భారతదేశంలో రూ.10 లక్షల లోపు ఎలక్ట్రిక్ కారును తీసుకురావడం చాలా కష్టం: Maruti Suzuki
మనదేశంలో టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్యాసింజర్ కార్ కంపెనీలతో పాటుగా మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ మరియు వోల్వో వంటి లగ్జరీ కార్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసినదే. భారతదేశంలో ఓ గ్లోబల్ ఈవీ హబ్గా ఎదుగుతున్న తరుణంలో, దేశీయ కార్ కంపెనీలతో పాటుగా ప్రపంచ దేశాలకు చెందిన కార్ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టాటా మోటార్స్ ఇప్పటికే సింహ భాగం వాటాను కలిగి ఉంది. బడ్జెట్ కారు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని ఈ కంపెనీ సరసమైన ధరకే ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెట్టింది. అయితే, ఈ బ్రాండ్కి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును మనం రోడ్లపై చూడాలంటే, 2025 వరకూ ఆగాల్సిందే. దేశంలోనే చవకైన కార్ బ్రాండ్గా ఉన్న మారుతి, ఎలక్ట్రిక్ కార్ల విషయంలో మాత్రం ఖరీదైన బ్రాండ్గానే ఉండే అవకాశం ఉంది.

భారతదేశంలో రూ.10 లక్షల ధర లోపు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం సాధ్యం కాకపోవచ్చని మారుతి సుజుకి కొత్త సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హిసాహి టేకుచి ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారతదేశంలో ఎవరైనా సరసమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే, అది మారుతి సుజుకి అయి ఉండాలని, కాకపోతే ఇప్పటికే ఈవీలు దేశంలో చాలా ఖరీదైనవిగగా మారిపోయాయని ఆయన చెప్పారు. ప్రస్తుత సాంకేతికతలో భాగంగా, ఓ సరసమైన ఈవీని తయారు చేయడం చాలా కష్టమని, బహుశా ఇది అంత త్వరగా కాకపోవచ్చని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే విడిభాగాలలో అత్యంత ఖరీదైనది అందులో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్స్. కాబట్టి, ఖరీదైన బ్యాటరీల కారణంగా దేశంలో రూ.10 లక్షల లోపు ఈవీని తయారు చేయడం కష్టమని, ఒకవేళ కస్టమర్లు చిన్న బ్యాటరీలను అంగీకరించడం మొదలుపెడితే అది సాధ్యమవుతుందని టేకుచి అన్నారు. తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ కారణంగా, సదరు ఈవీ రేంజ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి, కస్టమర్లు ఈ విషయంలో ఆందోళన చెందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

ఖరీదైన సాంకేతికత మరియు బ్యాటరీలే ఈవీ ధరల పెరుగుదలకు కారణం అని, రానున్న మూడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అధికంగా పెరిగినప్పటికీ వాటి ధరలు మాత్రం తగినంతగా తగ్గుతాయని తాను ఊహించలేదని టేకుచి చెప్పారు. సాధారణంగా, ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే శాతం లిథియం అయాన్ బ్యాటరీ సదరు కారు యొక్క మొత్తం ధరలో దాదాపు 40 శాతం ఉంటాయి. అయితే, చిన్న బ్యాటరీలు తక్కువ ధరతో పాటు తక్కువ రేంజ్ని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి, ఇలాంటి చిన్న బ్యాటరీలతో వచ్చే సరసమైన ఈవీలను ఆచరణాత్మకంగా చేయాలంటే, దేశంలో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల విస్తృతమైన నెట్వర్క్ చాలా అవసరం.

భారతదేశంలో చార్జింగ్ మౌళిక సదుపాయాలు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. కానీ, దీని వేగం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ వేగం కన్నా చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే, దేశంలో అడుగడునా ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయో, అప్పుడు కస్టమర్లు తక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పూర్తి సామర్థ్యంలో వినియోగించుకోగలరు. బ్యాటరీ సామర్థ్యం తగ్గితే, సదరు ఎలక్ట్రిక్ కారు ధర కూడా తగ్గుతుంది. కాబట్టి, దేశంలో సరసమైన ఈవీలను తీసుకురావడానికి ప్రస్తుతం ఇదొక్కటే మార్గంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం, భారతదేశంలో టాటా టిగోర్ ఈవీ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉంది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధర రూ.12.24 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. కాగా, టాటా నెక్సాన్ ఈవీ ధరలు రూ.14.54 నుండి ప్రారంభం అవుతాయి. అలాగే, ఎమ్జి మోటార్స్ విక్రయిస్తున్న జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధరలు రూ.21.49 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. ఎమ్జి మోటార్ భారత మార్కెట్ కోసం రూ.10-15 లక్షల రేంజ్లో ఓ ఎలక్ట్రిక్ కారును కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇకపోతే, కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ విక్రయిస్తున్న కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధర రూ.23.79 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

ముందుగా వ్యాగన్ఆర్ ఈవీ వచ్చే ఛాన్స్..
మారుతి సుజుకి గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలో తమ వ్యాగన్ఆర్ ఈవీ (ఎలక్ట్రిక్ వెర్షన్ వ్యాగన్ఆర్) కారును పరీక్షిస్తోంది. మారుతి సుజుకి 2025 లోపు తమ వ్యాగన్ఆర్ ఈవీని విడుదల చేయాలని యోచిస్తోందని. అయితే, కంపెనీ డీజిల్ వాహనాల తయారీని పూర్తిగా నిలిపివేయడంతో, ఎలక్ట్రిక్ వాహనాల కంటే ముందుగా సిఎన్జి మరియు ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. సమాచారం ప్రకారం, ఎలక్ట్రిక్ వెర్షన్ వ్యాగన్ఆర్ ఈ దేశీయ బ్రాండ్ నుండి రాబోయే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications