థార్ ఎన్ఎఫ్టీ (Mahindra Thar NFT) లను వేలం వేయనున్న మహీంద్రా.. కారణం ఏంటంటే..?
భారతదేశపు యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) నేడు (మార్చి 29, 2022) తమ ఐకానిక్ థార్ ఎస్యూవీ ఆధారిత నాన్ ఫంగబుల్ టోకెన్లను (NFT) వేలం వేయనుంది. దీంతో NFT రంగంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అవతరించనుంది. ఈ వేలంలోని విజేతలు మహీంద్రా యొక్క ఆఫ్-రోడింగ్ ట్రాక్లలో ఒకదానిపై థార్ను అనుభవించే అవకాశాన్ని కూడా పొందుతారు.

నాన్ ఫంగబుల్ టోకెన్ అనేది ఇతర NFTల నుండి వేరు చేసే ప్రత్యేక గుర్తింపు కోడ్లు మరియు మెటాడేటాను కలిగి ఉండే ఒక క్రిప్టోగ్రాఫిక్ అసెట్. ఇతర క్రిప్టోకరెన్సీల మాదిరిగా కాకుండా, నాన్ ఫంగబుల్ టోకెన్లు వర్తకం చేయబడవు లేదా విక్రయించబడవు. కాబట్టి, ఇవి వాణిజ్య లావాదేవీలకు మాధ్యమంగా పనిచేయవు. మహీంద్రా మార్చి 29వ తేదీన ఐకానిక్ థార్ ఎస్యూవీ ఆధారంగా నాలుగు నాన్ ఫంగబుల్ టోకెన్ల ఆఫర్లను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.

వేలంలో ఈ నాలుగు థార్ నాన్ ఫంగబుల్ టోకెన్ల (Thar NFTs) విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద బాలికల విద్యకు మద్దతుగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ నాన్హి కాలిస్ (Project Nanhi Kalis) కు వెళుతుందని కంపెనీ తెలిపింది. మహీంద్రా యొక్క అనుబంధ సంస్థ అయిన టెక్ మహీంద్రా సహాయంతో ఈ నాలుగు ఎన్ఎఫ్టీలను విడుదల చేస్తోంది. థార్ ఎస్యూవీ ఆధారంగా ఈ నాలుగు నాన్ ఫంగబుల్ టోకెన్ల వేలం TechMahindra యొక్క NFT మార్కెట్ ప్లేస్ 'మహీంద్రా గ్యాలరీ'లో నిర్వహించబడుతుంది.

మహీంద్రా థార్ ఎస్యూవీ ఆధారిత నాలుగు నాన్ ఫంగబుల్ టోకెన్ల వేలం గురించి మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటోమోటివ్ డివిజన్) సీఈఓ వీజయ్ నక్రా మాట్లాడుతూ, "NFTల ప్రారంభం డిజిటల్ మార్కెటింగ్ యొక్క తదుపరి సరిహద్దును ప్రభావితం చేయడానికి మాకు మరో ఉత్తేజకరమైన దశగా నిలుస్తుంది. మా కస్టమర్లకు సరికొత్త అనుభవాలను అందించడం, మా బ్రాండ్ల కోసం కమ్యూనిటీలను నిర్మించడం మరియు బ్రాండ్ అవగాహన మరియు విధేయతను పెంచడంలో ఇవి ఎంతగానో సహకరించనున్నాయి" అని చెప్పారు.

మహీంద్రా విక్రయించే ఎన్ఎఫ్టీలు థార్ ఎస్యూవీ యొక్క రెండవ తరం మోడల్పై ఆధారపడి ఉంటాయి. లైఫ్ స్టైల్ ఎస్యూవీ విభాగంలో వచ్చిన మహీంద్రా థార్ ఎస్యూవీ 2010 నుండి దేశవ్యాప్తంగా ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులకు మరింత ప్రియమైన మోడల్గా మారింది. అక్టోబర్ 2010లో థార్ ఎస్యూవీని ప్రారంభించిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత, కంపెనీ ఇందులో ఓ రెండవ తరం మోడల్ను ఆగస్టు 15, 2020న భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది మొదటి తరం కన్నా ఎంతో అధునాతనంగా మారింది.

కొత్త తరం థార్ ఎస్యూవీని రాకతో, దీనిని కేవలం ఆఫ్-రోడ్ ప్రియులు మాత్రమే కాకుండా, నిత్యం సిటీలలో ప్రయాణించే వారు కూడా తమ రోజూవారీ కమ్యూటింగ్ కోసం కొనుగోలు చేయడం ప్రారంభించారు. సెకండ్ జనరేషన్ మహీంద్రా థార్ ఎస్యూవీని దాని పాత తరం మోడళ్ల కంటే అన్ని విధాలుగా పెద్దదిగా ఉంటుంది. కొత్త మహీంద్రా థార్ పొడవు 3,985 మిమీ, వెడల్పు 1,820 మిమీ, ఎత్తు 1,920 మిమీ మరియు దాని వీల్బేస్ 2,450 మిమీగా ఉంటుంది.

సెకండ్ జనరేషన్ థార్ ఎస్యూవీలో కంపెనీ శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ను కూడా పరిచయం చేసింది. అంతేకాకుండా, ఇందులోని డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్లు రెండింటిలో కూడా ఆటోమేటిక్ గేర్బాక్స్ సౌకర్యాన్ని అందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఇది ఏఎక్స్ ఆప్షనల్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

కొత్త మహీంద్రా థార్ను సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టారు. ఇందులోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్పి పవర్ను మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.2-లీటర్ ఎమ్హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్పి పవర్ను మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా థార్ ఏఎక్స్ ఆప్షనల్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభిస్తుంది. కాగా, థార్ ఎల్ఎక్స్ వేరియంట్ మ్యాన్యువల్ గేర్బాక్స్ తో పాటుగా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్తో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్యూవీలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ను స్టాండర్డ్గా అందిస్తున్నారు. ఇది అన్ని వేరియంట్లలో స్టాండర్డ్గా లభిస్తుంది.

మార్కెట్లో థార్ ఎస్యూవీ ధరలు రూ.13.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. అయితే, కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి. కంపెనీ ఈ ఎస్యూవీని ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచింది. మహీంద్రా మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్-రోడర్కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్ను కూడా అందిస్తోంది.

మహీంద్రా ఈ ఎస్యూవీలో అనేక ఫీచర్లు మరియు పరికరాలను అందిస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications