భారతదేశం నుండి రికార్డు స్థాయిలో కార్లను ఎగుమతి చేసిన Maruti Suzuki
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) అందిస్తున్న కార్లకు అంతర్జాతీయ మార్కెట్ల నుండి డిమాండ్ పెరుగుతోంది. గతేడాది, కంపెనీ భారతదేశం నుండి రికార్డు స్థాయిలో వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. మారుతి సుజుకి 2021లో మొత్తం 2,05,450 యూనిట్లను భారతదేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. ఇది కంపెనీ యొక్క మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ గ్లోబ్ ప్లాన్ను ప్రతిబింబిస్తుంది.

గ్లోబల్ మార్కెట్లలో తాము మంచి విజయాన్ని పొందుతున్నామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం, మారుతి సుజుకి భారతదేశంలో తయారు చేసిన కార్లను సుమారు 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ కెనిచి అయుకావా మాట్లాడుతూ.. మారుతి సుజుకి సాధించిన ఈ మైలురాయి తమ కార్ల నాణ్యత, సాంకేతికత, విశ్వసనీయ మరియు పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

ఈ విజయం పట్ల తమ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ మరియు తాము ఇద్దరూ గర్విస్తున్నామని, ప్రస్తుత సవాలు సమయాల్లో సహాయం చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. మారుతి సుజుకి తన వాహనాలను తొలిసారిగా 1986లో ఎగుమతి చేయడం ప్రారంభించింది, మొదటి వాహనాలు హంగేరీకి పంపబడ్డాయి.

మారుతి సుజుకి ఇప్పటివరకు 21.85 లక్షల యూనిట్లను వివిద దేశాలకు ఎగుమతి చేసింది. వీటిలో కంపెనీకి ప్రధాన మార్కెట్గా పనిచేసే అమెరికా, ఆఫ్రికా, ఆసియాన్ దేశాలున్నాయి. కంపెనీ తన 15 మోడళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తుంది, ఇందులో బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో మొదలైనవి ఉన్నాయి. మారుతి సుజుకి తమ విదేశీ ఎగుమతుల్లో మొదటి పది లక్షల మైలురాయిని 2012-13 ఆర్థిక సంవత్సరంలో సాధించింది.

మొదటి పది లక్షల వాహనాల్లో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ వాహనాలను ఐరోపాలోని అభివృద్ధి చెందిన మార్కెట్లకే ఎగుమతి చేసింది. కాగా, గతేడాది మార్చ్ నెల నాటికి కంపెనీ తమ విదేశీ ఎగుమతుల్లో 20 లక్షల మైలురాయిని చేరుకుంది. మారుతి సుజుకి గత ఏడాది జనవరిలో, సుజుకి యొక్క పాపులర్ కాంపాక్ట్ ఆఫ్-రోడర్ జిమ్నీ ఎస్యూవీని భారతదేశంలోనే ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఈ మోడల్ భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కంపెనీ ఇంకా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.

కొత్త సంవత్సరంలో మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి
సెమీకండక్టర్ చిప్స్ కొరత మరియు ఇతర సమస్యల కారణంగా మారుతి సుజుకి గత కొన్ని నెలలుగా వాహనాలను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది. అయితే, ఇటీవలి కాలంలో చిప్స్ సరఫరా సాధారణ స్థితికి చేరుతున్న నేపథ్యంలో, కొత్త సంవత్సరంలో కార్ల ఉత్పత్తి మెరుగ్గా ఉండగలదని కంపెనీ అంచనా వేస్తోంది. వాహనలా ఉత్పత్తి పరంగా, కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికంలో మెరుగ్గా ఉంది, ఈ సమయంలో కంపెనీ మారుతి సుజుకి 4,92,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది.

వచ్చే త్రైమాసికంలో సుమారు 4,70,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. తగ్గిన వాహన ఉత్పత్తి కారణంగా, కంపెనీ అందిస్తున్న పలు మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ పెరిగింది. దీంతో కంపెనీ అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే, రానున్న రోజుల్లో వాహనాల ఉత్పత్తి మెరుగుపడనున్న నేపథ్యంలో, కంపెనీ అమ్మకాలు కూడా మెరుగ్గా ఉంటాయని మారుతి సుజుకి భావిస్తోంది.

ఈ ఏడాది మార్చ్ తో ముగియనున్న నాల్గవ త్రైమాసికంలో కంపెనీ దాదాపు 470,000 యూనిట్ల నుండి 490,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే, ఈ దశాబ్దంలో మారుతి సుజుకి సంస్థకు అతిపెద్ద వార్షిక పెరుగుదల కావచ్చు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ విక్రయాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఏడాది అమ్మకాలు మెరుగ్గా ఉండవచ్చని ఆశిస్తున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 23.5 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ 492,000 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇప్పటి వరకు సుమారు 280,000 బుకింగ్లు పెండింగ్లో ఉన్నట్లు నివేదించబడింది. దీని కారణంగా చాలా వాహనాలపై దాదాపు 3-6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. గడచిన పండుగ సీజన్ నుండి కంపెనీవాహనాలకు మంచి డిమాండ్ ఉంటోంది. అయితే, డిమాండ్ కు అనుగుణంగా సప్లయ్ లేకపోవడంతో మారుతి సుజుకి వాహనాల వెయిటింగ్ పీరియడ్ నిరంతరం పెరుగుతోంది.

మారుతి సుజుకి వచ్చే త్రైమాసికంలో దాదాపు 85-90 శాతం సామర్థ్యంతో తమ ప్లాంట్లన నిర్వహించనుంది. అయితే గడచిన ఆగస్టు నుండి నవంబర్ 2021 వరకూ వాహనాల ఉత్పత్తి తక్కువగా ఉంది. ప్రస్తుతం, దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కార్యకలాపాల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తమ విక్రేతలకు మరియు సిబ్బందికి సూచనలు చేసింది.


Click it and Unblock the Notifications








