ తర్వాతి కారు, గతంలో కంపెనీ విక్రయించిన కార్ల కన్నా ఎంతో భిన్నంగా, ఫూచరిస్టిక్ గా ఉండబోతోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ చూస్తే, ఈ విషయం స్పష్టమవుతోంది. మహీంద్రా ఈసారి పెట్రోల్, డీజిల్ కార్లను కాకుండా, ఓ అధునాతన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. ఈ టీజర్ ప్రకారం, మహీంద్రా ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని జులై 2022 లో అధికారికంగా ఆవిష్కరించనుంది. ప్రస్తుతానికి కంపెనీ ఇంకా ఈ కారుకి ఎలాంటి పేరును నిర్ధారించలేదు.

మహీంద్రా తమ కొత్త తరం ఎలక్ట్రిక్ వాహనం కోసం "మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్" (Mahindra Born Electric) అనే అధికారిక సోషల్ మీడియా ఖాతాను కూడా ఓపెన్ చేసింది. ఈ పేజీలో కంపెనీ పోస్ట్ చేసిన టీజర్ లో, "ఇదేమీ సైన్స్ ఫిక్షన్ కాదు, నిజానికి ఇది ఎలక్ట్రిక్ లక్ష్యంతో పుట్టింది. రండి, భవిష్యత్తులోకి అడుగుపెడదాం. జులై 2022 లో ఆవిష్కరించబడుతుంది" అని ట్వీట్ చేయబడి ఉంది. ఇందులో కొన్ని ఇంటీరియర్ వివరాలను వెల్లడించే చిత్రాలను మినహా కంపెనీ ఇతర వివరాలను ఇంకా వెల్లడి చేయలేదు.

ఈ ఎస్యూవీ స్పెషలిస్ట్ బ్రాండ్ ప్రస్తుతం మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లపై పని చేస్తోంది మరియు కంపెనీ వీటికి బోర్న్ ఎలక్ట్రిక్ రేంజ్ (Born Eelectric Range) అని పేరు పెట్టింది. ఈ మూడు మోడళ్లలో మహీంద్రా నుండి ముందుగా ఓ ఎస్యూవీ మోడల్ మార్కెట్లోకి రావచ్చని ఈ టీజర్ చిత్రాలను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం, దేశంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, కంపెనీ ముందుగా ఈ విభాగంలో తమ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం, భారతదేశంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అగ్రగామిగా ఉంది. మరోవైపు మారుతి సుజుకి కూడా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తుంది. అలాగే, హ్యుందాయ్, ఎమ్జి మోటార్ వంటి కంపెనీలు కూడా ఈ విభాగంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీలను విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మహీంద్రా ఈ రేసులో వెనుకబడి ఉండాలనుకోవట్లేదు. అందుకే మహీంద్రా కొత్త ప్లాట్ఫారమ్పై ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉంది.

నిజానికి, మహీంద్రా దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ. రేవా ఎలక్ట్రిక్ (Reva Electric) కార్ కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత, మహీంద్రా రేవా (Mahindra Reva) బ్రాండ్ పేరుతో కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం ప్రారంభించింది. ఆ తర్వా ఇ-వెరిటో పేరుతో ఓ ఎలక్ట్రిక్ సెడాన్ ను కూడా ప్రవేశపెట్టింది. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనాలేవీ మహీంద్రా సంస్థకు ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో ఈసారి చాలా గట్టి ప్లాన్స్ తో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది.

ఈ టీజర్లో చూసినట్లుగా, బోర్న్ ఎలక్ట్రిక్ శ్రేణిలో మహీంద్రా ప్రస్తుతానికి కేవలం ఎలక్ట్రిక్ ఎస్యూవీలను మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా ఇంకా హ్యాచ్బ్యాక్ మరియు సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశించ లేదు. మహీంద్రా తమ మొదటి ప్రొడక్షన్-స్పెక్ బోర్న్ ఈవీని 2025 మరియు 2026 మధ్య కాలంలో పరిచయం చేయవచ్చని సమాచారం. ఈ బోర్న్ ఈవీ వాహనాలు పూర్తిగా కొత్త మరియు డెడికేటెడ్ ఎలక్ట్రిక్ కార్ ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటాయి.

ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్ఫారమ్ మహీంద్రా ఇ-వెరిటో మరియు రాబోయే మహీంద్రా ఇ-ఎక్స్యూవీ300 ఎలక్ట్రిక్ ఈవీ పవర్ట్రెయిన్ కోసం సవరించిన ICE (ఇంటర్నల్ కంబష్ ఇంజన్) వాహన ప్లాట్ఫారమ్ ఆధారంగా మహీంద్రా రూపొందించిన మొదటి గ్రౌండ్-అప్ ప్లాట్ఫారమ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఏప్రిల్ 2023 నాటికి తమ పాపులర్ ఎక్స్యూవీ300 మోడల్ ఆధారంగా ఓ సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును కూడా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామి కంపెనీలలో ఒకటైన మహీంద్రా ఎలక్ట్రిక్, ఇప్పటి వరకూ తాము విక్రయించిన ఎలక్ట్రిక్ వాహనాలు అన్నీ కలిపి సుమారు 400 మిలియన్ కిలోమీటర్లు చుట్టాయని, ఇవి దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఆదా చేశాయని, ఇది మొత్తం 18.5 లక్షల చెట్లను నాటడానికి సమానమని కంపెనీ తెలిపింది. మహీంద్రా ప్రస్తుతం ఇ-వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ మరియు ట్రియో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications